‘నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది’ అంటారు పెద్దలు. కానీ, నేటి రాజకీయాల్లో నోటికి ఎంతగా పని చెప్తే అంత గొప్ప అని భావిస్తున్నారు మన నాయకులు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నాయకుల మాటలే అందుకు నిదర్శనం. ఎన్నికల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సాధారణమే. కానీ, కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కూడా తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. గతంతో పోలిస్తే విమర్శల దాడి కాస్త పెరిగి ఏపీ రాజకీయాలను తలపిస్తుండటం ఆందోళనకరం.
సాక్షాత్తూ రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి తన స్థాయిని మరిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చేస్తున్న అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. కేసీఆర్ను ఉద్దేశించి.. ‘బొందపెడతాం, గోరికడతాం’ అంటూ ఆయన వ్యాఖ్యానిస్తుండటాన్ని చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నది. ఈ విద్యలో నాలుగు ఆకులు ఎక్కువే చదివిన అమాత్యులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇంకా రెచ్చిపోతున్నారు. గతంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ తరహాలోనే నోటికి పనిచెప్పారు. బీజేపీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ మార్గాన్నే ఎంచుకున్నారు. ఏదో ఒకటి మాట్లాడి నిత్యం వార్తల్లో నిలవాలని ఆయన తాపత్రయపడేవారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి తీరు కూడా అలాగే కనిపిస్తున్నది. ఎంతగా తిడితే అంతగా ప్రజల్లోకి వెళ్లగలమని ఆయన భావిస్తున్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్నవారు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి గ్రామస్థాయి నేతలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మరి.
మన మాటల తీరును బట్టే మనకు మర్యాద ఇస్తారు. పదవి అనేది వ్యక్తికి ఆభరణం కాకూడదు. వ్యక్తే ఆ పదవికి ఆభరణంగా మారాలి. అలా పదవికి వన్నె తెస్తేనే ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది. నోటి దురుసుతో చరిత్రలో కలిసిపోయినవారు ఎందరో ఉన్నారనే విషయాన్ని పాలకులు మర్చిపోకూడదు.
తెలంగాణ సాధనలో కేసీఆర్ కీలక భూమిక పోషించారని, దాన్ని ఎవరూ కాదనలేరని గతంలో రేవంత్రెడ్డి స్వయంగా చెప్పారు. మరి నేడు అధికారంలోకి రాగానే కండ్లు మూసుకుపోయాయి అనుకుంటా! ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని అమాత్యుల వరకు ఏ ఒక్కరూ ఆగడం లేదు. అధికారం శాశ్వతమని భ్రమపడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అధికార దర్పాన్ని ప్రదర్శించి ఓటమిని కొనితెచ్చుకున్న ఎందరో హేమాహేమీలు మనదేశంలో ఉన్నారు. చరిత్రే దీనికి సాక్ష్యం.
మాటలెప్పుడూ పొదుపుగా ఉండాలి. అనవసరంగా నోరు జారితే చేటు తప్పదు. నోటి దురుసు కారణంగా రాజ్యాలే కుప్పకూలిన ఉదాహరణలున్నాయి. మాల్దీవుల మంత్రుల ఉదంతం మన కండ్లముందే ఉన్నది. ఇష్టారీతిలో మాట్లాడినవారు తమ పదవులను కోల్పోయారు. కాంగ్రెస్ సర్కారులో తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అందుకే వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు.
టీఎస్ను టీజీగా మార్చి, తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నాన్ని మారుస్తానని చెప్తూ.. అదే అసలైన మార్పు అని, ప్రజలు కోరుకున్నది అదేనని రేవంత్రెడ్డి భ్రమపడుతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. తొలుత ప్రజలకిచ్చిన 420 హామీలను నెరవేర్చాలి.
‘తెలంగాణ కోసం 5 శాతం శ్రమిస్తే.. సాధించుకున్న తెలంగాణను కాపాడుకోవడానికి 95 శాతం శ్రమించాలి’ అని జయశంకర్ సార్ చెప్పిన మాటలను ప్రజలు మరువరాదు. ఉమ్మడి ఏపీని అత్యధికకాలం పాలించిన కాంగ్రెస్కు తెలంగాణ రైతులు, ప్రజల కష్టాలు కనిపించవు. ఆ పార్టీ నేతలు తెలంగాణ కోసం పోరాటం కూడా చేయరు. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి నేడు రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం నమ్మశక్యం కాని విషయమే. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇప్పటికీ కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సర్వే చేసినా ఇదే స్పష్టం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు.
ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువుకాటకాలు, సాగు, తాగునీటి గోసను అప్పుడే మరిస్తే ఎలా? అన్నం లేక గట్క తిని కడుపు నింపుకొన్న సందర్భాలూ ఉన్నాయి. ‘తలాపున పారుతున్న గోదారి.. మన బతుకు ఎడారి.., నాగేటి సాలల్ల నా తెలంగాణ.. నా తెలంగాణ..’ తదితర పాటలను మరిస్తే ఎలా? నాటి తెలంగాణ బతుకు చిత్రం ఎంత దుర్భరంగా ఉండె. అయినా నోరు మెదపని నాటి కాంగ్రెస్ నేతలే నేడు పాలకులుగా మారడం మన దౌర్భాగ్యం.
దయనీయ స్థితిని చూసిన తెలంగాణ తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ఎంతగా అభివృద్ధి చెందిందో మనం కండ్లారా చూశాం. నాటి వలసల తెలంగాణకు నేడు ఇతర రాష్ర్టాల కూలీలు వలస వస్తున్నారు. కేసీఆర్ ఏమైనా మాయ చేశారా! అదంతా కేసీఆర్ అందించిన సుపరిపాలన పుణ్యమే కదా.
తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్పై రేవంత్రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బీజేపీ కనీసం స్పందించడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్కు బీ- పార్టీ బీజేపీయే అన్నది దీన్నిబట్టే అర్థం అవుతున్నది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మండిపడుతుంటే.. బీజేపీ నేతలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం చూస్తుంటే పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అన్న విషయాన్ని ప్రజలు మరిచిపోకూడదు.
జీడిపల్లి రాంరెడ్డి
96666 80051