తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతున్నదని దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ‘ఫ్రంట్లైన్’ పత్రిక స్పష్టం చేసింది. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండోస్థానం కోసం పోటీపడుతున్నాయని తేల్చిచెప్పింది. ఇక విపక్షాలు చేస్తున్న యాత్రలను తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదని, అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు కొండంత అండగా నిలుస్తున్నాయని వెల్లడించింది. ఈ కథనం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నది.
‘రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. ద్వితీయ స్థానం కోసమే కాంగ్రెస్ , బీజేపీలు పోటీపడుతున్నాయి. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో విపక్షాలు చేస్తున్న యాత్రలను ప్రజలు పట్టించుకోవడంలేదు’.. ఇదీ ఫ్రంట్లైన్ పత్రిక (2023 ఏప్రిల్ 7) సంచికలో ‘యాత్రా ఫీవర్ ఇన్ తెలంగాణ’ ప్రత్యేక కథనం సారాంశం. ఈ కథనం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు అద్దం పడుతున్నది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న యాత్రలతో ఆ పార్టీలకు పెద్దగా ఉపయోగం లేదని తేల్చిచెప్పింది. అయితే, ఈ కథనంలో వైఎస్ఆర్టీపీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
విపక్షాలను పట్టించుకోని జనం
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ చేస్తున్న యాత్రలను పట్టించుకోవటం లేదని ఫ్రంట్లైన్ కథనం తేల్చి చెప్పింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిసహా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికివారుగా చేస్తున్న ‘హాత్సే హాత్ జోడో’ యాత్ర, బీజేపీ నిర్వహిస్తున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న యాత్ర, ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో టీడీపీ చేస్తున్న యాత్రలకు ప్రజలనుంచి ఎలాంటి స్పందన లేదని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల నుంచి బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టు పార్టీల (సీపీఎం చేపట్టిన జనచైతన్యయాత్ర, బీజేపీ హఠావో.. దేశ్ బచావో పేరుతో సీపీఐ చేస్తున్న) యాత్రలతో బీజేపీ అప్రజాస్వామిక విధానాలు ప్రజలకు తెలిసిపోతున్నాయని కథనంలో పేర్కొన్నది.
విపక్షాలు చేస్తున్న యాత్రల పట్ల ప్రజల్లో ఏ మాత్రం సానుభూతి లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్, బీజేపీలో లుకలుకలు కాంగ్రెస్, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకొన్నాయని, ఎన్నికల నాటికి అవి మరింత పెరుగుతాయే తప్ప తరగవని ఆ పార్టీ క్యాడర్ బలంగా విశ్వసిస్తున్నట్టు ఫ్రంట్లైన్ కథనం స్పష్టం చేసింది. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాయకత్వంపై ఆయా పార్టీల క్యాడర్లలో తీవ్ర అసంతృప్తి ఉన్నదని, వారికి పార్టీని గాడినపెట్టి ప్రజా విశ్వాసాన్ని పొందే అవకాశం లేదని పేర్కొన్నది. బీజేపీలో అధిపత్యపోరు, బండి సంజయ్ ఏకపక్ష, దురుసు ప్రవర్తన, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలను ఫ్రంట్లైన్ ఉటంకించింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజ య్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేస్తాయని పేర్కొంటూ.. ఇదే విషయంలో బీజేపీ సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్రావు వివిధ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశాలను ఫ్రంట్లైన్ పేర్కొంది. రాష్ట్రంలో 11 వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టాలని బీజేపీ నిర్దేశించుకొన్నదని, వీటికి ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికప్పుడు కొన్నింటిని రద్దు చేసుకొన్నదని కథనం పేర్కొన్నది. ఇక కాంగ్రెస్ పార్టీలో నాయకుల ఆధిపత్య పోరు, రేవంత్రెడ్డి ఒంటెత్తు పోకడలతో సీనియర్లు బాహాటంగానే విమర్శించిన సందర్భాలను ‘ఫ్రంట్లైన్’ కథనం గుర్తు చేసింది.
దేశానికే ఆదర్శం
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆ పార్టీకి కొండంత అండగా ఉన్నాయని ఫ్రంట్లైన్ కథనం స్పష్టం చేసింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ఈ పథకాలను గడపగడపకూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నదని తెలిపింది. ప్రజల్లో పార్టీకి అపూర్వ ఆదరణ ఉన్నదని కథనం వెల్లడించింది. పసిగుడ్డు నుంచి వృద్ధుల దాకా అన్ని స్థాయిల వరకూ తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, తమ పార్టీకే విశేష ప్రజాదరణ ఉందని బీఆర్ఎస్ విశ్వసిస్తున్నదని స్పష్టం చేసింది. ప్రజాక్షేత్రంలోనూ దాదాపు ఇదే అభిప్రాయం నెలకొన్నదని ఫ్రంట్లైన్ వెల్లడించింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభం, తెలంగాణ అమరవీరుల స్మృతివనం, బీఆర్ఎస్ అంబేద్క ర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను పార్టీ విస్తృతంగా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తున్నదని తెలిపింది. అన్నిరంగాల్లో తెలంగాణ సాధించిన విజయాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం అమ లుచేస్తున్న పథకాలను అనేక రాష్ర్టాలు స్ఫూర్తిగా తీసుకొంటున్నాయని స్పష్టం చేసింది. హిం దూత్వానికి పేటెంట్గా ఉన్నామని చెప్పుకొనే బీజేపీకి ఇటీవలి కాలంలో కేసీఆర్ తీసుకొనే చర్యలు చెక్ పెడుతున్నాయని వెల్లడించింది. ఇటీవల కొండగట్టు అంజన్న ఆలయాభివృద్ధికి కేసీఆర్ ప్రకటించిన రూ. వెయ్యి కోట్ల పథకాన్ని ‘ఫ్రంట్లైన్’ ప్రత్యేకంగా ఉదహరించింది.
– ‘ఫ్రంట్లైన్’ సౌజన్యంతో..