ఇప్పుడు మనం వేయబోయే ఓట్లు ఎంపీలను పార్లమెంటు మెట్లు ఎక్కిస్తాయి. కేంద్రంలో మళ్లీ పీఠం తమదేనని, ఆ పీఠం తమ హక్కు అని ఎన్డీయే భావిస్తున్నది. కాదు, కాదు ఈసారి అధికారం తమదేనని ఇండియా కూటమి అంటున్నది. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ-మోదీ, ఇండియా కూటమిని నడిపిస్తున్న కాంగ్రెస్-రాహుల్ ప్రజలపైనే ఒక రకమైన జులుం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని మార్చడానికే 400 ఎంపీల గెలుపు లక్ష్యాన్ని మోదీ విధించుకున్నారని ప్రజలను కాంగ్రెస్ హెచ్చరిస్తున్నది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. మంగళసూత్రాలనూ విడవకుండా ఆస్తులు చెరబడుతుందని మోదీభయపెడుతున్నారు.
పౌరుల మెప్పు, విశ్వాసం పొందడానికి బదులు బెదిరించి, భయపెట్టే రకంగా జులుం కాని జులుం ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లోక్సభలో గులాబీ గళం ధ్వనించాలనే ఆకాంక్షకు విస్తృతి పెరుగుతున్నది. ఏ అంశాన్నైనా పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా వేరుచేసి విశదీకరించి చెప్పే కేసీఆర్ వంక నిజానిజాల కోసం జనావళి చూస్తున్నది. నాయకత్వ లోటు పుణికిపుచ్చుకున్న ఇండియా కూటమి హస్తాలే ఎన్డీయే హ్యాట్రిక్ పల్లకి మోయాలని మోదీ కోరుకుంటున్నట్టే కాంగ్రెస్ చేజేతులా చేస్తున్నట్టుంది!
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే పుస్తెలతాడును వదలకుండా ఆస్తులు గుంజుకుంటుందనే భ్రాంతిని స్వయానా మోదీ సృష్టిస్తున్నారు. నిజానికి చట్ట వ్యతిరేకం కానంతవరకూ ఎవరి వ్యక్తిగత ఆస్తులూ లాక్కొనే వీలుండదు. అక్కడిదాకా వస్తే సెంట్రల్లో ఏ పార్టీ/ ఏ అలయెన్స్ అధికారంలోకి వచ్చినా అంతే. కాబట్టి మోదీ, బీజేపీ మాయలోకి జారకుండా మోదీ-షా ద్వయం ప్రచారం చేస్తున్న సందేహాలు కేవలం అపోహలేనని జనాలకు సావధానంగా చెప్పగలిగే ఘనమైన గొంతుగా కేసీఆర్ను చూస్తున్నారు.
విదేశాల్లోంచి మన దేశపు నల్లధనం రికవరీ చేసి, ఇంటింటికీ రూ.15 లక్షలు పంచడమే రెండు పర్యాయాల సుదీర్ఘ కాలంలో మోదీ సర్కారుకు సాధ్యం కానప్పుడు.. మన దేశ మెజారిటీ ప్రజల ఆస్తులు గుప్పిట పట్టి మరో మతం వాళ్లకు పంచడం కాంగ్రెస్కైనా, ఇండియా కూటమికైనా ఎట్లా సంభవం? ఈ సూక్ష్మాన్ని ప్రజలకు వివరించడంలో హస్తం విఫలమవుతున్నది. ఎంతసేపు మతోన్మాద పార్టీ అంటూ బీజేపీని, మోదీని తిట్టడమే కాంగ్రెస్ చేస్తున్న పని. ఆ తరహా చివాట్లు, మూస ధోరణుల వల్లే వరుసగా రెండుసార్లు విజయంతో కమలం విరబూసి మురిసింది.
ఇండియా కూటమిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ చెయ్యితోనే ఎన్డీయే హ్యాట్రిక్ పల్లకీ మోయించాలనే మోదీ అప్డేటెడ్ ప్లాన్ కిటుకు కనిపెట్టలేక రొటీన్ విమర్శలకే పరిమితం అవుతున్నది. అయోధ్యలో రామాలయానికి అదనంగా తన మేనియా నెలకొన్న మోదీ మొదటి దశ పోలింగ్ సరళి మేరకు ఇప్పుడు వ్యూహాల్లో ఆస్తులకు అపాయమనే బూచిని ఉపాయంగా జత చేశారు. మతం పేరిట ఓట్ల రాజకీయాలనే ముద్ర మరింత గట్టిగా నాటుకోవాలి. ఆ మేరకు తానే మెజారిటీ వర్గమైన ఓటరు మైండ్లో సెటిలవ్వాలి. తాను చెప్పేదానికన్నా కాంగ్రెస్, వామపక్షాలే ఎక్కువగా మొత్తుకొని టాంటాం చేయాలి. తద్వారా కాంగ్రెస్ వల్ల తమకు ఇంత నష్టం పొంచి ఉంటుందనే భావనతో దేశంలోని 144 కోట్ల జనాభాలోని మెజారిటీ ప్రజల ఆదరణ కొనసాగాలి. అత్యధికులైన మతం వారి సంఘటితంతో టోకున ఈవీఎంలపై మీట నొక్కించుకోవాలనేదే మోదీజీ అసలైన కిటుకు బోధపడుతున్నది.
అయోధ్యలో రాములోరి కోవెలతో ప్రజల్లో ఆధ్యాత్మిక సంతృప్తి కలిగించిన మోదీకి ఇంకా ఏదో వెలితి తోచినట్టుంది. వీస్తున్నట్టుగా భావిస్తున్న తన గాలి మీదా మనసు పూర్తిగా నిండటం లేదేమో. కేంద్రపాలిత ప్రాంతాలు సహా 21 రాష్ర్టాల్లో 102 చోట్ల ముగిసిన తొలిదశ పోలింగ్ సరళి మోదీకి ఎటువంటి ఉప్పందించిందో! అకస్మాత్తుగా ఎప్పుడో 2006లో నాటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వ్యాఖ్యలుగా ప్రధాని నరేంద్ర మోదీ 18 ఏండ్ల అనంతరం ఉటంకిస్తున్నారు. మెజారిటీగా ఉన్న ఒక మతం వారి ఆస్తులు లాగేసి మైనారిటీలకు పంచడమే ఇండియా కూటమి విధానమనే భయాన్ని పౌరుల మీదికి మోదీ విసురుతున్నారు.
రాజస్థాన్లో ఆ విధంగా గురిపెట్టి.. యూపీ మీదుగా అంతకుమించిన ఊపుతో దక్షిణాదికి రేపో ఎల్లుండో రాబోతున్నారు. మొత్తానికి దేశంలో ఆ మూల నుంచి ఈ మూలకు పోలింగ్ జరగాల్సిన పార్లమెంటు స్థానాల్లో ఇదే అంశాన్ని హైలైట్ చేసేలా ఉన్నారు. మోదీ-బీజేపీ, కాంగ్రెస్-రాహుల్ గాంధీల గందరగోళ ఉపన్యాసాల్లోని నిజాలను ప్రజలకు వివరించి, మంచి చెడుల చైతన్యం వ్యాప్తి చేయడంలో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అవసరం చాలా ఏర్పడుతున్నది. వాస్తవానికి, ప్రాక్టికల్కు దగ్గరగా ప్రజలకు వివరించే ఖ్యాతి సొంతమైన కేసీఆర్ దక్షిణాదికి వరమైన జనజీవన స్వరం. సౌత్లోని 130 లోక్సభ సీట్లలో ఎన్ని ఎక్కువ స్థానాలు గెలువగలిగితే అంతగా అధికారానికి, లక్షిత 400 ఎంపీల బలగానికి ఎన్డీయే చేరువవుతుందనే అంచనాలు, ఆశలతో తెలంగాణపై మోదీ నజర్ పెట్టారు. అలాంటి ఆశలతోనే కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్, బీజేపీలను వెనక్కు నెట్టి, మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ను విజేతగా నిలిపేందుకు ప్రజల్లోకి కేసీఆర్ వెళ్తుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నది.
( వ్యాసకర్త:సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ )
– ఇల్లెందుల దుర్గాప్రసాద్ 94408 50384