వైకుంఠ ఏకాదశి శుభదినాన భారత్ రాష్ట్ర సమితి విస్తరణ ఉత్సాహభరితంగా మొదలైంది. పొరుగునే ఉన్న ఏపీ శాఖకు అంకురార్పణ జరిగింది. ఉన్నతాధికారులుగా ఉండి కూడా ప్రజాసేవ కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన సమర్థులకు ఏపీ బీఆర్ఎస్ నిర్వహణ బాధ్యతను అప్పగించడం ప్రశంసలను అందుకున్నది. తోట చంద్రశేఖర్కు ఏపీ శాఖ సారథ్యాన్ని అప్పగిస్తూ, మాజీ మంత్రి, మేధావి రావెల కిశోర్బాబు సేవలను జాతీయస్థాయిలో ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించడం సముచితంగా ఉన్నది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రవేశం పట్ల ఏపీ వ్యాప్తంగా ప్రజల్లో అత్యంత ఆసక్తి వ్యక్తమవుతున్నది. పలు జిల్లాల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపడం ప్రజా స్పందనను పట్టి చూపిస్తున్నది. కేసీఆర్ వంటి నాయకుడి మార్గదర్శకత్వాన్ని దేశ ప్రజలు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఏపీలోని వనరులు, సామాజిక స్థితిగతులు, సమస్యల పట్ల కేసీఆర్కు ఆంధ్రా నాయకులను మించిన అవగాహన ఉన్నది. తెలంగాణలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రదర్శన చేసినప్పుడే, ఏపీలోనూ జల వనరులకు కొరత లేదని, ఈ కొన నుంచి ఆ కొన వరకు నీళ్లు పారించి సస్యశ్యామలం చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా భూ, జల, మానవ వనరుల సద్వినియోగంపై స్పష్టత సాధించిన కేసీఆర్ ఏపీని అలవోకగా తీర్చిదిద్దగలరు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకే బీఆర్ఎస్ పరిమితం అవుతుందంటూ సాగిస్తున్న తప్పుడు ప్రచారాలు సోమవారం నాటి కేసీఆర్ ప్రసంగంతో పటాపంచలయ్యాయి. దేశవ్యాప్తంగా వేలాదిగా ఉన్న అన్ని శాసనసభ స్థానాలతో పాటు అన్ని గ్రామాల్లోనూ తమ పార్టీ శాఖలు ఉంటాయని ధీమాగా చెప్పారాయన. సంక్రాంతి తర్వాత వివిధ రాష్ర్టాలలో సంస్థాగత నిర్మాణం వేగం పుంజుకుంటుంది. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా పకడ్బందీగా వ్యూహరచన చేసుకొని రంగంలోకి దిగుతారనేది తెలిసిందే.
ప్రధాని మోదీ ప్రైవేటీకరిస్తే, తాను జాతీయీకరణ సాగిస్తానని కేసీఆర్ కీలకమైన ప్రకటన చేశారు. విద్య, వైద్యం, ఇంధనం, రవాణా, నీటి సరఫరా వంటి కీలక రంగాలను ప్రైవేటీకరించడం వల్ల ప్రజలకు అనేక సమస్యలు కలుగుతున్నాయి. బ్రిటన్ మొదలుకొని పలు దేశాలలో రీ నేషనలైజేషన్ (పునర్ జాతీయీకరణ) అవసరమనే చర్చ మొదలైంది. రాష్ట్రంలో విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించకుండా కేసీఆర్ పబ్లిక్రంగం పట్ల తన చిత్తశుద్ధిని ఇప్పటికే నిరూపించుకున్నారు. దేశ రాజకీయాల్లో జాతీయీకరణ పట్ల విస్పష్ట ప్రకటన చేసిన నాయకుడిగా కేసీఆర్ ప్రశంసనీయులు. ఏపీలో కొందరు సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం బీఆర్ఎస్ బలంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. అందులో వాస్తవం ఉండవచ్చు. కానీ ఏపీతో సహా, దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ విధానాలే అజెండాగా కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ప్రగతిశీల మేధావులంతా కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ప్రజా రాజకీయాలకు మద్దతు ఇవ్వాలి.