పూర్వం రాజులు అశ్వమేధ యాగం చేసి ఒక్కో రాజ్యంపై దండెత్తినట్టు..నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రస్తుతం ఒక్కో ప్రాంతంపై దండయాత్ర చేస్తున్నది. ఉత్తరాదిపై పట్టు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు దక్షిణాదిని జయించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నది. ఓట్ల ద్వారానే కాదు, చివరకు పార్టీలను చీల్చడం, నేతలను అరెస్టు చేయించడం.. ఇలా విజయం కోసం ఆ పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ ఒక్క అవకాశాన్ని కమలనాథులు వదలడం లేదు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎదురుపడితే కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడకుండా మోదీ ముందుకువెళ్లిపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ సన్నివేశాన్ని టీవీల్లో చూసినవారికి ప్రధాని పగ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మోదీ ప్రభుత్వం మొదటి నుంచీ శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. కేజ్రీవాల్ సర్కార్ను ఓవైపు కేంద్రం, మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడుగడుగునా ఇబ్బందులకు గురిచేశారు. చివరకు దేవతా వస్ర్తాలు లాంటి మద్యం కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని, మంత్రిని గతంలోనే అరెస్ట్ చేసిన విషయం విదితమే.
BJP | అరెస్టుల పర్వం మొదలై రెండేండ్లవుతున్నా అసలు ఆ మద్యం స్కాం ఏమిటో, ఎవరు, ఏం నేరం చేశారో ఇప్పటివరకు ఈడీ నిరూపించలేదు. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులపై బీజేపీ గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసి.. ఈడీతో దాడులు చేయించింది. వారంతా బీజేపీలో చేరగానే పవిత్రులు అయిపోయారు. అదానీ అక్రమాలపై అమెరికా కోర్టు విచారిస్తున్నది. కానీ మన దేశ ప్రభుత్వం మాత్రం అదానీకి అండగా నిలుస్తున్నది. కేజ్రీవాల్ అరెస్ట్ కావడం, అదానీకి బీజేపీ అండగా నిలవడం చూస్తుంటే ప్రభుత్వం, మన వ్యవస్థలు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాయో అర్థం అవుతున్నది. ఐదు దశాబ్దాలు కావస్తున్నా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నీలి నీడలు అంటూ ఏటా తద్దినం వ్యాసాలు రాసే మీడియా.. తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చడం, పార్టీలను చీల్చడం, ముఖ్యమంత్రులను సైతం అరెస్ట్ చేయించడంపై నోరు మెదపడం లేదు. దేశాన్ని ఢిల్లీ కేంద్రంగా బీజేపీ పాలిస్తుంటే.. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఉండటం బీజేపీకి కంటగింపుగా మారినట్టుంది. అందుకే మద్యం కేసు పేరుతో ఆప్ను ఎన్నికలకు ముందే చెల్లాచెదురు చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఎన్నికలను జైలులో ఉండి కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటారో, ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఉత్తరాదిన, ముఖ్యంగా హిందీ రాష్ర్టాల్లో బాగా విస్తరించిన బీజేపీ ఈసారి ప్రధానంగా దక్షిణాదిపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ర్టాల్లో పాగా వేసి 50-60 సీట్లు సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పని చేస్తున్నది. గతంతో పోలిస్తే ఈసారి దక్షిణాదిపై బీజేపీ ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నది. కొంతమేరకు కమలం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిని అద్భుతంగా అభివృద్ధి చేసిందా? భారీ ప్రాజెక్టులను దక్షిణాదికి మంజూరు చేసిందా? అంటే అదేమీ లేదు. గుజరాత్పై తప్ప ఏ రాష్ట్రంపై కూడా బీజేపీ నుంచి అలాంటి అభిమానాన్ని ఆశించలేం. దక్షిణాది రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటున్నది. దక్షిణాదిలోని ప్రతి సీటును బీజేపీ కీలకంగానే భావిస్తున్నది. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసైతో హడావుడిగా రాజీనామా చేయించడమే అందుకు ఉదాహరణ. తెలంగాణ గవర్నర్గా ఉన్నప్పుడు తమిళిసై పరోక్షంగా బీజేపీ నాయకురాలిగానే వ్యవహరించారు. ఒక చానల్ ఇంటర్వ్యూలో ‘మా పార్టీ వాళ్లు’ అని ఆమె చెబితే, ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ‘మీ మాజీ పార్టీ వాళ్లు’ అని ఆమె వ్యాఖ్యలను సవరించారు. గవర్నర్గా ఆమె ఒక ఎజెండా ప్రకారమే పని చేశారని చెప్పవచ్చు.
గవర్నర్ కోటాలో మండలి సభ్యుడిగా దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. రాజకీయ నేపథ్యం ఉందనే కారణంతో దాన్ని అప్పట్లో గవర్నర్ తిరస్కరించారు. కానీ, ఒక పార్టీకి అధ్యక్షునిగా ఉన్న కోదండరాం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా.. ఆమె ఆమోదించారు. ఇది దేనికి సంకేతం? బీఆర్ఎస్ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించి, పరోక్షంగా బీజేపీ నాయకురాలిగా వ్యవహరించినందుకే తమిళిసైకి బీజేపీ టికెట్ ఇచ్చినట్టుంది. సాధారణంగా తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. కానీ, ప్రతి సీటు ముఖ్యమేనని భావిస్తుండటంతో తమిళి సైని కూడా ఎన్నికల బరిలో నిలిపింది బీజేపీ నాయకత్వం.
దక్షిణాదిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ర్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో కలిపి మొత్తం 127 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వీటిలో బీజేపీ 29 స్థానాలను గెలుచుకున్నది. వాటిలో కర్ణాటకలోనివే 25 కావడం గమనార్హం. తెలంగాణ నుంచి ఆ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు గెలుపొందారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ, ఈ సారి దక్షిణాదిలోని ఐదు రాష్ర్టాల్లోనూ అత్యధిక స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో ఒక ప్రణాళిక ప్రకారం బీజేపీ ముందుకువెళ్తున్నది. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అనేది బీజేపీ నినాదం. దేశానికి బీజేపీ ప్రమాదకరమనేది కాంగ్రెస్ వాదన. ఢిల్లీలో కుస్తీ పట్టే ఈ పార్టీలు గల్లీలో మాత్రం దోస్తీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, కమలం పార్టీల మధ్య అలౌకిక బంధం కనిపిస్తుండటమే అందుకు నిదర్శనం. పురపాలికలు, కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆ బంధం బహిర్గతమవుతున్నది. మండల, గ్రామ స్థాయిలో రెండు పార్టీల బంధం బహిరంగంగానే సాగుతున్నా.. రాష్ట్ర స్థాయిలో కనిపించి కనిపించకుండా ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయినా గవర్నర్ తమిళి సై బీఆర్ఎస్ పట్ల ఎలా వ్యతిరేకత చూపారు, కాంగ్రెస్ పట్ల ఎలా సానుకూలంగా వ్యవహరించారనేది దాసోజు శ్రవణ్, కోదండరాంరెడ్డి ఎన్నిక వ్యవహారం ద్వారా తెలిసివచ్చింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్. కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య కింది స్థాయిలోనూ అనధికారిక బంధం కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్నే తమ ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరుతుందని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వరకు రెండు పార్టీల బంధం అలానే కొనసాగినా ఎన్నికల తర్వాత రాజకీయం మారుతుంది. ఈసారి తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తెలంగాణాలో బీజేపీకి కలిసివచ్చింది. అందుకే వారు ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారు.
గతంతో పోలిస్తే ఈ ఎన్నికల సందర్భంగా మోదీ దక్షిణాదిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో తెలంగాణలో మోదీ రెండుసార్లు పర్యటించారు. రోడ్షోలు నిర్వహించారు. అదేవిధంగా కేరళలో కూడా పర్యటించారు. తమిళనాడులో ఆలయాలను సందర్శించారు. కేరళలో ప్రధానంగా సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కానీ, ఈసారి బీజేపీ దాన్ని త్రిముఖ పోటీగా మార్చాలని ప్రయత్నిస్తున్నది.
2014లో తమిళనాడులో బీజేపీ, పీఎంకే కలిసి పోటీ చేసి చెరో సీటు సాధించాయి. 2014లో తమిళనాడులో బీజేపీకి 5.5 శాతం ఓట్లు రాగా, 2019లో ఓటింగ్ శాతం 3.66కు పడిపోయింది. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ, ఈ సారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సీట్లు కూడా సాధిస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాది మొత్తంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2019లో బీజేపీ ఒక్క సీటు గెలవలేదు, 2024లో కూడా ఒక్క సీటు గెలిచే అవకాశం కనిపించడం లేదు. అయితే ఒక్క సీటు గెలవకపోయినా రాష్ట్రంలోని మొత్తం 25 సీట్లు బీజేపీ ఖాతాలోనే వచ్చి పడతాయి.
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు రెండేండ్ల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ వెంటపడి మరి బీజేపీని ఒప్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సభలో మోదీ మాట్లాడినా.. ఇటు చంద్రబాబును మెచ్చుకోలేదు, అటు జగన్ను విమర్శించలేదు. బీజేపీకి టీడీపీతో బహిరంగ పొత్తు ఉండగా జగన్తో రహస్య స్నేహం ఉంది. దీనివల్ల ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచినా 25 సీట్లు బీజేపీ కూటమి ఖాతాలోనే పడతాయనడంలో సందేహం లేదు.
గతంలో కర్ణాటక ద్వారా దక్షిణాదిలో బీజేపీ అడుగుపెట్టింది. కర్ణాటకలో 28 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 25 గెలిచింది. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఏడాది కాలంలో రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హవా ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తున్నది. కర్ణాటకలో బీజేపీకి తన సొంత బలంతో పాటు కాంగ్రెస్ బలహీనత తోడైంది. దాంతో 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామనే ధీమాతో బీజేపీ ఉంది.
పశ్చిమ బెంగాల్లో సైతం బీజేపీ గణనీయమైన సీట్లు సాధిస్తామని భావిస్తున్నది. కొన్ని దశాబ్దాల పాటు ఎర్రజెండా కింద ఉన్న పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడటం భారత రాజకీయాల్లో ఒక ఆసక్తికర అంశం. బెంగాల్ను మూడు దశాబ్దాల పాటు పాలించిన ఎర్ర పార్టీకి శాసనసభలో ప్రాతినిథ్యమే లేకపోవడం విచిత్రం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందనే అంచనా మరింత ఆసక్తి కలిగిస్తున్నది. ఉత్తరాది సంగతి అలా ఉంచితే ప్రాంతీయ ఆకాంక్షలకు పెద్దపీట వేసే దక్షిణాదిలో మాత్రం కమలం వికసించడం అంత సులువు కాదు.
బుద్దా మురళి