హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో అవినీతి పెచ్చుమీరింది. వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నా అధికారుల తీరు మారడం లేదు. వైద్యశాఖ పరిధిలోని ఆయా విభాగాల్లో కీలకాధికారులు, కిందిస్థాయి అధికారులు కుమ్మక్కై నీకింత, నాకింత అన్న చందంగా ప్రతి ఫైలుపై డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాల్లో వసూళ్ల బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయని సొంత శాఖ సిబ్బందే గగ్గోలు పెడుతున్నారు. వైద్యవిద్యకు, బోధనాసుపత్రుల నిర్వహణకు కీలకమైన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)లో గత నెల 31న విభాగాధిపతి ఉద్యోగ విరమణ పొందారు.
అదే నెల చివరి వారంలో డీఎంఈ పరిధిలో పనిచేసే 20 మందికిపైగా ఉద్యోగులకు హుటాహుటిన డిప్యుటేషన్లు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు 30 మందికి పైగా వైద్యుల విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేసినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా డిప్యుటేషన్లకు డిమాండ్ ఉన్నచోటుని బట్టి రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు, వైద్యుల విజిలెన్స్ ఫైళ్ల క్లియరెన్స్కు ఒక్కో ఫైలుకు రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కీలకాధికారితో పాటు మరో ముఖ్య అధికారి, ఇద్దరు పేషీ సిబ్బంది చక్రం తిప్పారు. ఇంత హడావుడిగా పెద్దఎత్తున ఫైళ్లను క్లియర్ చేయడం వెనుక భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి.