కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, బజరంగ్దళ్ ఈ రెండు మతపరమైన సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీంతో ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందన్నట్టూ ఈ ఒక్క హామీ ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల నినాదాన్నే మార్చేసింది. నిన్నమొన్నటి వరకు అక్కడ బీజేపీపై విపక్షాలకు ఎన్నికల అస్త్రంగా దొరికిన 40 పర్సంటేజీ కమిషన్ సర్కార్ నినాదం మరుగునపడిపోయింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్టూ బజరంగ్దళ్నే నిషేధిస్తామంటారా? అంటూ బీజేపీ బలమైన సెంటిమెంట్తో ఎదురుదాడి మొదలుపెట్టింది. బజరంగ్దళ్కు, బజరంగ్ బలికి ఏమిటి సంబంధం?,ఇది బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టడం కాదా?. ప్రతి ఎన్నికల్లో బీజేపీ కోరుకునేది కూడా ఇదే.
‘ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం మతకలహాలను సృష్టించేందుకు కుట్ర పన్నింది.ఈ కుట్రను హిందువులు, ముస్లింలు గ్రహించి మతసామరస్యంతో ప్రశాంతంగా ఉండాలి’ ఇది బీజేపీ అంటే గిట్టని పార్టో, నాయకుడో చేసిన హెచ్చరిక కాదు. సాక్షాత్తు ఆ పార్టీ కర్ణాటక శాసనమండలి సభ్యుడు ఆయనూరు మంజునాథ్ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇచ్చిన పిలుపు.
ఎన్నికల క్షేత్రంలో విపక్షాలు లేవనెత్తే అంశాలను పక్కదారి పట్టించేందుకు, తమ వైఫల్యాల నుంచి జనం దృష్టి మళ్లించేందుకు మెజారిటీ ప్రజల్లో మతపరమైన భావోద్వేగానికి గురిచేసి విద్వేషాలను రెచ్చగొట్టడానికి బీజేపీకి ఇది సరిపోదా? ఇంతకంటే ఇంకేం కావాలి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే బీజేపీ ఇప్పుడు బలమైన ఎన్నికల అస్త్రంగా మలుచుకున్నది. కర్ణాటకలో తిరిగి ఎలాగైనా గెలువాలని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్న ప్రధాని మోదీ తన సభల్లో ఇప్పుడు ‘జై భారత్’ అనడం మానేసి ‘జై బజరంగ్ బలి’ అంటున్నాడు. మోదీ ఒక్కరే కాదు, కర్ణాటక ఎన్నికల్లో బయటపడేందుకు ఒక్క బజరంగ్ బలి తప్ప తమను మరేది గట్టెక్కించే పరిస్థితి లేదన్నది బీజేపీకి అర్థమైంది.
యూపీలోని గోరఖ్నాథ్ మఠానికి కర్ణాటకలోని ఆది చంచనగిరి మఠానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రెండింటికి మధ్య జతకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోసం బీజేపీ ఏదైనా చేస్తుందనడానికి ఇదే నిదర్శనం. కర్ణాటక మైసూర్ ప్రాంతంలో వొక్కలిగలది బలమైన సామాజిక వర్గం. మాజీ ప్రధాని దేవే గౌడ, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్లది ఇదే సామాజిక వర్గం. ఈ ప్రాంతంలో మొదటినుంచి కాంగ్రెస్-జేడీఎస్కు మధ్యనే గట్టి పోటీ. ఇక్కడ బీజేపీ పాగా వేయాలంటే వొక్కలిగాస్ను ప్రభావితం చేయడానికి సీఎం యోగి గోరఖ్నాథ్ మఠం నుంచి చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతున్నది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఆది చంచనగిరి మఠాన్ని సందర్శించారు కూడా. ఇలా ఉం డగా ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ప్రధాని మోదీనే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన సంగ తి తెలిసిందే. తాజాగా ‘ది కేరళ స్టోరీ’ ప్రమోషన్ను కూడా బీజేపీ తన భుజానికి ఎత్తుకున్నది.
దీని ప్రీమియర్ షోను రిలీజ్కు ముందే ఢిల్లీ జేఎన్యూలో ఏబీవీపీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడంలోనే ఈ సినిమా ఇచ్చే సందేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేరళలో హిందూ, క్రిస్టియన్ యువతులను ముస్లిం యువకులు ప్రేమ పేరిట లోబర్చుకొని వారిని సిరియాకు తరలించి అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులుగా శిక్షణ ఇస్తున్నారన్న ఇతివృత్తంతో ‘ది కేరళ స్టోరీ’ని రూపొందించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు మాత్రమే బలమున్న కేరళలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పాగా వేసేందుకు ఈ సినిమా రూపంలో మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ లక్ష్యమని పాలక సీపీఎం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం ప్రజల మధ్య మత విద్వేష బీజాలు నాటడానికి భావోద్వేగాలతో ముడిపడిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ వదలుకోవడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణే కర్ణాటక ఎన్నికల్లో బజరంగ్దళ్ అంశం. ఒక అయోధ్య, మధుర, ఒక శ్రీరామనవమి, ఒక హిజాబ్, ఒక హలాల్, ఒక లవ్ జిహాద్, ఒక టిప్పుసుల్తాన్, ఒక ముస్లిం రిజర్వేషన్లు వీటిలో ఏదో ఒకటి బీజేపీకి ఎన్నికల మ్యానిఫెస్టోగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
భావోద్వేగాలను రెచ్చగొట్టడం
యూపీలో ఇటీవల గ్యాంగ్స్టార్ అతీక్ అహ్మద్, అశ్రఫ్ ఆహ్మద్ల ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అలాగే ఆ మధ్య కేరళలో గో హత్య వివాదం జరిగింది. ఈ రెండూ యూపీ, కేరళకు సంబంధించినవే. వీటికి కర్ణాటకతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దేశంలో ఎక్కడ ఏం జరిగినా ప్రతి అవకాశాన్ని తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటు. ఇందుకు తాజా ఉదాహరణ అతిఖ్ అహ్మద్ ఎన్కౌంటర్, కేరళ గో హత్యల ఉదంతాలను తన కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ప్రస్తావిస్తూ ప్రజల భావోద్వేగాలను పార్టీకి అనుకూలంగా మలిచే ప్రయత్నం చేసింది. పూల్వామా ఘటనను కూడా కేంద్రం ఇదేరకంగా వాడుకుందనే కదా మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ బయటపెట్టింది. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి ఇంతకంటే మరేమి నిదర్శనం కావాలి. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావడానికి గతేడాది నుంచే ఆ పార్టీ ఒక వ్యూహం ప్రకారమే హిజాబ్, హలాల్, లవ్ జిహాద్ వంటి సున్నితమైన మత అంశాలను తెరపైకి తెచ్చిందని లోకమంతా కోడై కూసింది. ఒక్క కర్ణాటకలోనే కాదు, ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక మతపరమైన సెంటిమెంట్ను తెరపైకి తెచ్చి ఓట్లు దండుకోవడం బీజేపీకి షరామామూలేనన్న విమర్శ కొత్తేం కాదు.
పుల్వామా-బాలాకోట్ మతలబు
2019 లోక్సభ ఎన్నికలకు ముందు అదే ఏడాది ఫిబ్రవరి 14న భారత సైనికుల వాహ న కాన్వాయిపై జరిగిన దాడి యావత్ దేశ ప్రజలను భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా బాలాకోట్ వద్ద పాకిస్థాన్ సైన్యంపై చేసిన గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కగలిగిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో సహా విపక్షాలు ఇప్పటికీ ఆరోపిస్తుంటా యి. ఈ ఘటనలు జరిగినప్పుడు జమ్మూకశ్మీ ర్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్, పుల్వా మా ఘటనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టడమే కాకుండా ఎండగట్టగా, ఇదే అభిప్రాయాన్ని కొందరు మాజీ సైనికాధికారులు వ్యక్తం చేశారు కూడా. ఇదిలా ఉంటే ఇటీవల అరుణాచల్ప్రదేశ్లో భారత భూ భాగంలోని ఏడు ప్రదేశాలకు చైనా తన ఊర్ల పేర్లు పెట్టినట్టు రక్షణశాఖనే వెల్లడించింది.
ఇలా దేశ సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు కొత్తేం కాదని, అయితే వాటిని ఎప్పటికప్పుడు మన సైన్యం తిప్పికొడుతుందనే విషయం తెలిసిందే. కానీ ఈ విషయాలు ఎప్పుడు బయటికి వస్తాయంటే, దేశంలో ఎక్కడైనా ఎన్నికలున్నప్పుడు మాత్రమేనన్న ఆరోపణలున్నాయి. అదే తరహాలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో అరుణాచల్ప్రదేశ్లో చైనా ఆక్రమణలను కేంద్రమే పని గట్టుకొని విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నదని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే.
దేశద్రోహ ముద్ర
రాహుల్గాంధీ తన ఇంగ్లాండ్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశద్రోహ చర్యగా చిత్రీకరించింది. దేశ అంతర్గత విషయాల్లో విదేశీ జోక్యం ఏమిటని? ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను వేదికగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఒక పరువు నష్టం కేసులో కోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడని లోక్సభ స్పీకర్ ప్రకటించారు. ప్రతిపక్ష నాయకుడిపై ఈ రకమైన చర్యలు సహేతుకం కాదని పలు దేశాలు ఖండించాయి. ఇందులో జర్మనీ కూడా ఉన్నది. దేశ వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం దేశ సార్వభౌమాధికారానికే సవాల్ అని బీజేపీ తీవ్రంగా స్పందించింది. అందుకే రాహుల్గాంధీ బ్రిటన్లో దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని తాము డిమాండ్ చేసినట్టు కేంద్ర మంత్రులు నలుగురు పార్లమెంట్లోనే ప్రస్తావించారు. ఇలా ఏ ఒక్క అంశాన్ని జారవిడుచుకోకుండా ప్రతిపక్ష పార్టీలపై దేశ ద్రోహ ముద్రవేయడం ద్వారా రాజకీయంగా లబ్ధిపొందడం బీజేపీకి షరామాములే.
దక్షిణాదిలో పాగా కోసం కుట్రలు
దక్షిణాదిలో బీజేపీ పుంజుకొంటుందని ప్రధాని మోదీ ఇటీవల ఢిల్లీలో జరిగిన రాష్ర్టాల పదాధికారుల సమావేశంలో అన్నారు. కర్ణాటకలోనూ తిరిగి తామే అధికారంలోకి వస్తామని, అలాగే తెలంగాణలో కూడా ప్రజలు బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ కోరుకుంటున్నారన్నారు. కర్ణాటకలో ఈసారి బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం మహాద్భుతం జరిగితే తప్ప జరిగే పనికాదని ఇప్పటికే అనేక సర్వేలు, ఆ రాష్ట్ర ప్రజల మూడ్ను బట్టి అంచనా వేయవచ్చు. ఈ పరిస్థితిని అంచనా వేసే బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చివరికి మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షట్టర్ వంటి ఎంతోమంది ప్రముఖులు కాంగ్రెస్, జేడీఎస్లో చేరిన విషయం తెలిసిందే. 40 శాతం కమిషన్ సర్కార్గా అక్కడ బీజేపీ అప్రతిష్టపాలైంది. ప్రజాప్రతినిధులకు, మంత్రులకు కమిషన్ ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఉదంతాలు జరిగాయి. ఈ ఆరోపణలపై ఈశ్వరప్ప అనే మంత్రిని కూడా ఆ పదవి నుంచి బర్తరఫ్ చేసింది. కర్ణాటక పరిస్థితి ఈ విధంగా ఉంటే మత విద్వేషాలతో హిందూ ఓటర్లే తమను గట్టెక్కిస్తారని బీజేపీ అధినాయకత్వం ధీమాగా ఉన్నది. అందుకే ఈ విద్వేషాలకు మరింత ఆజ్యం పోసేందుకు ఎన్నికల ప్రచారానికి వచ్చిన హోంమంత్రి అమిత్ షా ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణలో కర్ణాటక ఫార్ములా
తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ చేవెళ్లలో జరిగిన పార్లమెంట్ ప్రవాస్ యోజన సభలోనూ తాము అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దుచేస్తామని అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో మత విద్వేష రాజకీయాలకు తావు లేకపోయినా కర్ణాటక ఫార్ములాను ఇక్కడ కూడా అమలుచేయడం బీజేపీ ఆలోచనగా దీన్నిబట్టి బహిర్గతమైంది. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచింది ఒకే ఒక్క సీటు (రాజాసింగ్) కాగా వంద సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు.
ఆ తర్వాత జరిగిన హుజూర్నగర్, నాగార్జునసాగర్లో జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోగా, దుబ్బాక, హుజూర్బాద్లలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా 119 అసెంబ్లీ సీట్లకుగాను బీజేపీకి ఉన్నది మూడే మూడు సీట్లు. కానీ ఈ సంఖ్య 119లో ఎంత?. మరి ఏ ధీమాతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అంటుంది? అం టే ఇక్కడ కూడా కర్ణాటక మాదిరిగా మత విద్వేషాలను రెచ్చగొట్టో లేక ఏవైనా అల్లర్లు సృష్టించడం ద్వారానో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే వ్యూహాన్ని పన్నుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీ, ఎస్సెస్సీ ప్రశ్న పత్రా ల లీక్ అంశాలను భూతద్దంలో చూపే ప్రయ త్నం చేసిందేమోననే అనుమానాలు కలుగుతు న్నాయి.
-వెల్జాల చంద్రశేఖర్
98499 98092