దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగిపోయి.. దోపిడీ, వివక్ష, పీడన నుంచి విముక్తి కలుగుతుందని ఆశించిన బీసీల ఆశలు అడియాసలయ్యాయి. స్వయం పాలనలోనూ ప్రజాస్వామ్యం ముసుగులో అగ్రకుల పెట్టుబడిదారులు పాలన పగ్గాలను తమ గుప్పెట్లోనే పెట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ వెనుకబడిన కులాలకు దాని ఫలాలు నేటికీ సంపూర్ణంగా అందడం లేదు. సంపద, భూములు, అధికారాన్ని కొందరు తమ చేతుల్లోనే బందీగా చేసుకొని.. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుంటుండటం విచారకరం.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగం కల్పించిన హక్కులు బీసీలకు దక్కకుండా చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల హయాంలోనే బీసీలు రాజకీయంగా తీవ్రంగా అణచివేతకు గురయ్యారు. కాంగ్రెస్ తర్వాత దేశాన్ని ఎక్కువ కాలం పాటు పాలించిన బీజేపీ కూడా బీసీలను వంచించింది. బిందేశ్వరి ప్రసాద్ మండల్ ఇచ్చిన నివేదిక అమలు కాకుండా అడ్డుకున్నది బీజేపీ నేతలే. నివేదిక అమలుకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, బీసీల వినాశనమే ఏకైక లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర చేపట్టి బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారు.
2018లో పార్లమెంట్ సాక్షిగా అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ 2021లో చేపట్టబోయే జనగణనలో భాగంగా బీసీ కులాల గణన చేపడతామని హామీ ఇచ్చారు. ఆ హామీని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. బీజేపీ హామీని నమ్మిన బీసీలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సర్కార్ మాట మార్చింది. కుల గణన చేపడితే కులాల మధ్య ఘర్షణలు తలెత్తుతాయని, దేశం విచ్ఛిన్నమవుతుందని, కులగణనకు తాము వ్యతిరేకమని ప్రకటించి బీసీలను మరోసారి మోసం చేసింది. మరోవైపు అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కూడా కుల గణన చేపడతామని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మబలికారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదు. సర్పంచుల పదవీకాలం ముగిసి మూడు నెలలవుతున్నా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టడం లేదు. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందన్న కుట్రతోనే సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదనే ఆరోపణలున్నాయి. బీజేపీని ఆదర్శంగా తీసుకున్న రాహుల్గాంధీ తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే ఓబీసీ కుల గణన చేపడుతామని పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో హామీ ఇస్తున్నారు. కులగణన చేపడతామని నాలుగు నెలల కిందట ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఈ విషయం రాహుల్గాంధీకి తెలియదనుకోవడం అమాయకత్వమే అవుతుంది.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓట్ల కోసం బీసీ జపం చేస్తున్న రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో మాత్రం సామాజిక న్యాయం పాటించడం లేదు. ఈ మధ్య ఎక్కువగా బీసీ మంత్రం పఠిస్తున్న కాంగ్రెస్ పార్టీ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు కేటాయిస్తామని ప్రగల్భాలు పలికింది. చివరికి 23 సీట్లు మాత్రమే కేటాయించింది.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలను చూసుకుంటే.. అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 6 స్థానాలను కేటాయించింది. బీజేపీ ఐదు సీట్లను కేటాయించగా, మూడు స్థానాలను మాత్రమే కేటాయించిన కాంగ్రెస్ బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నామినేటెడ్ పోస్టుల్లో 90 శాతానికి పైగా తన సామాజికవర్గానికి కేటాయించి బీసీ వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించారు.
ఎన్నో ఏండ్లుగా విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ, సామాజిక, పారిశ్రామిక రంగాల్లో అవకాశాలు కోల్పోయిన బీసీలు ఇప్పటికైనా ఏకతాటిపైకి రావాలి. రాజకీయంగా చైతన్యవంతం కావాలి. అలా జరిగినప్పుడే రాజ్యాధికారం కైవసం చేసుకుని బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారు.