జడ్చర్ల టౌన్, ఆగస్టు 15: కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేమీలేదని తేల్చిచెప్పారు. ఆయన ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నారని, రాజగోపాల్రెడ్డి మండే అగ్నిపర్వతంలాంటోడని, ఆయనకు కోపం వచ్చిందంటే అగ్నిపర్వతం పేలినట్టుగా ఉంటుందని చెప్పారు.
ఆయన ఎప్పుడూ తనకు మంత్రి పదవి కావాలని కొట్లాడలేదని, కానీ, ప్రజా సమస్యలపైనే మాట్లాడుతున్నారని, దాంట్లో తప్పేంలేదని తెలిపారు. చాలా సమస్యలపై తాను చాలాసార్లు మాట్లాడానని గుర్తుచేశారు. ఒకవేళ మంత్రి పదవి కావాలంటే అప్పుడే కొట్లాడేవాడని పేర్కొన్నారు. వాటిని సరిచేసుకుంటే పార్టీకే మంచి పేరు వస్తుందని సూచించారు. తన నియోజకవర్గంలోనూ కొందరు అధికారులు చిన్న చిన్న సమస్యలు, విరాసత్లు చేయడం కోసం నెలల తరబడి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు ఇబ్బందులు పెట్టినా, డబ్బులు అడిగినా తన దృష్టికి తేవాలని ప్రజలకు సూచించారు.