ప్రజల బతుకుల్లో వెలుగులు నింపే దేవాలయం లాంటిది పార్లమెంటు. ఒక రకంగా దేశానికి గుండెకాయ వంటిది, కోట్లాది ప్రజల తలరాతలు మార్చే చట్టసభ. కేంద్ర ప్రభుత్వం సర్వ హంగులతో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. కోట్లతో నిర్మించినంత మాత్రాన దానికి గుర్తింపు రాదు. ప్రజా సమస్యలు, ప్రజల అభివృద్ధి కోసం అంతే గుణాత్మకమైన నిర్ణయాలు జరిగితేనే దానికి విలువ. ప్రజల మేలుకోరే నిర్ణయాలు తీసుకునేలా పార్లమెంట్ ప్రజా వేదిక కావాలి. పార్టీలు, ప్రాంతాలకతీతంగా దేశ సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేసినప్పుడే పార్లమెంట్కు గౌరవం.
కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ తమ చేతుల్లో అధికారం ఉన్నదని అనేక సందర్భాల్లో సామాన్యుల జీవితాలతో ఆటలాడుకునే నిర్ణయాలు తీసుకున్నది. నోట్లరద్దు వంటి అనేక అర్ధరాత్రి నిర్ణయాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కొన్ని ఇతర బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత తిరిగి రద్దుచేసిన సంఘటనలెన్నో ఉన్నాయి. రైతు నల్లచట్టాలు తెచ్చి.. రైతుల ఆందోళనతో ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ మోదీ స్వయంగా ప్రకటించారు. అంటే అవి ఉద్దేశపూర్వక సంస్కరణలేనని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు వ్యతిరేకించే బిల్లులను ఆమోదిస్తూ… ప్రజలు డిమాండ్ చేసే బిల్లులు మాత్రం పార్లమెంటులో ఆమోదం పొందటం లేదు. దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, బీసీల జనగణన, ఎస్సీ వర్గీకరణ డిమాండ్లు ఏండ్ల తరబడి ఉన్నప్పటికీ అవి పార్లమెంటులో చర్చకు కూడా నోచుకోకపోవడం బాధాకరమైన విషయం.
దేశంలో ప్రశ్నించే గొంతులపై కత్తి పెట్టినట్లు.. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలతో ఓ వైపు దాడులు చేస్తూ కేంద్రం కుట్రలకు పాల్పడుతున్నది. మాట్లాడితే ధర్మం అంటూ.. అవినీతి లేని రాజ్యం అని చెప్పే బీజేపీ రోజురోజుకు దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది. ఇది అనేక సంఘటనల్లో స్పష్టమైంది. అధికార దాహంతో సామాన్యులపై బీజేపీ చేస్తున్న కుట్రలు తీవ్రమవుతున్నాయి.
దేశంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్లలో సబ్సిడీలు ఇస్తూ అదానీ, అంబానీలకు అండగా నిలుస్తున్నది. ఆకలితో అలమటించే వర్గాలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిందిపోయి, రాజకీయ ఎదుగుదల కోసం సంపన్నులకు అండగా నిలుస్తున్నది. దోషులు, అవినీతిపరులకు బీజేపీ కండువాలు కప్పి వారిని పుణ్యాత్ములుగా ప్రచారం చేస్తున్నది. అవినీతిపరులు, దోషులు, బ్యాంకు దోపిడీదారులను తమ దోస్తులుగా చేసుకొని మత విద్వేషాలతో అధికారంలోకి రావాలని చూస్తున్నది. ఆ కుట్రలను యావత్తు ప్రజానీకం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ మాటల్లో ధర్మాన్ని వల్లె వేస్తూ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
సుమారు 16 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయని గతంలో జరిగిన పార్లమెంటు సమావేశాల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ కొలువులను భర్తీచేయడంలో మాత్రం కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. కేంద్ర కొలువులకు సంబంధించిన వివిధ పరీక్షలను ఆయా ప్రాంతీయ భాషల ఆధారంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో వివిధ పోటీ పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైంది. దీనివల్ల కేంద్ర కొలువుల్లో తెలంగాణ వారు సత్తా చాటే అవకాశాలున్నాయి.
భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన క్రీడాకారుల పట్ల లైంగిక వేధింపులను నిరసిస్తూ… ఢిల్లీ నడిబొడ్డున ఆందోళనకు దిగితే కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. రెజ్లర్లను వేధించిన ఫెడరేషన్ చైర్మన్, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషన్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెజ్లర్ల పట్ల మానవత్వాన్ని చూపకపోవడం దురదృష్టకరం. పార్లమెంటు ప్రారంభోత్సవ సమయంలో కూడా వారు ఆవేదనతో, ఆందోళనకు దిగారు. కానీ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వారిని ఈడ్చుకువెళ్లి అరెస్టు చేశారు.
ఏదేమైనా అన్ని హంగులతో, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన పార్లమెంటులో భవిష్యత్తులో దేశాభివృద్ధికి అద్దంపట్టే నిర్ణయాలు జరగాలి. అంతేకానీ గతంలో మాదిరిగా ప్రజలకు భారంగా మారే సంస్కరణలు తెచ్చి వారిని ఇబ్బందులకు గురిచేయవద్దు. పార్లమెంట్ చేసే చట్టాలు ప్రజల తలరాతలు మార్చేలా ఉండాలే తప్ప, ఏకపక్షంగా ఉంటే ప్రజల బతుకులు మారవు. ఇప్పటికైనా ఆడంబరపు సంస్కరణలు కాకుండా, ప్రజా సంక్షేమానికి నూతన పార్లమెంటు వేదిక కావాలి. పార్లమెంట్ భవనం మానవత్వపు నిలయమై కోట్లాది ప్రజలకు అండగా నిలవాలి. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని దేశంలోని మెజారిటీ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకొని సామాన్య జనానికి సైతం పార్లమెంట్ అంటే తమ తలరాతను మార్చే నిర్ణయాధికార వేదిక అనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే పార్లమెంట్కైనా, అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికైనా గౌరవం. ఆ భరోసాను భారతదేశ పరిపాలనా సౌధంగా పార్లమెంట్ భవనం నిలవాలని ఆశిద్దాం. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకొనేలా ఆచరణలో చేసి చూపెడుదాం.
-సంపత్ గడ్డం
78933 03516