BJP | ఇటీవల కొన్ని పశ్చిమ దేశాల్లో తలెత్తుతున్న ఖలిస్థానీ కార్యకలాపాలు భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపిన కొన్ని ప్రవాస భారత బృందాల దుష్టపన్నాగాలను మరోసారి మన ముందుకు తెచ్చాయి. ఒకింత తొట్రుపాటుపడినా ఇది భారత దేశం ఎదుర్కోగలిగే సవాలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి. అయితే భారత వ్యతిరేక శక్తుల నుంచి ఎదురయ్యే ముప్పు, ప్రవాస భారతీయులు ఇంటాబయటా విసిరే సవాళ్ల మధ్య తేడాను మనం గమనించాలి. రెండోది భారతదేశానికి,ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులకు మధ్యన గల సంక్లిష్ట రాజకీయ సంబంధాలను ఇది గుర్తు చేస్తుంది.
ప్రవాస భారతీయులు సొంత గడ్డపై, విదేశాల్లో చేపడుతున్న రాజకీయ కార్యకలాపాలు భారత దౌత్య వ్యవస్థకు పరీక్షగా మారుతున్నాయి. విదేశాల్లో స్థిరపడిన మోదీ అనుకూల భారతీయుల నుంచి లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ప్రస్తుత దౌత్యసమస్య అనే నాణేనికి మరోవైపున మోదీ వ్యతిరేక ఎన్నారైలు ఉన్నారు. దౌత్య వ్యవహారాల్లోకి, స్వదేశీ రాజకీయాల్లోకి ప్రవాసులను లాగడం వల్ల లాభమూ ఉంటుంది, నష్టమూ ఉంటుంది.
ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడల్లా బీజేపీ ప్రవాస భారతీయులను సమీకరించి మోదీ మోదీ మోదీ అని నినాదాల మోత మోగిస్తుండటం వల్ల, స్వదేశీ రాజకీయాల్లోకి వారిని లాగడం వల్ల ప్రవాసుల్లో రాజకీయాలు బలపడుతూ వచ్చాయి. లండన్, న్యూయార్క్, హ్యూస్టన్ తదితర విశ్వనగరాల్లో మోదీ అనుకూల బృందాల కార్యకలాపాలను టీవీల్లో చూపితే ఆయనను రాజకీయంగా వ్యతిరేకించేవారు ఊరుకుంటారా? తమ వాణిని కూడా వినిపించాలని పట్టు పడతారు. పూర్తిగా వ్యక్తిగత శైలిలో ప్రధాని నెరపే దౌత్యం ప్రవాసులకు మాతృదేశం పట్ల ఉండే ప్రేమకు, ఒక రాజకీయ నాయకునిపై ఉండే అభిమానానికి మధ్య హద్దులు చెరిపేస్తున్నది.
ఢిల్లీ పాలకవర్గానికి ఆ సంగతి తెలుసు. పైగా ప్రవాస భారతీయుల రాజకీయ సమీకరణకు ముందుగా అడుగులు వేసింది వారే. విదేశాల్లోని మోదీ అనుకూల బృందాలకు స్వదేశంలో ప్రచారం దక్కేలా బీజేపీ చర్యలు చేపట్టింది. అదే సమయంలో ఇతరులు మోదీ వ్యతిరేకులకే కాదు, భారత వ్యతిరేకులకూ ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారత మీడియాలోని వర్గాలు బీజేపీకి వంతపాడుతూ ప్రధానిని విమర్శించడం దేశాన్ని విమర్శించడంగా భాష్యం చెప్తున్నాయి. ఈ ధోరణి ప్రవాస భారతీయులు స్థిరపడ్డ దేశాల్లో ఆందోళనకు దారితీసింది. అనేక దేశాలు భారతదేశంలోని రాజకీయ విభేదాలు తమతమ స్థానిక రాజకీయాల్లోకి ఎక్కడ చొచ్చుకు వస్తాయోనని, దౌత్య సంబంధాలను ఎక్కడ దెబ్బతీస్తాయోననే అనుమానంతో ప్రవాస భారతీయ రాజకీయులపై ఓ కన్నేసి ఉంచుతున్నాయి.
ఆసక్తి కలిగించే అంశమేమంటే ప్రవాస భారతీయుల రాజకీయ కార్యకలాపాల వల్ల స్వతంత్ర భారతం ఎదుర్కోబోయే సవాళ్లను జాతీయోద్యమ నాయకత్వం ఆ రోజుల్లోనే గుర్తించింది. 1947 నాటికే భారత దేశ ఉదాహరణను, విజయాలను అనుసరించి బ్రిటిష్ సామ్రాజ్యంతోపాటు ఇతర యూరోపియన్ సామ్రాజ్యాలన్నింటిలో వలసవాద వ్యతిరేక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.
అనేక బ్రిటిష్ వలసదేశాల్లో ప్రవాస భారతీయులు ఆ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆ పరిస్థితుల్లో మాతృదేశమైన భారత్ ప్రవాస భారతీయులతో ఏ తరహా సంబంధాలు కలిగి ఉండాలన్న ప్రశ్న అప్పటి జాతీయ నాయకత్వాన్ని వేధించింది. ప్రవాస భారతీయులతో భారత్ సంబంధాల్లో మూడు రకాల ఆలోచనలు నాటి జాతీయ నాయకత్వంలో ఉండేవని దౌత్యవేత్త నిరంజన్ దేశాయ్ ‘ఇండియా అండ్ ఇట్స్ డయాస్పోరా’ (ఇండియన్ ఫారిన్ అఫేర్స్ జర్నల్, అక్టోబర్-డిసెంబర్- 2006) అనే వ్యాసంలో రాశారు. ఆగాఖాన్, సర్ ఫిరోజ్షా మెహతా వంటివారు బ్రిటిష్ వలస దేశాల్లోని ప్రవాస భారతీయులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని, భారతీయులు అధిక సంఖ్యలో ఆయా దేశాలకు వలస వెళ్లేందుకు మార్గం సుగమం చేయాలని వాదించారు. అధిక జనాభా కలిగిన భారత్ నుంచి ఎంత ఎక్కువ మంది వలస పోతే భారం అంత తగ్గుతుందని వారు ఆశించారు.
తేజ్ బహదూర్ సప్రూ, జీఏ నటేశన్, వీఎస్ శ్రీనివాసశాస్త్రి, పురుషోత్తం దాస్ ఠాకూర్ దాస్తో కూడిన రెండోవర్గం మరికొంచెం ముందుకు వెళ్లింది. వలసవెళ్లిన భారతీయుల హక్కుల గురించి నొక్కిచెప్పారు. బ్రిటిష్ సామ్రాజ్యంలోని వలస దేశాలన్నిటిలోని ప్రవాస భారతీయులకు స్థానిక ప్రజలతో సమానంగా హక్కులు కల్పించాలని వారు వాదించారు. సామ్రాజ్యంలోని పాలితులుగా వలస వచ్చినవారు, స్థానికులు దేశం, జాతి అనేవాటితో నిమిత్తం లేకుండా సమాన హోదా పొందాలని వారు విశ్వసించారు. అందువల్ల ఆయా విదేశాల్లోని ప్రవాస భారతీయుల హక్కులకోసం స్వతంత్ర భారతం క్రియాశీలకంగా కృషి చేయాలని తెలిపారు.
మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఆ రెండు వర్గాలతో విభేదించారు. వారిది మానవీయమైన వైఖరిగా వ్యాసకర్త నిరంజన్ దేశాయ్ అభివర్ణిస్తారు. బ్రిటిష్ వలస దేశాల్లోని భారత సంతతి ప్రజలు స్థానికులతో కలిసిపోయి ఆతిథ్యదేశంతో మమేకం కావాలని గాంధీ, నెహ్రూలిద్దరూ భావించారని వివరించారు. సొంత దేశానికి, ప్రవాస దేశానికి మధ్య ఎలాంటి ద్వంద్వ విధేయత రావద్దని హెచ్చరించారు. ప్రవాస భారతీయులు తమతమ ఆతిథ్య దేశాల పౌరసత్వ హక్కులను సాధించుకుని ఆయా దేశాలలో భాగమైపోవాలని నెహ్రూ తరచుగా చెప్పేవారు.
ఆ రోజుల్లో దేశాదేశాల్లో భారతదేశ వలస విముక్తి కోసం ప్రచారోద్యమ బాధ్యతలు నిర్వహించిన కాంగ్రెస్ శాఖలుండేవి. కార్యకర్తలూ ఉండేవారు. వీకే కృష్ణమీనన్ మొదలుకుని నేతాజీ సుభాష్ చంద్రబోస్ దాకా విదేశీ గడ్డ మీద నుంచి భారత స్వాతంత్య్రం కోసం కృషి చేసిన ప్రముఖులెందరో ఉన్నారు. స్వతంత్ర భారతదేశ స్థానిక రాజకీయాలకు, విదేశాల్లోని ప్రవాస భారతీయుల రాజకీయాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉండాలని నెహ్రూ నొక్కిచెప్పేవారు. వారి (ప్రవాస భారతీయుల) పట్ల మన ఆసక్తి సాంస్కృతిక, మానవీయ అంశాలకే పరిమితం అవుతుంది, రాజకీయాలకు ఇక్కడ తావులేదు అని 1947లో లోక్సభలో ఆయన చెప్పారు. అప్పట్లో బ్రిటిష్ భూభాగాల విషయమై చెప్పిన ఈ మాటలు నేడు యావత్తు ప్రపంచంలోని ప్రవాస భారతీయులకు వర్తిస్తాయి. విదేశాల్లోని భారతీయులు ఆయాదేశాల పౌరులైపోయిన తర్వాత మాతృదేశ రాజకీయాల్లో తలదూర్చడం వారు మానుకోవాలి.
కాగా గతకొద్ది సంవత్సరాలుగా బీజేపీ ఇందుకు భిన్నమైన మార్గంలో పోతున్నది. స్వదేశీ గడ్డపై రాజకీయ లబ్ధి కోసం ప్రవాస భారతీయులను అంతకంతకూ అధికంగా సమీకరించే పనిలో పడింది. తద్వారా ప్రవాసుల్లో రాజకీయాలు పొడసూపడానికి, వారు ఇతోధికంగా భారత రాజకీయాల్లో తలదూర్చడానికి కారణమైంది. మతానికి, రాజకీయాలకు మధ్య విభజన రేఖను మసకబార్చడం ద్వారా కేవలం సామాజిక, సాంస్కృతిక శాఖలకే పరిమితమైన ప్రవాసుల కార్యకలాపాలకు రాజకీయం పులిమేసింది. ప్రవాస భారతీయులకు ఆశ్రయమిచ్చిన దేశాలతో భారత్ దౌత్య సంబంధాలపై దీని ప్రభావం పడుతుందని ముందుగానే ఊహించినవారికి తాజా పరిణామాలు ఆశ్చర్యం కలిగించవు.
కొందరు ప్రవాస రాజకీయ జీవులు ఈ తరహా ఎత్తుగడలకు సై అంటున్నారు. బ్రిటిష్ ప్రధాని రిషీ సునక్ ఇంగ్లండ్లో గోపూజలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆలయ సందర్శనను పెద్దఎత్తున ప్రచారం కోసం వాడుకున్నారు. ఇంగ్లండ్లోని హిందూ ఓట్లు రాబట్టేందుకు, ఢిల్లీలోని పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన ఈ తరహా పనులు చేస్తున్నారని తెలుస్తూనే ఉన్నది. ఈ తరహాలో మతాన్ని రాజకీయాలతో, రాజకీయాలను దౌత్యసంబంధాలతో, జాతి అస్తిత్వాన్ని వ్యక్తి గుర్తింపుతో కలగాపులగం చేయడం వల్ల తయారయ్యే ప్రమాదకర రసాయనం ప్రపంచంతో భారత్ సంబంధాలకు చేటు తెస్తుంది.
(ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌజన్యంతో)
అనువాదం: తుమ్మలపల్లి రఘురాములు
–సంజయ్ బారు