ఇరువై రోజుల కిందట ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళనాలతో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ పండుగ వాతావరణం నెలకొన్నది. ఆ పార్టీ శ్రేణుల గుండెలు నిండుగా మారాయి. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లు నింపిన స్ఫూర్తితో కార్యకర్తలు, అభిమానుల్లో కదనోత్సాహం కనిపిస్తున్నది. ఈ సమ్మేళనం నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని పెంపొందించింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తామంతా కార్యోన్ముఖులం అవుతామంటూ కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నారు.
గత తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనను ప్రజలు మననం చేసుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కార్యకర్తలు, నాయకులను సమాయత్తం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి తామంతా బీఆర్ఎస్, కేసీఆర్ వెంటే నడుస్తామంటూ ప్రతినబూనడం అభినందనీయం. రాజకీయంగా వైరిపక్షాలైన విపక్షాలు కుమ్మక్కై కేసీఆర్ను, బీఆర్ఎస్ను అణగదొక్కడానికి చేసే కుట్రల గురించి ప్రజలు ప్రస్తావిస్తూ వారి వైఖరిని ఎండగడుతున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ సాధించిన అభివృద్ధి గురించి, కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ప్రగతిపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. మొత్తంగా గత తొమ్మిదేండ్లలో కేసీఆర్ పాలన ఒక కొత్త చరిత్రను రాసుకుంటూ ముందుకువెళ్లిందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఎలాంటి సంక్షోభ సమయంలోనైనా పేదల బతుకుకు ఢోకా లేదన్న భరోసా తెలంగాణలో మాత్రమే ఉందని వారంటున్నారు. ఏ ఆధారం లేని వృద్ధులు సహా పలు వర్గాలకు ఠంచన్గా పిం ఛన్లు అందిస్తున్న మహానేత కేసీఆర్ అంటూ ఆత్మీ య సమ్మేళనాలకు వచ్చిన ప్రజలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత తామంతా కేసీఆర్ పాలనలోనే హాయిగా ఉన్నామని కీర్తిస్తున్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నమ్మకం పార్టీ శ్రేణులకు కొత్త ఊపునిస్తున్నది. కేసీఆర్ పాలనలోనే మా అందరికీ పింఛన్ల పండుగొచ్చిందంటూ గ్రామాల్లోని అవ్వాతాతలు, వితంతువులు సంబురపడుతూ ఆత్మీయ సమ్మేళనాలకు తండోపతండాలుగా తరలివస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ‘కేసీఆర్ సార్ సల్లంగుండాలని, ఆయన పాలనే మాకు శ్రీరామరక్ష’ అంటూ దీవిస్తూ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహన్ని నింపుతున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు గత తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలన తమను గర్వంగా, తలెత్తుకొని తిరిగేలా చేసిందని కార్యకర్తలు సమరోత్సాహంతో ఆత్మీయ సమ్మేళనాలకు తరలిరావడం శుభపరిణామం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మళ్లీ ఎన్నికల ముందు మాత్రమే నేతలకు గుర్తుకు రావటమన్నది చరిత్ర. దానికి తొమ్మిదేండ్ల పాలనలో కేసీఆర్ పుల్స్టాప్ పెట్టారు. ఎన్నికల హామీలకు అనుగుణంగా చెప్పింది చేయటమే తన పరిపాలన అజెండాగా పెట్టుకొని ఆ దిశగా అడుగులు వేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు కేసీఆర్.
గ్రామాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల పం డుగ వాతావరణంతో విపక్షాలు ఆత్మరక్షణలో పడ్డాయనే చెప్పాలి. కేసీఆర్ పథకాలన్ని వట్టి బోగస్ అంటూ గోబెల్స్ ప్రచారంతో ఇంతకాలం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన విపక్షాలు ఆత్మీయ సమ్మేళనాలు జరిగే తీరుతో షాక్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా, లేదా అనే మీమాంసలో విపక్షాలున్నాయి. ఏదేమైనా కేసీఆర్, కేటీఆర్లు నింపిన స్ఫూర్తి ఆత్మీయ సమ్మేళనాలకు అభిమాన సంద్రం పోటెత్తుతున్నాయి. ఈ అభిమానమే రాబోయే ఎన్నికల్లో ఓట్లుగా మారి ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను అధికార పీఠంపై కూర్చోబెడుతుందనడంలో సందేహం లేదు. ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న కేసీఆర్ను తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదనడానికి ఆత్మీయ సమ్మేళనాలకు తండోపతండాలుగా హాజరవుతున్న ప్రజలే నిదర్శనం.
– కోలేటి దామోదర్
98491 44406
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీసు శాఖ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్)