సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా చంచల్గూడ జైలు కూడలి నుంచి సంతోష్నగర్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధ్దమైంది. ఐతే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి నామకరణం చుట్టూ రాజకీయం వేడెకుతోంది. బ్రిడ్జికి తమ ప్రియమైన నాయకులు లేదా దిగ్గజాల పేర్లు పెట్టాలంటూ వివిధ రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. దివంగత కాంగ్రెస్ నేత పి.సుధీర్ కుమార్ పేరు పెట్టాలని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. 1989 నుంచి 1994 మధ్య కాలంలో మలక్ పేట్ శాసనసభ్యుడిగా సుధీర్ కుమార్ అందించిన సేవలను, ఆ ప్రాంతంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడి వరకు వివిధ హోదాల్లో పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తుగా ఈ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టడమే సరైన నివాళి అని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే ఈ బ్రిడ్జికి స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీ బాయి పేరు పెట్టాలని కోరుతూ గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు లేఖ రాశారు. ఎమ్మెల్యే, మూడు సార్లు ఎంపీగా సేవలందించి సమైక్య రాష్ట్రంలో లోక్సభకు ఎన్నికైన తొలి మహిళా ఎంపీగా లక్ష్మీబాయి చరిత్ర సృష్టించారని వీహెచ్ పేర్కొన్నారు.
మరోవైపు సైదాబాద్ స్టీల్ వంతెనకు దివంగత భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఎంఐఎం పార్టీ ప్రతిపాదించింది. ఈ మేరకు మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల..ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. విజ్ఞానశాస్త్రం, విద్య, దేశాభివృద్ధి రంగాల్లో కలాం చేసిన అసమాన సేవలకు గౌరవంగా ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరును ఖరారు చేయాలని ఎంఐఎం డిమాండ్ చేస్తోంది.