బీజేపీ రోజురోజుకూ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్నది. అది చేవెళ్ల సభతో మరింతగా బహిర్గతమైంది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయారు. తెలంగాణలో పాగా వేయాలన్న ఆతృతతో తమ సహజ లక్షణమైన ఆధిపత్య అహంకారాన్ని చాటుకున్నారు.
‘ప్రధాని పదవి గురించి కేసీఆర్ కల లు కంటున్నాడు కానీ.. ఆయన కుర్చీ తెలంగాణలోనే ఊడే పరిస్థితి ఉన్న’దని అమిత్షా చెప్పుకొచ్చాడు. ‘కేంద్రంలో ప్రధాని పదవి ఖాళీ లేదనీ, మోదీ మూడోసారి అధికారం చేపట్టబోతున్నాడ’ని జోస్యం చెప్పాడు. బండి మరో అడుగు ముందుకేసి అమిత్షాను ఉద్దేశించి.. పులి బయల్దేరింది..ఇక వేటనే అని ప్రకటించాడు. అంటే.. అమిత్ షా పులిలా తె లంగాణ మీద పడ్డాడని, ఇక బీజేపీయేతర పార్టీలను వేటాడుతాడనీ చెప్పటం గర్హనీయం.
అదే సభలో తాము అధికారం చేపట్టగానే తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దుచేస్తామని ప్రకటించి తమ సహజ మైనారిటీ వ్యతిరేకతను చాటుకున్నాడు అమిత్ షా. రాజ్యాంగబద్ధంగా, కేంద్ర ప్రభుత్వస్థాయిలో ఏర్పాటు చేసిన సచార్ కమిటీ లాంటి కమిషన్లు ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు అమ ల్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఒక్క మాటతో తొలిగించేస్తామని ప్రకటిస్తూ… తమ సహజ నైజాన్ని బీజేపీ చాటుకుంటున్నది. దేశంలో మత చిచ్చు రేపుతూ ఓట్లు దండుకోజూస్తున్న బీజేపీ ఆటలు అంతటా అన్నివేళలా సాగవు. లౌకిక, ప్రజాస్వామిక సంస్కృతికి నెలవైన తెలంగాణలో బీజేపీ కుట్రలు అసలుకే నడువవు.
చేవెళ్ల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. రాజకీయ సభలో ఎదుటి పక్షంపై విమర్శలు చేయటం సహజమే. రాజకీయ విధి విధానాలపై, అధికారపక్షం పనితీరుపై, పథకాల అమలు తీరుపై విమర్శలు చేయవచ్చు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా మేలుచేస్తారో చెప్పుకోవచ్చు. కానీ… ఇవేవీ చెప్పకుండా.. ఏకంగా ఎదుటి పక్షం నేతలను జైల్లో వేస్తామని బెదిరింపులకు దిగటం అప్రజాస్వామికం. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు నయానో భయానో విపక్ష పార్టీల నేతలను లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అనేక మంది తృణమూల్ నేతలపై కేంద్రసంస్థలైన ఈడీ, ఐటీ, సీబీఐలతో బీజేపీ దాడులు చేయించింది. ఎంపీలను, మంత్రులను అరెస్టు చేయించింది. అయి నా బెంగాల్లో మమతా బెనర్జీ వెరవకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి గెలిచారు. ఇప్పుడు ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి తెలంగాణ దాకా బీజేపీ దాడులు విస్తరించాయి. ఈడీ, ఐటీ దాడులతో విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు వంటివి బీజేపీ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని యావద్దేశం భావిస్తున్నది.
చేవెళ్ల సభలో అమిత్ షా మాట్లాడుతూ… ‘తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఖాళీగా ఉన్న దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను ఇవ్వకుండా నిరుద్యోగుల కడుపు కొడుతున్న’దని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత… గత రెండేండ్లలోనే నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. దీనికేం సమాధానం చెప్తారో చూడాలి. మోదీ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేండ్లలో 7.22 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే… వివిధ శాఖలు, విభాగాల్లో మరో 9 లక్షల 80 వేల ఉద్యోగ ఖాళీలున్నాయి. దేశవ్యాప్తంగా 22 కోట్ల మంది ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే.. 7 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చిన మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించటం విడ్డూరంగా ఉన్నది.
ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ ఆధిపత్య, అహంకార ధోరణిని విడిచిపెట్టాలి. అధికారంలోకి వచ్చేందుకు చేసిన వాగ్దానాలను అమలుచేయాలి. ముఖ్యంగా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. వాటన్నింటినీ గాలికొదిలేసి ఇప్పుడు విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం, బెదిరింపులకు పాల్పడటం క్షమించరానిది. ఇలాంటి ఆధిపత్య, నియంతృత్వ పోకడలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పకమానరు.
డాక్టర్ బీఎన్ రావు
98668 34717