విద్య, వైద్యం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు ఎంత శ్రద్ధ వహిస్తాయో తెలంగాణ ప్రభుత్వమూ అంతే శ్రద్ధ వహిస్తున్నది. మౌలిక సదుపాయాల కల్పన, అవసరానికి తగ్గట్టు వైద్య కళాశాలల ఏర్పాటు, భారీగా నిధుల కేటాయింపు తదితర చర్యల ద్వారా గడిచిన తొమ్మిదేండ్ల పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని సీఎం కేసీఆర్ అత్యంత బలోపేతం చేశారు. ఆయన నిర్దేశించిన మార్గంలో ముందుకు సాగుతున్న వైద్య శాఖ మంత్రి హరీశ్రావు వినూత్న కార్యక్రమాలు, అద్భుత పథకాలను అమలు చేస్తుండటంతో ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో 21 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే కాకుండా మరో 8 కాలేజీలు, వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ నలుమూలలా 4 టిమ్స్ దవాఖానలు, రెండు వేల పడకలతో మరో నిమ్స్ దవాఖాన నిర్మించింది. గర్భిణులు, బాలింతల కోసం అమ్మ ఒడి-కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించింది. వీటి వల్ల అద్భుత ఫలితాలు వస్తున్నాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 72 శాతానికి పెరిగాయి. గర్భిణుల్లో రక్త హీనత సమస్య పోగొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ పోషకాహార కిట్ పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ఫలితంగా తక్కువ మాతా శిశు మరణాలు గల రాష్ర్టాల జాబితాలో మనం మూడవ స్థానంలో నిలిచాం.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి రూ.4932 కోట్లు కేటాయించగా.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆ బడ్జెట్ను రూ.12,364 కోట్లకు పెంచింది. అంటే ఈ తొమ్మిదేండ్లలో వైద్యరంగానికి కేటాయించిన బడ్జెట్ రెండున్నర రెట్లు పెరిగింది.
వైద్యరంగానికి తలసరి బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థ పాలనకు మచ్చుతునక. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఒక వ్యక్తిపై తలసరి ఆరోగ్య కేటాయింపు రూ.925 కాగా, ప్రస్తుతం అది రూ.3225గా నమోదైంది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం అయిదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. దీని వల్ల పేదలు సరైన వైద్యసేవలు అందక నానా ఇబ్బందులు పడేవారు. తెలంగాణకు చెందిన విద్యార్థులు వైద్య విద్య కోసం ఆర్థిక భారమైనా రష్యా, చైనా, ఉక్రెయిన్ దేశాలకు వెళ్ళేవారు. విద్యార్థుల కష్టాలను గమనించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 24 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసి పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే బాధను తప్పించింది. 2014లో రాష్ట్రంలో 2950 మెడిసిన్ సీట్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 8340కు పెరిగింది.
మారుమూల జిల్లాల్లో కూడా వైద్య కళాశాలల ఏర్పాటుతో నిరుద్యోగ వైద్య విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తం 15 వేల వైద్యుల పోస్టులు సృష్టించారు. అమ్మ ఒడి వాహనాలు, పీహెచ్సీలలో లైవ్ కెమెరాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కొత్త భవనాలు, టెలీ మెడిసిన్ కన్సల్టేషన్ సేవలు, ఎన్సీడీ స్క్రీనింగ్, ఆశా వర్కర్ల ద్వారా కిట్స్ పంపిణీ, డైట్, శానిటేషన్ చార్జీల పెంపు, ప్రతి మంగళవారం ఉమెన్ క్లినిక్స్, డయాలసిస్ సేవలు, ఆరోగ్యశ్రీ సేవలు, కంటి వెలుగు& ఇలా ప్రజారోగ్యం మెరుగు పడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను, కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నది. కంటి వెలుగు పథకమైతే పరీక్షల నిర్వహణలో పరుగులు పెడుతున్నది. అవయవ దానంలో కూడా దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇలా ఎన్నో వినూత్న పథకాలతో సంపూర్ణ ఆరోగ్య రాష్ట్రంగా తెలంగాణ వెలిగిపోతున్నది!
ఇదే కాకుండా ప్రివెంటివ్ కేర్లో భాగంగా 100 శాతం ఇండ్లకు రక్షిత మంచి నీళ్లు, బహిరంగ మల మూత్ర విసర్జన 100 శాతం నిర్మూలన, 93 శాతం ఇండ్లకు వంటగ్యాస్, చిన్నారుల వ్యాక్సినేషన్ 100 శాతం విజయవంతంగా పూర్తి చేయడం తదితర లక్ష్యాల సాధన ద్వారా వివిధ వ్యాధుల నిర్మూలన దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులు వేస్తున్నది..వైద్య విప్లవం తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచింది.
(వ్యాసకర్త: అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఐఎంఎ)
డాక్టర్ బీఎన్ రావు
98668 34717