BRS | మహారాష్ట్రలో ఏం జరుగుతున్నది? గడిచిన 4-5 నెలలుగా మహారాష్ట్రలోని రాజకీయ, రాజకీయేతర రైతు సంఘాలు, ప్రజా సంఘాలు హైదరాబాద్కు వచ్చి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అవుతున్నారు? గడిచిన నాలుగు నెలల్లో నాలుగుసార్లు కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లడంలో ఆంతర్యమేంటి? బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత పార్టీ బాజాప్తా మహారాష్ట్రలో తొట్టతొలి పార్టీ కార్యాలయాన్ని నాగ్పూర్లో ప్రారంభించబోవడం దేనికి సంకేతం? మహారాష్ట్ర ప్రజలు నిజంగానే మార్పు కోరుకుంటున్నారా? అంటే ఔననే సమాధానం వస్తున్నది.
గత నెల 22న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మహారాష్ర్టలో మొదలైంది. ఒక ప్రభంజనంలా ఇది కొనసాగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సునామీ సృష్టిస్తున్నది. మరో ఆరునెలల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తున్నది.
దేశంలో అనేకమంది రాజకీయ ఉద్దండులను అందించిన మరాఠా నేల ఇప్పుడు తనను చూసుకునే.. తనకోసం పనిచేసే నేత కోసం వెతుకులాడుతోంది. శివసేన, ఎన్సీపీ వంటి ప్రాంతీయ పార్టీలు కేవలం రాజకీయపబ్బం గడుపుకోవడానికే పనిచేస్తున్నాయని తేలిపోవడం, జాతీయపార్టీల ముసుగులో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అక్కడి ప్రజలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవడంతో 75 ఏండ్లుగా మహారాష్ట్ర ప్రజల కష్టాలు తీరలేదు. ముఖ్యంగా వ్యవసాయాధారిత రాష్ట్రమైన మహారాష్ట్రలో పూటకో రైతన్న బలవన్మరణానికి పాల్పడుతున్నాడు.
అక్కడి షేత్కరీ సంఘటన్ నేతలు కాళ్లకు బొబ్బలు ఎక్కేలా పాదయాత్రలు చేయడం రివాజుగా మారింది. రైతులు ఉద్యమించని రోజు మహారాష్ట్రలో లేదంటే అతిశయోక్తి కాదు. అన్నం పెట్టే రైతన్న తన సమస్యలను పరిష్కరించాలని కోరితే అక్కడి ప్రభుత్వాలు, పాలకులు పరాచికాలాడుతున్నారు. అక్కడి పాలకుల తీరుపై రైతాంగం విసుగెత్తి ఉన్నారు. వాళ్లంతా మార్పు కోరుకుంటున్నారు. శాశ్వతంగా తమ కష్టాలను తీర్చే ప్రత్యామ్నాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ రైతులకు అందుతున్న సౌకర్యాలను చూసేందుకు వచ్చి తమకు కూడా తెలంగాణ మాడల్ కావాలని కోరుకుంటున్నారు.
తెలంగాణాలో రోడ్లను చూస్తున్న మహారాష్ట్ర ప్రజలు తమ ప్రాంతం లో కూడా ఇలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు. ఇక్కడ అన్ని వర్గాలకు అందుతున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్తు తమ వద్ద కూడా ఉంటే ఉత్పత్తి రంగంలో మరో మైలురాయిని దాటుతామని పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు. ఇక్కడి ప్రాజెక్టులు తమకు ఉంటే దేశానికి అద్భుతమైన పంటలను అందిస్తామని రైతన్నలు ఆశపడుతున్నారు. ఇక్కడ యువతకు అందుతున్న విధంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తమకు కూడా ఉంటే జీవితంలో స్థిరపడుతామని యువత అనుకుంటున్నది. మొత్తంగా తెలంగాణ మాడల్ తమకు కావాలనుకుంటోంది మరాఠీ గడ్డ.
సీయింగ్ ఈజ్ బిలీవింగ్
చూసి మాట్లాడాలంటారు. చూసిందే నమ్మాలంటారు. మహారాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూసే మాట్లాడుతున్నారు. తెలంగాణాను చూసి మాట్లాడుకుంటున్నారు. అందుకే అక్కడి ప్రభుత్వంపై ఇప్పుడు ఒత్తిడి పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో అడుగుపెట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతీ ఏటా తెలంగాణలో ఇచ్చినట్టు రైతుబంధు ఇస్తామని చెప్తున్నది. తెలంగాణాలో ఉన్న టీ-హబ్ వంటిదే ఎం-హబ్ పేరుతో అక్కడ పెడ్తామని కూడా అంటున్నది. నీళ్ల కోసం ప్రాజెక్టులు కడ్తామంటున్నారు. తాగునీళ్లు ఇస్తామంటున్నారు. సాక్షాత్తు అక్కడి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు తెలంగాణ మాడల్ గురించి మాట్లాడుతున్నారు.
తాము తెలంగాణాలో చేసినట్టు చేస్తామని, మనకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అని అంటున్నారు. కానీ, ప్రజలు మహారాష్ట్రలోని అధికార పార్టీని నమ్మడంలేదు. ఎందుకంటే ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’. కాంగ్రెస్, బీజేపీ, శివసేన-1, శివసేన-2, ఎన్సీపీల పాలనను వాళ్లు ఆల్రెడీ చూశారు. చూసిన తర్వాత వాళ్లేదో గొప్పగా చేస్తారని, తమ జీవితాలు మారుతాయని, కొత్తగా ఏదో ఒరగబెడ్తారన్న నమ్మకం వారిలో లేదు. అందుకే వారు కేసీఆర్ చెప్తున్న.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కావాలంటున్నారు. తెలంగాణా మాడల్ కావాలంటున్నారు. ఎందుకంటే ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి సర్కారు గడిచిన తొమ్మిదేండ్లలో ఏం చేసిందో వాళ్లు చూశారు. చూసింది నమ్ముతున్నారు.
తెలంగాణతో వెయ్యికిలోమీటర్ల సరిహద్దు మహారాష్ట్రకు ఉన్నది. వేల గ్రామాలు తెలంగాణను ఆనుకునే ఉన్నాయి. మహారాష్ట్రలోని లక్షలాది కుటుంబాలకు తెలంగాణాతో సంబంధబాంధవ్యాలున్నాయి. వాళ్లు ఇక్కడ జరిగిన అభివృద్ధిని చూశారు. చూశారు కనుకనే నమ్ముతున్నారు. బీఆర్ఎస్ వస్తేనే మహారాష్ట్రలోని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని బలంగా చెప్తున్నారు. నేను ఇటీవల నాందేడ్కు వెళ్లాను. అక్కడ బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి. వాటిని పరిశీలించేందుకు వెళ్తే ఆశ్చర్యం… వందల మంది స్వచ్ఛందంగా శిక్షణ కార్యక్రమాలకు వచ్చినవారు కనిపించారు. వాళ్లేమీ తెలంగాణా నుంచి అక్కడికి తరలింపబడ్డవాళ్లు కాదు.. స్వచ్ఛందంగా వచ్చారు. పత్రికల్లో, టీవీల్లో తెలంగాణ మాడల్ గురించి చూసినవాళ్లు.. తమ బంధువులు, స్నేహితులు తెలంగాణ గురించి చెప్తుంటే విన్నవాళ్లు.
మహారాష్ట్రలో అప్పటి వరకు ఉన్న రాజకీయ వ్యవస్థ తీరును నిరసించినవాళ్లు. మార్పు కోరుకుంటున్నవాళ్లే ఉన్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. ప్రతీ నియోజకవర్గం నుంచి కేవలం ముగ్గురు చొప్పున రావాలని పార్టీ కోరింది. కానీ, అంతకు మూడింతల మంది వచ్చారు. తాము కూడా బీఆర్ఎస్లో చేరుతామని, తమకు శిక్షణ కావాలని.. శిక్షణ ఇవ్వకపోయినా వాలంటీర్లుగా ఉంటామని, పార్టీ సభ్యులుగా ఉంటామని వచ్చారు. ఇది నాకు కొంత ఆశ్చర్యమే అనిపించింది. సాధారణంగా మనం తెలంగాణాలో అనేక మంది పార్టీలు పెట్టడం చూశాం. బయట రాష్ర్టాల్లో ఉన్న పార్టీలను ఇక్కడ విస్తరించడం కూడా చూశాం.కానీ, మహారాష్ట్రలో బీఆర్ఎస్కు వచ్చిన తీరుగా స్పందన నాకు ఎక్కడా కనిపించలేదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత కేసీఆర్ నాందేడ్, లోహా-కంధార్కు, ఔరంగబాద్ కు వెళ్లినపుడు చేసిన ప్రసంగం అక్కడి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. మహారాష్ట్ర పల్లెల్లో చర్చ మొదలైంది. వారికి కేసీఆర్ ఒక మార్గదర్శిలా.. వెలుగుదివ్వెలా కనిపిస్తున్నారు. మహారాష్ట్ర సమస్యలను ఆకళింపు చేసుకున్న నేతగా వాళ్లు భావిస్తున్నారు. కేసీఆర్ ప్రసంగం మహారాష్ట్రలోని ప్రతి ఇంట్లో ఇప్పుడు మారుమోగుతోంది.
తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ తరచూ ఊరికో కేసీఆర్ తయారవ్వాలని పిలుపు ఇచ్చారు. ఊరికే కాదు.. ఇంటికొకరు కేసీఆర్ లెక్క అయ్యారు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఊరికో కేసీఆర్ తయారవుతున్నారు.
బీఆర్ఎస్తో భరోసా
నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ సొంత భవనంలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. తెలుగు నేలపై ఉద్భవించిన మరే రాజకీయ పార్టీకి ఇతర రాష్ర్టాల్లో సొంత పార్టీ కార్యాలయాలు లేవు. ఇతర రాష్ర్టాల్లో పార్టీకి సొంత కార్యాలయ భవనాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కుతుంది. నాగ్పూర్లోనే కాదు.. ముంబై, పుణె, ఔరంగాబాద్ల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాన్వేషణ మొదలుపెట్టింది. సొంత భవనం ఎందుకు కడుతున్నారు అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. కిరాయి ఇండ్లలో పార్టీలు పెడితే ఎప్పుడు బిచాణా ఎత్తేస్తారో తెలియదని అక్కడి స్థానికులు అనుకునే అవకాశం ఉన్నది.
బీఆర్ఎస్ మహారాష్ట్ర ప్రజల కు భరోసా ఇచ్చేందుకు వచ్చిందని, ఏదో ఆషామాషీగా ఆయారాం గయారాం పార్టీ కాదు అన్న భరోసా కల్పించేందుకే సొంత భవనాలను కొని వాటిలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అక్కడి ప్రజలకు నమ్మకం ఏర్పడింది. అంతేకాదు.. బీజేపీకి పెట్టని కోట, ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగ్పూర్లోనే తొలి కార్యాలయాన్ని కేసీఆర్ గురువా రం ప్రారంభించబోతున్నారు. ఇక్కడినుంచే మహారాష్ట్రలో తదుపరి కార్యాచరణకు పార్టీ సిద్ధమవుతున్నది. అంతేకాదు.. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ మహారాష్ట్రలో అతిపెద్ద శక్తిగా అవతరించబోతున్నది.
ఓరుగంటి సతీశ్
80080 06667