మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే కీలకం. కానీ ప్రతిపక్షాలు లేకుండా ఏకపక్షపాలన చేయాలనుకుంటున్నది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అవినీతికి తావులేని పాలన అందిస్తామని నమ్మబలికి తొమ్మిదేండ్ల కింద అధికారంలోకి వచ్చిన బీజేపీ గద్దెనెక్కాక ఆది పూర్తిగా విస్మరించింది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే చర్యలను అమలు చేస్తున్నది. ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసం, తమ అనుయాయుల కోసం మాత్రమే పాలన సాగిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అనుకూలించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. కానీ నేడు మోదీ పాలనంతా బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగానే ఉన్నది. తొమ్మిదేండ్ల పాలనలో తొంభై ఏండ్లు వెనక్కు వెళ్లిన పరిస్థితి కనిపిస్తున్నది. ఓవైపు కరెన్సీ విలువ పడిపోతున్నది. ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. ఆర్థిక సంక్షో భం అలుముకుంటున్నది. జీడీపీ తలకిందులవుతున్నది. వస్తు ఉత్పత్తి తగ్గిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని పక్కన పెట్టి వాస్తవాలను తెలియనీయకుండా మభ్యపెట్టే ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ఉపాధికి కోతలు పడుతున్నాయి. పరిశ్రమలు మూతపడుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోతున్నది. కార్పొరేట్ల సంపద మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నది. మోదీని ప్రజలు ఎన్నుకున్నది తమ బతుకులను బా గు చేస్తాడని? ఒక్కసారి కాదు రెండుసార్లు గద్దెనెక్కించి ఇప్పుడు కడగండ్ల పాలవుతున్నారు. మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ కోసం ఆనాడు పంచవర్ష ప్రణాళికలలో భాగంగా ప్రభుత్వ రంగాన్ని ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికోసం ఏర్పాటు చేసింది నెహ్రూ ప్రభుత్వం. దేశ ప్రజలకు అవసరమైన బిలాయి, విశాఖ లాంటి ఉక్కు కర్మాగారాలను, మందుల సంస్థలను, ఎల్ఐసీ లాంటి ప్రజాప్రయోజన వ్యవస్థలను, ఈసీఐఎల్ లాంటి సాంకేతిక పరిశ్రమలను, షిప్పింగ్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమక్రమంగా నష్టాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, కారుచౌకగా అమ్మకాలకు తలుపులు తెరిచింది. తన సంపన్న మిత్రులకు దోచిపెడుతున్నది.
గత ఏడేండ్లుగా నిరాటంకంగా బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, స్టీల్ లాంటి లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను అంబానీ, అదానీ లాంటి పారిశ్రామిక దిగ్గజాలకు కారుచౌకగా కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఎన్నో త్యాగాలతో సంపాదించుకున్నవైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి తెరలేపింది. కార్మిక చట్టాల సవరణ పేరుతో నాలుగు కోడ్లుగా విభజించి పరిశ్రమల యజమాన్యాలకు మేలు చేకూర్చింది. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని 12 గంటలకు మార్చింది.
పేద, మధ్య తరగతి వర్గాలపై అధిక భారాలు మోపుతూ పెద్దలకు మాత్రం రాయితీల మీద రాయితీలు కల్పిస్తూ వారికి అంతులేని లాభాలను కట్టబెడుతోంది మోదీ ప్రభుత్వం. మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచ కుబేరుల్లో భారత్ నుంచి స్థానం సంపాదించుకున్నవాడు అదానీ. అంటే దీనికి కారణం మోదీ అందదండలే. తాజాగా అదానీ కంపెనీకి చెందిన ఎన్ఎమ్ఎల్ సంస్థకు రూ.12,770 కోట్ల రుణాన్ని ఎస్బీఐ మాఫీ చేసింది. 2021 జులైలో అదానీ ఏయిర్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ ద్వారా ముంబై అం తర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ను సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. అదానీ డొల్ల వ్యాపారాలు బహిర్గతమైన కూడా పార్లమెంట్లో మోదీ నిర్లజ్జగా వెనుకేసుకు రావడం వెనుక వాస్తవా లు ఏమిటో దేశ ప్రజలకు తెలియాలి? పార్లమెంట్ లో చర్చ జరగకుండా, ఆదానీ గుట్టు బయటపడకుం డా మోడీ ప్రభుత్వం కాపాడింది.
అధికారంలోకి వస్తే నల్లధనం వెలికితీసి ప్రతి పౌ రుడికి రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కనీసం రూ.15 కూడా సామాన్యుని ఖా తాలో జమ కాలేదు. కానీ అదానీ లాంటి బడాబాబుల ఆస్తులు మాత్రం లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇదేకాదు బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో ప్రభుత్వ పెద్దలు రూ.లక్ష కోట్ల స్కాముకు పాల్పడ్డారనిని కాగ్ నివేదిక వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం గుర్తు తెలియని సంస్థలకు, ఏజెన్సీలకు ఏకంగా వేల కోట్లను చెల్లించింది. మరోవైపు, కేంద్రం విపక్ష పాలిత రాష్ర్టాలకు ఆర్థిక పరమైన చెల్లింపులలో మోకాలడ్డుతున్నది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి.
భిన్నత్వంలో ఏకత్వంగా సాగుతున్న ప్రజల్ని కులం పేర, మతం పేర చీల్చుతున్నది. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల పట్ల గొంతెత్తినా పత్రికల్లో రాసినా, మీడియాలో చూపినా ఆక్రమ అరెస్టులు, కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నది.
యూపీలో యోగి సర్కార్.. నేరచరిత్ర పేరిట 233 మందిని ఎన్కౌంటర్ చేసింది. 4,484 మందిని జైలు పాలు చేసింది. ఈ దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాహుల్గాంధీల హంతకులతో పాటు, ఉగ్రవాదులు కసబ్, పార్లమెంట్పై దాడి చేసిన అఫ్జల్గురులను కూడా చట్టప్రకారం శిక్షలు పడే విధంగా చేసినటు వంటి దేశంలో… ప్రస్తుతం ఆరాచకం రాజ్యమేలుతున్నది. తమ మాట వినని ప్రతిపక్షాలను, నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఈడీ, సీబీఐ సంస్థల ద్వారా లొంగ దీసుకుంటున్నది. గవర్నర్లను రబ్బర్ స్టాంపులుగా ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టే విధానాలను అనుసరిస్తున్నది.
ఇటీవల జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. పుల్వామా ఘటనకు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని వెల్లడించారు. కేంద్రం అసమర్థత, చేతకానితనం వల్లనే 40 మంది జవాన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, మైనారిటీలు, మహిళలపై దాడులు దౌర్జన్యాలు పెరుగుతున్నా కేంద్రం మౌనం వహిస్తున్నది. మరోవైపు, తెలంగాణ-ఏపీలకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇరు రాష్ర్టాల మధ్య కొత్త కొట్లాటలు పెట్టే కుట్రలకు పాల్పడుతున్నది.మోదీ నియంత పాలనను గద్దెదించేందుకు జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలి. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
జూలకంటి రంగారెడ్డి
94900 98349