భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తమ మతాచారాల ప్రకారం పండుగలు జరుపుకోవడం ఒక ఆనవాయితీ. ప్రత్యేకంగా దసరా నవరాత్రుల్లో ఆడపడచులు పూల పండుగ బతుకమ్మ గొప్పగా జరుపుకొంటారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రాష్ర్టాల నుంచి వలస వచ్చిన బీహారీలు ఛట్పూజ, బెంగాళీలు దుర్గా పూజ, మలయాళీలు ఓనమ్, మరాఠీలు గుడ్పావ్, గణేష్ చవితి, ఒడిశా వారు జగన్నాథ్ రథయాత్ర జరుపుకొంటారు.
దాదాపు 400 ఏండ్ల కిందట శ్రీభగవద్రామానుజులు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కోసం తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతికి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది తెలంగాణ రాష్ర్టానికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. వారు ప్రజలకు వైష్ణవత్వం బోధిస్తూ వారిని శిష్యులుగా చేసుకొని మంత్రోపదేశం చేయడంతో ఆ శిష్యులు గురుదక్షిణ కింద వైష్ణవ గురువులకు కొంత భూమి దానం చేశారు. గురువులు ఆ భూమి ద్వారా వచ్చిన ఆదాయంతో జీవనం కొనసాగిస్తూ వచ్చారు. ఈ వైష్ణవ గురువులలో శ్రీ కూరత్తాళ్వార్ సంబధీకులు శ్రీ వేద వ్యాస భట్టర్, శ్రీ పరాశర భట్టర్ ఆళవందార్, మఠతమ్మాళ్, తిరునంతల్వార్, అమ్మింగి అమ్మాళ్, కిడాంబి వంశస్తులున్నారు. వీరు శరన్నవరాత్రులను విభిన్నరీతిలో జరుపుకొంటారు. ప్రస్తుతం ఈ కుటుంబాలు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నివసిస్తున్నాయి.
ఆశ్వయుజ పాడ్యమి నాడు వారి ఇండ్లల్లో చెక్క బొమ్మల కొలువు ఏర్పాటుచేసుకొని ఉదయం, సాయంత్రం ఆ బొమ్మల కొలువుకు హారతిస్తూ, దేవతా మూర్తులకు పిండి వంటలలో మొదటిరోజు బొబ్బట్లు, రెండవ రోజు చక్కెర పొంగలి, మూడవరోజు పులిహోర, దద్ధోజనం, నాల్గవ రోజు పాయసం బజ్జీలు, ఐదవ రోజు మూల నక్షత్రం సరస్వతి పూజ రోజు కుడుములు, ఆరవ రోజు లడ్డులు, ఏడవ రోజు పప్పు గారెలు, పాయసం, మహర్నవమి రోజు మహాలక్ష్మి పూజ నిర్వహించి బొబ్బట్లు, విజయదశమి రోజు ఇష్టమైన తీపి వంటలు నైవేద్యంగా పెడుతారు. ప్రతి రోజు ముత్తయిదువులను పేరంటాలకు పిలిచి తాంబూలం ఇచ్చి వైభవంగా జరుపుకొంటున్నారు.
విజయదశమిరోజు తర్వాత శ్రావణ నక్షత్రం రోజు బంధువులను, స్నేహితులను పిలిచి వాయనాలు ఇచ్చి చెక్క దేవత బొమ్మల కొలువులకు ఉద్వాసన పలికి తరతరాలుగా వస్తున్న వారి ఆచారాలు, సంప్రదాయాలను మరిచిపోకుండా జరుపుకోవడం వీరి ప్రత్యేకత.
ఈ చెక్క దేవత బొమ్మలను నూతనంగా పెండ్లి అయ్యి అత్తారింటికి వెళ్లేటప్పుడు నూతన వధువు ఒడిలో ఉంచి ఆనవాయితీ కొనసాగించమని వధువు తల్లిదండ్రులు చెప్తారు. నేటి తరానికి భక్తిని అందిస్తూ పండుగలు జరుపుకోవడం శ్రీ వైష్ణవుల కుటుంబాల ప్రత్యేకత. ఇలాంటి విభిన్నరీతిలో తమిళులు వారి సంప్రదాయం ఇంకను కొనసాగించడంలో తెలంగాణ ప్రజల ఆదరణ, ఆప్యాయతలే కారణం.
-ఆళవందార్ వేణుమాధవ్
86860 51752