రంగారెడ్డి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ)/ఇబ్రహీంపట్నం : జిల్లా లో వాహనదారులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే వణుకుతున్నారు. ఓ పక్క ట్రాఫిక్ పోలీసులు.. మరో పక్క లా అండ్ ఆర్డర్ పోలీసులు తనిఖీల పేరుతో బెంబేలెత్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చలాన్ల ద్వారా వాహనదారులను ముక్కుపిండి వసూళ్లు చేయాలని ఆదేశించడంతో ట్రాఫిక్ పోలీసులు ఉదయం చలాన్లు వసూలు చేస్తూ.. సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వాహనాలు, అక్రమ పార్కింగ్, హెల్మెట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటివి లేకుంటే పెద్ద ఎత్తున చలాన్లు వేస్తున్నారు. మరోవైపు లాండ్ ఆర్డర్ పోలీసులూ డాక్యుమెంట్ల తనిఖీల పేరుతో మరోవైపు చలాన్లు బాదుతున్నారు.
పట్టని ట్రాఫిక్ కష్టాలు..
జిల్లా పరిధిలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగార్జునసాగర్, హైదరాబాద్-శ్రీశైలం, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారులున్నాయి. ఈ రోడ్లలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు వాహనాలు, డ్రంక్డ్రైవ్ తనిఖీలు నిర్వహించి చలాన్లు వసూలు చేస్తున్నారు. ఈ రహదారుల్లో ప్రయాణమంటేనే వాహనచోదకులు ఇబ్బందిపడుతున్నారు. ఈ రోడ్లలో ప్రతిరోజూ వాహనాలతో ఎప్పుడు రద్దీగా ఉండి ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నా ట్రాఫిక్ పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదని పలువురు మండిపడుతున్నారు.
చలాన్ల వసూలుపై ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ను క్లియర్ చేయడంపై లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్యూచర్సిటీ కమిషనరేట్ పరిధిలోని పలు రహదారుల్లో వాహనదారులు రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఏదో పేరుతో చలాన్లు వేస్తున్నారని వాపోతున్నా రు. ముఖ్యంగా సాగర్ రహదారిలోని తుర్కయాంజాల్, బొంగుళూరు, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, శేరిగూడ, యాచారం, మాల్ ప్రాంతాల్లో షాపింగ్ కాంప్లెక్స్లు, వాణిజ్య, వ్యాపార సముదాయా లకు సరైన పార్కింగ్ సౌకర్యం లేదు. దీంతో క్రయవిక్రయాల కోసం వచ్చే వాహనదారులు రోడ్డుపక్కన వాహనాలను నిలిపి లోపలికెళ్లేచ్చే సరికి రూ. ఐదు వందలు, రూ. వెయ్యి, రూ. రెండువేల చలాన్లు విధిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజువారీ టార్గెట్ రూ. లక్షల్లోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు ప్రతిరోజూ ఆయా ఠాణాల పరిధుల్లో వాహనదారుల నుంచి రూ. లక్షల్లో చలాన్లు విధించటంతోపాటు వసూళ్లు చేయాలని టార్గెట్లు విధించడంతో వారు ఇష్టానుసారంగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమ టార్గెట్లు పూర్తి చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ పొలాల నుంచి ఇండ్లకెళ్లే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించకున్నా చలాన్లు వేస్తున్నారు. ఇదెక్కడి దౌర్బాగ్యమని పొలం వద్దకు వెళ్లేందుకూ హెల్మెట్ ధరించాలా అని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా చలాన్లు వేస్తున్నారు..
ఇటీవల తన వాహనాన్ని ఇబ్రహీంపట్నంలోని ఓ షోరూం ఎదుట నిలిపి పక్కకెళ్లి తిరిగి వచ్చేసరికి ట్రాఫిక్ పోలీస్ వెయ్యి రూపాయల చలాన్ వేశాడు. అన్నా.. వెయ్యి రూపాయల చలాన్ కట్టలేను, డీలిట్ చేయండి అని కోరగా ఎంతోకొంత ఇస్తే.. దానిని తీసేస్తానని చెప్పగా.. ట్రాఫిక్ పోలీసుకు లంచం ఇచ్చా. అయినా, తన వాహనానికి విధించిన చలాన్ అలాగే ఉన్నది. ఇలా ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసులు ఇష్టానుసారంగా పేదల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించటంలో వారికి లేదు. – కంచుకట్ల యాదగిరి, ఇబ్రహీంపట్నం