బీఆర్ఎస్ దూసుకుపోతున్నది. పొరుగు రాష్ట్రమైన ఏపీలో కూడా సత్తా చాటడానికి రెడీ అవుతున్నది. ఏపీ బీఆర్ఎస్ చీఫ్గా నియమితులైన తోట చంద్రశేఖర్ 23 ఏండ్లపాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి. నాగ్పూర్ సహా మహారాష్ట్రలోని అనేక నగరాల రూపురేఖలు మార్చిన గొప్ప విజనరీ ఆయన. అలాగే రావెల కిశోర్బాబు ఇటు బ్యూరోక్రాట్ గానూ అటు పొలిటీషియన్ గానూ సేవలందించిన వ్యక్తి. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తోట చంద్రశేఖర్ టీమ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. మతం పేరుతో ఏపీలో చిచ్చు పెట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రకు తాత్కాలికంగా తెరపడినట్లే.
బీఆర్ఎస్ వైపు ఏపీ ప్రజలు ఆకర్షితు లు కాకుండా చేయటం కోసం కొంతమంది పనిగట్టుకుని మరీ కేసీఆర్పై, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తు న్నారు. ఒక దశలో తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్రా నాయకులు తమ ప్రాంతానికి మళ్లించుకుపోతున్నారని కేసీఆర్ ఆరోపించా రు. అసలు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనదే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని. కాబట్టి, ఒక తెలంగాణ రాజకీయవేత్తగా తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే గళమెత్తడం ఆయన బాధ్యత. దీన్ని ఎవరూ కాదనలేరు.
అంతమాత్రాన ఇప్పటికీ కేసీఆర్ను ఏపీ ప్రజల ఎదుట ఒక విలన్గా చిత్రీకరించాలనుకోవడం శుద్ధ అవివేకం. ఇలాంటి ప్రయత్నాలు ఫలించవు కూడా. గు లాబీ పార్టీ సర్కార్ వచ్చిన తొలిరోజుల్లో హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజలు భ యపడ్డ మాట వాస్తవమే. ముఖ్యంగా అమీర్పేట, కూకట్పల్లితోపాటు అనేక శివారు ప్రాం తాల్లో ఒక రకమైన భయం ఉండేది. అయితే వాళ్లు భయపడినట్లు ఏమీ జరగలేదు. ఒక్కటంటే ఒక్క దాడి కూడా జరగలేదు. తమను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్కు జేజేలు పలికారు ఆంధ్ర ప్రాంత ప్రజలు. ఇం కా చెప్పాలంటే గులాబీ పార్టీకి అభిమానులు గా మారారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లోని అనేక డివిజన్లలో గులాబీ పార్టీ గెలవడమే దీనికి నిదర్శనం.
ఆంధప్రదేశ్తో తెలంగాణకు అనేక అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నదీ జలాల పంపకాలపై కొన్ని పేచీలు ఉన్నమాట వాస్తవమే. ఇరుగు పొరుగు రాష్ర్టాల మధ్య ఇలాంటి వివాదాలు సహజం. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను కానీ, నాయకులను కానీ కేసీఆర్ పల్లెత్తు మాట అనలేదు. వివాదాల పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్కు వదిలేసి సైలెంట్గా ఉన్నారు. ఏపీ ప్రాంత నాయకుల, ప్రముఖుల ఇండ్లలో శుభకార్యాలకు కూడా హాజరవుతూ పెద్ద మనస్సు చాటుకున్నారు.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి ఎనిమిదేండ్లు దాటింది. విభజన సమయంలో అటు ఏపీకి, ఇటు తెలంగాణకు పార్లమెంటు సాక్షిగా అప్పటి కేంద్ర ప్రభుత్వం బోలెడు హామీలు ఇచ్చింది. ప్రత్యేక ప్రతిపత్తి, వాల్తేరు కేంద్రంగా రైల్వే జోన్ ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ముఖ్యమైనవి. ఏపీ అభివృద్ధిలో కీలకమైన ఈ రెండు హామీలను నరేంద్రమోదీ ప్రభుత్వం అటకెక్కించింది.
తెలంగాణ విషయంలోనూ
అదే జరిగింది. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీల్లో ఏ ఒక్కదానిని నెరవేర్చలేదు. అంతేకాదు, చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాను కూడా ఇవ్వలేదు. తెలంగాణకు రావాల్సిన నిధులకు అనేక కొర్రీలు పెట్టింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు మారిపోయాయి. బీజేపీ దూకుడును నిలువరించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. కమలం దెబ్బకు కాంగ్రెస్ ఇప్పటికైతే చతికిలపడింది. దీన్ని ఆసరాగా తీసుకుని కమలం పార్టీ రెచ్చిపోతున్నది. నాన్ బీజేపీ రాష్ర్టాలను అనేక రకాలుగా వేధించటం మొదలెట్టింది. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకున్నది. తన విధానాలను ఎవరు వ్యతిరేకించినా వారి పైకి ఆ సంస్థలను ఉసిగొల్పే దుర్మార్గానికి పాల్పడుతున్నది.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలంటే బీజేపీ నేతలకు లెక్క లేదు. కనీస గౌరవం కూడా లేకుండా పోయింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే మాట వినడం లేదన్న అక్కసుతో ఏక్నాథ్ షిండేను ఎగదోశారు. ఠాక్రే సర్కార్ పతనం అయ్యేవరకు కమలనాథులు నిద్రపోలేదు. జార్ఖండ్లో కూడా హేమంత్ సోరెన్ సర్కార్ను కూల్చడానికి రెడీ అయ్యారు. కారణాలు బయటకు రాలేదు కానీ ఆ ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆగిపోయాయి. తెలంగాణలో కూడా మహారాష్ట్ర పునరావృతం అవుతుందని బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారంటే జనం పట్ల, జనం ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వాల పట్ల వారికి ఎంత చిన్నచూపు ఉన్నదో తెలుస్తున్నది. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రాజేసి, ఓట్లు దండుకునే రాజకీయాలకు పాల్పడుతున్నది బీజేపీ. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదు.
గుజరాత్కు ఒక నీతి, మిగతా రాష్ర్టాలకు మరో నీతి అన్నట్లు నరేంద్రమోదీ పాలన నడుస్తున్నది. స్వాతం త్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ అనేక గ్రామాల్లో కనీస వసతులు లేవు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితులు. ఆరుగాలం కష్టపడే అన్నదాతల ఆదాయం రెండింతలు చేస్తామని ఇచ్చిన హామీని కమలనాథులు మరచిపోయారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇప్పటికీ అరకొర కేటాయింపులే. హిమాచల్ప్రదేశ్లో బీజేపీ సర్కార్ను ఓడించింది ఆపిల్ పండించే సాధారణ రైతులే. గుజరాత్లో విజయంపై గొప్పలు చెప్పుకునే కమలం పార్టీ, హిమచల్లో పరాజయంపై ఒక్క మాట కూడా మాట్లాడదు.
ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయాలంటే అది ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతోనే సాధ్యం. మతాన్ని దూరంగా పెట్టి, అభివృద్ధే తారకమంత్రంగా ప్రభుత్వాలు పనిచేయాలి. అప్పుడే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశించిన సమసమాజం సాధ్యమవుతుంది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
ఎస్. అబ్దుల్ ఖాలిక్
63001 74320