రంగారెడ్డి, ఆగస్టు15 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : జిల్లాలో వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే వణుకుతున్నారు. ఓ పక్క ట్రాఫిక్ పోలీసులు.. మరో పక్క లాండ్ఆర్డర్ పోలీసులు తనిఖీల పేరుతో బెంబేలెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చలాన్ల ద్వారా వాహనదారులను ముక్కుపిండి వసూళ్లు చేయాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు రోడ్లపైకి వచ్చిన వాహనాలు, అక్రమ పార్కింగ్, హెల్మెట్ లేకపోయినా.. పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి నిబంధనలతో పెద్ద ఎత్తున చలాన్లు వేస్తున్నారు. మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులూ డాక్యుమెంట్ల తనిఖీల పేరుతో మరోవైపు చలాన్లు బాదుతున్నారు.
జిల్లా పరిధిలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగార్జునసాగర్, హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారులున్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పోలీసులు వాహనాలు, డ్రంక్డ్రైవ్ తనిఖీలు నిర్వహించి చలాన్లు వసూలు చేస్తున్నారు. ఈ రహదారుల్లో ప్రయాణమంటేనే పోలీసులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నారు. ఈ రోడ్లలో ప్రతిరోజూ వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నా వారు మాత్రం పట్టించుకోవడంలేదని పలువురు మండిపడుతున్నారు. చలాన్ల వసూలుపై ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ను క్లియర్ చేయడంపై లేదా అని ప్రశ్నిస్తున్నారు.
ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని పలు రహదారుల్లో వాహనదారులు రోడ్డెక్కితే ఏదో రకమైన చలాన్లను ట్రాఫిక్ పోలీసులు బాదుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ము ఖ్యంగా సాగర్ రహదారిలోని తుర్కయాంజాల్, బొంగుళూరు, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, శేరిగూడ, యాచారం, మాల్ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, వాణిజ్య, వ్యాపార సముదాయా లకు సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో క్రయవిక్రయాల కోసం వచ్చే వాహనదారులు రోడ్డుపక్కన వాహనాలను నిలిపి లోపలికెళ్లేచ్చే సరికి రూ. ఐదు వందలు, రూ. వెయ్యి, రూ. రెండువేల చలాన్లు విధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్, లాఅండ్ ఆర్డర్ పోలీసులకు ప్రతిరోజూ ఆయా ఠాణాల పరిధుల్లో వాహనదారుల నుంచి రూ. లక్షల్లో చలాన్లు విధించటంతోపాటు వసూళ్లు చేయాలని టార్గెట్లు విధించడంతో వారు ఇష్టానుసారంగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నా రనే ఆరోపణలున్నాయి. తమ టార్గెట్లు పూర్తి చేసేందుకు గ్రామల్లో వ్యవసాయ పొలాలు అక్కడి నుంచి ఇండ్లకెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకున్నా చలాన్లు వేస్తున్నారు. ఇదెక్కడి దౌర్బాగ్యమని పొలం వద్దకు వెళ్లేందుకూ హెల్మెట్ ధరించాలా అని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.