కొన్నిసార్లు రాజకీయాలు అసలు విషయాలను కొసరుగా మారుస్తాయి. కొసరు విషయాలను అసలుగా మారుస్తాయి. నాలుగు ఆకులు ఎక్కువ చదివిన నాయకులైతే మొత్తానికే ఎసరు పెడతారు. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ కవిత విషయంలో జరుగుతున్న తతంగం ఇలాగే ఉన్నది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఓ వైపు విచారణ జరుగుతున్నది. అంతలోనే అరెస్ట్ అవుతారని కొందరు ఏకంగా జడ్జిమెంట్లు ఇస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో సొల్లు రాసేస్తున్నారు.
కవిత విషయంలోనే కాదు మరెవరైనా సరే కాస్త ఆగి, ఆచితూచి అడుగులు వేయాలనే ఆలోచనే చాలా మందికి రావడం లేదు. ఎవరికి వారే న్యాయనిర్ణేతలైపోతున్నారు. నిజాలు తేలకుండానే వ్యక్తిగతంగా నిందలేస్తున్నారు. ఈ తరహా ప్రచారాలు జరగడం వెనుక కొన్ని రాజకీయాలోచనలు లేకపోలేదు. అందుకే ఏకపక్షంగా వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియాలో పనిగట్టుకొని ప్రచారాలూ సాగుతున్నాయి.
కవిత విషయానికంటే కొద్ది రోజులు వెనక్కి వెళ్తే ప్రముఖ వ్యాపారవేత్త అదానీది హాట్ టాపిక్. మోదీ నోరు విప్పాల్సిందే అని, పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు చేసిన వాదనపైనే చర్చ దేశవ్యాప్తంగా ఊపందుకున్నది. సరిగ్గా ఆ సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీ వ్యవహారం భారతీయ పత్రికలు, టీవీల్లో పతాక వార్త అయింది. ఎందుకిలా జరిగింది. అదానీకి ప్రధాని మోదీ సహాయసహకారాలు పుష్కలంగా ఉన్నాయని లోకం కోడై కూస్తున్న సందర్భంలో అది వినిపించకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు లిక్కర్ పాలసీని మళ్లీ తెరపైకి తెచ్చి విజయవంతమయ్యారు. మొన్నీ మధ్యనే కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి అక్రమాస్తుల బొమ్మలు కూడా సెల్ ఫోన్లలో చక్కర్లు కొట్టాయి. నిత్యం నీతులు చెప్పే నాయకుల వ్యవహారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్న సమయంలో లిక్కర్ పాలసీ అంటూ వార్తలొచ్చాయి.
క్విడ్ ప్రో కో కేసులు కొత్త కాదు. మన దేశ రాజకీయాల్లో అచ్చేదిన్ అని చెప్పిన మోదీ కంటే పూర్వం ఉన్నవారు శవపేటికల కుంభకోణపు మరకలు అంటించుకున్నారు. తాజాగా మోదీ గుజరాతీ సేట్లకు తన అండదండలు పుష్కలంగా అందించి బ్యాంకులను నిండా ముంచినా కిమ్మనడం లేదు. ఈశాన్య రాష్ర్టాల్లో కమలనాథుల అరాచకాలు అప్పుడప్పుడు మీడియాలో మెరుస్తూనే ఉన్నాయి. అయినా వారు తీరు మార్చుకోవడం లేదు. శవపేటికల కుంభకోణం మినహా మిగిలినవన్నీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవే, జరుగుతున్నవే. ఇవేవీ రాకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే అనివార్యంగా లిక్కర్ పాలసీ బయటకొచ్చిందా అనే అనుమానం సహజంగానే వస్తుంది.
తప్పు చేసినవారిని వదిలేయాలని చెప్పడం కా దు. అందరికీ ఒకేలా చట్టాన్ని వర్తింపజేయాలని. పాలనలో ఉన్నవారు ఒకేలా వ్యవహారించాలని చెప్పడమే ఇక్కడ ఈ వ్యాఖ్యల ఉద్దేశం. తమ మాట వినని వారిని ఏదో తిరకాసు పెట్టి దారికి తెచ్చుకునే వ్యవహారాలూ కొత్తేమీ కాదు. నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి మోదీ వరకు అందరూ చేస్తున్నదదే. ఎవరూ ఎవరికీ తక్కువేమీ కాదు. బీజేపీకి ఏయే రాష్ర్టాల్లో ఇబ్బంది ఉన్నదో అక్కడే ఇలాంటి కేసులు ఠక్కున బయటకొస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మోదీ మాట వినడం లేదు. పైగా ఢిల్లీ నుంచి పక్క రాష్ర్టాలకు పాకుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి పక్క రాష్ర్టాల్లోనూ ప్రచారానికి దిగుతున్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో బహిరంగ సభలు పెట్టి మరీ సవాలు విసురుతున్నది. ఏదోలా వీరిని నిలువరించకుంటే కమలం ఉనికి కష్టమని భావించే కేసులు పెట్టి భయపెడుతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది. అందుకే ఈ రెండు రాష్ర్టాలకు సంబంధించిన నాయకుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తే వెనకడుగు వేస్తారనే ఉద్దేశంతో కూడా ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.
అనేక రాష్ర్టాల్లో ఇలా అక్కడి నాయకులను ఇరుకున పెట్టే కేసులు బనాయించి వారు కమలం కండువా కప్పుకోగానే పునీతులైనట్టు కేసులు మాఫీ చేసిన ఉదంతాలు లేకపోలేదు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో వెలిసిన కొన్ని ఫ్లెక్సీలను పరిశీలిస్తే సర్ఫ్ ఎక్సెల్ యాడ్ కానీ, వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్గాని ప్రస్తుత వాస్తవ పరిస్థితికి ఏ విధంగా దర్పణం పడుతున్నదో చూపకనే చూపించారు. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత మర క ఎలా మాయమైందో చూపిస్తూ అందర్నీ ఆలోచింపజేసేలా ఫ్లెక్సీలు వెలిశాయి.
నిజానికి కేసుల విషయం రాజకీయంగా ఎలాం టి ప్రభావం చూపిస్తుందో, రాబోయేకాలం ఎట్లా ఉంటుందో. ఇవన్నీ చాలా హాట్గా జరుగుతున్న చర్చలు. అన్నింటి కంటే కూడా జనంలో పలుచన చేయగలిగితే పాలిటిక్స్లో వారికి ఫ్యూచర్ ఉండదనే ఆలోచన ప్రత్యర్థులకు బలంగా ఉంటుం ది. రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పార్టీలు వాటిని నడిపే నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా అంతిమంగా ప్రజల ఆలోచన, ఆచరణే కీలకమవుతుంది. కవిత విషయమైనా, సిసోడియా విషయమైనా, మరే ఇత ర నాయకుల విషయమైనా రాజకీయంగా దెబ్బ తీయడానికి మాత్రం ఒకవేళ ప్రభుత్వ సంస్థలను వాడి ఇరుకున పడేస్తే.. నిజానిజాలు తెలిసినరోజు ప్రజలు ఉండాల్సిన వారి వెంటే ఉంటారనడంలో సందే హం లేదు. సోషల్ మీడియా చక్క ర్లు, మీడియా పతాక హెడ్డింగ్ వార్త లు కాదు, జనం ఆలోచనలు ఏమిటనేది కీలకమవుతుంది. తా ము తప్పించుకోవడానికి మరొకరిని ఇరికించడానికి ప్రయత్నించడం ము మ్మాటికీ ఆక్షేపణీయం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-అస్కాని మారుతీసాగర్, 90107 56666