ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
మొన్నటి ఈశాన్య రాష్ర్టాల ఎన్నికల ఫలితాలను చూద్దాం. త్రిపుర-60, నాగాలాండ్-60, మేఘాలయ-59 మొత్తం 179 సీట్లలో బీజేపీ గెలిచింది కేవలం 46 (32+12+ 2) సీట్లు. దీనికే గొప్పగా పండుగ చేసుకుంటూ, గోరంతను కొండంతగా ప్రచారం చేసుకోవటం బీజేపీకి రాజకీయ అవసరం. కానీ ‘దశాబ్దాలుగా ఏలిన కమ్యూనిస్టు, కాంగ్రెస్లను మోదీ ఊడ్చేశాడు’ అంటూ మీడియా ఊదరగొట్టడమే వెగటుగా ఉంది. నేడు భారత ‘మీడియా’ ‘మోడియా’గా మారింది. అందువల్ల మీడియాను గుడ్డిగా నమ్మకండి. అందు లో పాలెన్నో, నీళ్లెన్నో మీ సొంత బుద్ధితో నిర్ధారించుకొమ్మని ఆ మూడు రాష్ర్టాల ఫలితాలు ప్రజలకు ప్రబోధిస్తున్నయి.
హిమంతబిశ్వ శర్మ ఎన్నికలకు ముందునుంచే ఈశాన్య రాష్ర్టాల్లో విస్తృత చర్చల ద్వారా చిన్నాచితకా పార్టీలను ఎన్డీపీఏ (నేషనల్ డెమోక్రటిక్ పార్టీస్ అల యెన్స్) పేరిట, బీజేపీకి సానుకూలంగా సమీకరించారు. దీనికన్నా ముందు నుం చే, ఆ రాష్ర్టాల గిరిజన ప్రాంతాలకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వెళ్లి బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేశారు. మోదీ 52 సార్లు పర్యటించి, ఎన్నో కేంద్ర పథకాలకు శంకుస్థాపనలు, ఎన్నికలకు ముందు కొన్నింటికి ప్రారంభోత్సవాలు కూడా చేశారు. అధికార యంత్రాంగం, డబ్బు, దౌర్జన్యాలు షరామామూలే. ఇక ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన సిద్ధాంతాలను ఏ విధంగా పక్కనపెట్టిందో కూడా చూడాలి. ఉత్తర భారతాన బీఫ్ తింటున్నారంటూ ముస్లింల మీదికి హిందువులను రెచ్చగొట్టే బీజేపీ ఈశాన్య భారతాన పూర్తి భిన్నంగా వ్యవహరించింది. ఈశాన్య రాష్ర్టాల్లో మెజారిటీ ప్రజలు బీఫ్ తింటా రు. దీంతో ‘బీఫ్ తినటం జనజీవనశైలిలో భాగం’ అని బీజేపీ నాయకులే అక్కడ ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ భారతాన ‘హజ్ యాత్ర’కు ముస్లింలకు ప్రభుత్వాల ఆర్థిక సాయాన్ని తప్పుబట్టే బీజేపీ అదే నోటితో-ఈశాన్య భారతాన అధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవుల ఓట్ల కోసం.. జెరూసలేం యాత్రకు ఆర్థికసాయాన్ని ఇస్తామని హామీలు గుప్పించింది. వారికి మరికొన్ని మతపరమైన ప్రోత్సాహకాలను కూడా వాగ్దానం చేసింది. ఇదీ బీజేపీ హిందుత్వం.
ఇంతచేసి ఆ రాష్ర్టాల్లో బీజేపీ సాధించిన విజయం నామమాత్రం. దానినే మీడియా సినీస్కోప్లో చూపి మోదీని హీరోను చేసింది. వాస్తవానికి ఈశాన్య రాష్ర్టాలకు తగిన ఆదాయ వనరుల్లేవు. కేంద్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతో మనుగడ సాగిస్తుంటాయి. అందుకే అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ ప్రభుత్వమైనా విధిగా కేంద్రంలోని అధికార పార్టీకి మద్దతిస్తూ పబ్బం గడుపుకోవటం మామూలైంది. దీని ఆధారంగానే ఈశాన్య భారతాన గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ అధికారం చెలాయిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా బీజేపీయేతర ప్రభుత్యాల కూల్చివేతకు ‘ఈడీ-ఐటీ- సీబీఐ’ త్రిశూలాన్ని ప్రయోగిస్తున్న మోదీ బీజేపీకి, బలహీనమైన ఈశాన్య రాష్ర్టాల నేతలను స్వాధీనం చేసుకోవటం ఒక లెక్కనా?
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీతో స్వైరవిహారం చేస్తున్న బీజేపీని ఢీకొనటానికి ఆ పార్టీ చెప్పే హిందుత్వ భావజాలానికి, మోదీకి వ్యతిరేకంగా ప్రచారం సరిపోదు. బీజేపీ వినాశకర కార్పొరేటీకరణ, గుత్త పెట్టుబడిదారీ విధానాలకు ప్రత్యామ్నాయంగా ప్రగతిదాయక విధానాలతో ముం దుకురావాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా ప్రాంతీయ పార్టీలన్నీ.. ‘నాయక త్వం ఎవరిదైనా, మేము బీజేపీ వ్యతిరేక ఐక్య సంఘటనలో భాగస్వాములమవు తాం. బీజేపీ నుంచి భరతమాతకు విముక్తి కలిగిస్తాం’ అని ప్రతినబూనాలి. ఆ దిశగా చిత్తశుద్ధితో పరిక్రమించాలి.
– పాతూరి వెంకటేశ్వరరావు
98490 81889
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)