విపక్ష పాలిత రాష్ర్టాలను వేధించటంపైన, కూల్చటంపైన ఉన్న శ్రద్ధ.. రాష్ర్టాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించటంపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి లేదు. సువిశాలమైన, వైరుధ్యభరితమైన దేశం కావడం వల్ల రాష్ర్టాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక్కోసారి విభేదాలు తలెత్తడం సహజం. కొన్ని చారిత్రకంగా సంక్రమించిన వివాదాలైతే, కొన్ని అపార్థాల మూలంగా తలెత్తినవి. వీటిని పరిణతితో, నిష్పక్షపాతంగా, పెద్దరికంతో పరిష్కరించడం కేంద్రం బాధ్యత. కానీ నాడు కాంగ్రెస్ కావచ్చు, నేటి బీజేపీ కావచ్చు కేంద్రంలో అధికారం నెరపడం అంటే జులుం చేయడమనే దురహంకారం కలిగి ఉండటం వల్ల రాష్ర్టాల మధ్య సమస్యలు రగిలి ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. దశాబ్దాల కొద్దీ సమస్యలు ముదిరిపోతున్నా కేంద్రం ఏ మాత్రం పట్టనట్టుగా ఉంటున్నది. ఈ బాధ్యతారాహిత్యం భవిష్యత్తులో ప్రమాదకర పరిణామాలకు దారి తీయవచ్చు.
ఈశాన్యంలో అస్సాం, మేఘాలయ సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగడం కేంద్రం మొక్కుబడి చర్యలకు తాజా ఉదాహరణ. కలప అక్రమ రవాణా చేస్తున్నారన్న ఆరోపణలపై అస్సాం పోలీసులు ఇటీవల జరిపిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ గ్రామీణులు మరణించారు. ఇప్పటికే ఇరు రాష్ర్టాల మధ్య సరిహద్దు గొడవలపై చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇంతలో ఈ ఘటనతో సమస్య మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ఒక్కటే కాదు, ఈశాన్యంలోనే పలు రాష్ర్టాల మధ్య వివాదాలున్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ విభేదాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలు కూడా కీచులాడుకుంటున్నాయి. మరాఠీ మాట్లాడే ప్రజలున్న సరిహద్దు ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర అంటుంటే, కన్నడ మాట్లాడే ప్రజలున్న గ్రామాలను తమ రాష్ట్రంలో విలీనం చేయాలని కర్ణాటక అంటోంది. ఈ వివాదం ఇప్పటిది కాదు. సుప్రీంకోర్టుకూ వెళ్లింది. తాజాగా కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలతో గొడవ మరింత వేడెక్కింది. కేంద్రంలోనూ, ఈ రెండు రాష్ర్టాలలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ వివాదం చెలరేగడం గమనార్హం.
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లయ్యింది. అయినా ఇప్పటికీ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య అనేక అంశాలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తన హామీలను నెరవేర్చడం లేదు. రాష్ర్టాలను సమన్వయపర్చుకోవటం, వాటి మధ్య వచ్చే విభేదాలను మధ్యవర్తిగా ఉండి పరిష్కరించటం, అభివృద్ధి దిశగా దేశాన్ని తీసుకువెళ్లటం కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయడం, గవర్నర్ల ద్వారా వేధించడం, ఐటీ దాడులు నిర్వహించడం మొదలైన కుత్సిత చర్యలకు పాల్పడే బదులు మోదీ ప్రభుత్వం సత్పరిపాలన దిశగా దృష్టి సారిస్తే బాగుండేది. దేశాభ్యుదయాన్ని కాంక్షించే వారందరూ మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలి. కేంద్ర రాష్ర్టాల మధ్య సత్సంబంధాలను పటిష్ఠపరచాలి.