‘నాలాగే నా కొడుకు కూడా ఆటో నడపకూడదంటే మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టింది. ఓ ఆటో డ్రైవర్తో ఈ మేరకు వీడియో చేయించి సోషల్ మీడియాలో దాన్ని విపరీతంగా షేర్ చేసింది. ఎన్నికలు ముగిశాయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వస్తూనే ఆటోవాలాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది.
ఆటోలు నడుపుకొంటూ బతుకీడుస్తున్న చాలామంది జీవితాలపై కాంగ్రెస్ దెబ్బకొట్టింది. మార్పు అంటూ గద్దెనెక్కిన హస్తం సర్కార్ తీసుకొచ్చిన మొదటి మార్పు ఆటోవాలాల జీవితాలను సమూలంగా మార్చేసింది. అది అలాంటిలాంటి మార్పు కాదు. రేవంత్రెడ్డి సర్కార్ అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆటోవాలాలు ఆగమైపోయారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే మార్పు అంటే ఏంటో ఆటో డ్రైవర్ల ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. మహిళలెవరూ ఆటోల దిక్కు చూడటం లేదు. మహిళలకు ఉచితం కావడంతో వారితో పాటే కుటుంబంలోని పురుషులు కూడా బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో గిరాకీలు లేక ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. ఉచిత బస్సు రూపంలో ఊహించని విపత్తు తమ బతుకులను ఆగం చేయడంతో ఏం చేయాలో తెలియక అనేక మంది డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 30 ఏండ్లలోపు వారు, పెండ్లికాని యువకులే ఎక్కువ మంది ఉండటం ఆందోళనకరం.
జీవనాధారం కోసం ఎక్కువమంది అప్పులు చేసి, లోన్లు తీసుకొని ఆటోలను కొంటుంటారు. ఆదాయం లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఎక్కువ కావడం బాధాకరం. కుటుంబ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, ఆటో ఈఎంఐలు, ఇతర ఈఎంఐలు.. ఇలా ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుండటంతో మనోధైర్యాన్ని కోల్పోయి ఇప్పటివరకు 21 మంది తనువు చాలించారు.
ఆదుకుంటుందనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. గతేడాది డిసెంబర్ 23న సీఎం రేవంత్రెడ్డితో ఆటో డ్రైవర్లు సమావేశమయ్యారు. తమ గోడును వెళ్లబోసుకున్నారు. వ్యథనంతా విన్న రేవంత్రెడ్డి విచిత్రంగా.. ఆటో డ్రైవర్లు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామనడంతో వారంతా నిర్ఘాంతపోయారు. తమ బతుకుదెరువుకు భరోసా ఇస్తారనుకుంటే.. చనిపోయిన తర్వాత సాయం చేస్తామనడం ఏమాత్రం సమంజసంగా లేదని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వివిధ యూనియన్లు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆటోడ్రైవర్లకు అండగా నిలుస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నది. ఆటోవాలాల సమస్యలు, వారి స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఆటో డ్రైవర్లకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆటోల్లోనే అసెంబ్లీకి వెళ్లి మద్దతుగా నిలిచారు. అసెంబ్లీలోనూ ఆటో డ్రైవర్ల గురించి ప్రస్తావించారు. అయితే, అదంతా డ్రామా అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటోవాలాల ఆత్మహత్యలను కొట్టిపారేయడం రేవంత్రెడ్డి సర్కార్ తీరును స్పష్టం చేస్తున్నది.
గత ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేసినట్టే.. ఆటోల రుణమాఫీ చేసి ఆదుకోవాలి. తద్వారా కొంత భారం తగ్గుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు అందించి ఆత్మహత్యలను నివారించాలి. చనిపోయిన ఒక్కో డ్రైవర్ కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేయాలి. మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచించాలి. ఆటో డ్రైవర్ల బతుకులకు ఊతం ఇచ్చే విధంగా తక్షణమే పై మూడు చర్యలు చేపట్టాలి.
అంజి గోపి
89788 37933