‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ (అందరికి తోడు.. అందరికి వికాసం) అనేది బీజేపీకి ఉత్త నినాదం మాత్రమే. ఆ అందరిలో సమాజంలోని చాలామంది ఉండరు. ముఖ్యంగా దళితులు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అంతకంతకూ పెరుగుతున్న దాడులే దీనికి ఉదాహరణ. వికాసం మాట దేవుడెరుగు, ముందు బతకనిస్తేగా అన్నట్టుంది ఆ రాష్ర్టాల పరిస్థితి. దళితుడిపై మూత్ర విసర్జన ఘటన జరిగి ఎంతోకాలం కాలేదు. ఆ ఘటన బాధితుడిని మధ్యప్రదేశ్ సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ఇంటికి పిలిపించుకొని కాళ్లు కడిగి ఆ ఫొటోలతో, వీడియోలతో ప్రచారం చేసుకున్నారు. అయినా దళితులపై దాడులు ఆగలేదు. మరో ఘటనలో ఓ దళితుడిపై అశుద్ధాన్ని చల్లి అవమానించడంపై కేసు నమోదైంది. గతవారం మధ్యప్రదేశ్లోనే ఓ దళిత యువకుడిని కొట్టిచంపిన ఘటన బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని పరిస్థితికి తాజా ఉదాహరణ. మృతుడు లైంగికదాడి బాధితురాలికి తమ్ముడు. ఆ కేసును ఉపసంహరించుకోమని నిందితులు దాడి చేశారు. ఆ దాడిలో మృతుని తల్లికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఇదీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితుల దయనీయ పరిస్థితి. ఇలాంటి వార్తలు రాని రోజంటూ లేదు.
ఈ నేపథ్యంలో జాతీయ నేరాల నివేదికలో దళితులపై దాడుల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే మధ్యప్రదేశ్ మూడోస్థానంలో నిలువడంలో ఆశ్చర్యమేమున్నది? దళితుల ఆరాధ్య దైవమైన సంత్ రవిదాస్ మందిరాన్ని మధ్యప్రదేశ్లోని సాగర్లో రూ.వంద కోట్లతో కడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ గుడి శంకుస్థాపనకు అట్టహాసంగా వచ్చారు, వెళ్లారు. ఫొటోలు దిగే అవకాశం వస్తే ఆయన జార విడుచుకోరు కదా! కానీ ఆ రాష్ట్రంలో దళితులపై జరిగే దాడుల గురించి మాత్రం నోరు విప్పరు. కేసుల నమోదు మొక్కుబడిగా, వాటి విచారణ తూతూ మంత్రంగా జరుగుతున్నది. దోషులకు శిక్షలు పడటం కూడా 36 శాతానికి పరిమితం కావడం గమనార్హం. పార్లమెంటులో దళితులపై దాడుల అంశం ప్రస్తావనకు వస్తే కేంద్రం ఆత్మసమర్థనకు దిగుతుంది. నెపం రాష్ర్టాల మీదకు నెట్టి చేతులు దులుపేసుకుంటున్నది. ఇది రాష్ర్టాల పరిధిలోని శాంతిభద్రతల కిందకు వస్తుందని, కనుక రాష్ర్టాలే చూసుకోవాలని బుకాయిస్తున్నది. అదే సమయంలో డబుల్ ఇంజిన్ పాలన గురించి మాత్రం ప్రస్తావించదు.
2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులపై దాడులు జరగకుండా చూస్తామని, భద్రత కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ అందుకు చేసింది మాత్రం ఏమీ లేదు. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టోలో దళితులకు, సంపన్న వర్గాలకు మధ్య ఆర్థిక అంతరాలను తగ్గిస్తామని కూడా గొప్పగా ప్రకటించింది. కానీ దళితుల సంక్షేమానికి, అభివృద్ధికి బీజేపీ రాష్ర్టాలు అరకొర నిధులు మాత్రమే కేటాయించడం ఆ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు తరహా పథకం ఒక్కటైనా తెచ్చారా అంటే అదీ లేదు. నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంపితే స్పందనే లేదు. కేవలం ఎన్నికల రుతువులో మాత్రమే దళితుల నామజపం చేసే బీజేపీ వారి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.