ఎన్నికల వేళ తోక పార్టీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. ఈ పార్టీలను రంగంలోకి దింపుతున్నది భారతీయ జనతా పార్టీనే అని చిన్న పిల్లాడినడిగినా చెప్తాడు.రాష్ట్రం నుంచి ఛీ పో అని తరిమేసినా మళ్లీ వస్తున్నది టీడీపీ. కనీసం అధినేతను కూడా గెలిపించుకోలేని జనసేన పార్టీ మేమూ పోటీచేస్తామని ప్రకటించింది. ఇక జగనన్న వదిలిన బాణం ముందే దిగిపోయిన విషయం తెలిసిందే. ఈ పార్టీల వైఖరి చూస్తున్న రాజకీయ విశ్లేషకులు ‘ఉమ్మడి తంత్రం వర్సెస్ అభివృద్ధి మంత్రం’ అని అభివర్ణిస్తున్నారు.
ఓటుకు నోటు దొంగా ఇక్కడే.. : ఇక ఓటుకు నోటుతో టీడీపీ పతనానికి పూర్తి కారకుడైన రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరి దాన్ని పతనావస్థకు తీసుకువచ్చాడు. ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నట్టు.. హస్తం పార్టీలో ఎవరికి వారే నాయకులమని ప్రకటించుకొని ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డికే కౌంటర్స్ ఇస్తూ పాదయాత్రలు సాగిస్తున్నారు.
ఏదేమైనా సరే అధికారం దక్కించుకోవడమే బీజేపీ లక్ష్యం. అందుకోసం ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా ఆ పార్టీ నేతలు వెనుకాడరన్నది జగమెరిగిన సత్యం. తమకు అధికారం దక్కనిచోట అక్రమంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మరీ చాలా రాష్ర్టాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసింది. మరికొన్ని చోట్ల ఉన్న ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారం చేజిక్కించుకున్నది. కానీ.. ఈసారి బీజేపీ కొత్త స్ట్రాటజీ ఉపయోగిస్తున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ను ఒంటరిగా ఢీకొనే దమ్ములేక తనతో కలిసివచ్చే తోక పార్టీలను రంగంలోకి దింపుతున్నది. ఏపీ సీఎం జగన్పై ఉన్న కేసులను అడ్డు పెట్టుకొని అక్కడ ఆయన్ను తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నది. ఇదే సమయంలో ఆయన సోదరి వైఎస్ షర్మిలను తెలంగాణకు పంపించి పాదయాత్రల పేరిట ప్రచారం ప్రారంభించింది. ముందునుంచీ బీజేపీకి బీ టీమ్గా ఉన్న టీడీపీ.. దాని తోక పార్టీ జనసేననూ ఇప్పుడు తెలంగాణకు తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఓటుకు నోటు కేసుతో తెలంగాణ నుంచి టీడీపీని తరిమేసినా.. ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం పేరిట ఇక్కడికి వచ్చి పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. ఇక దాని తోక పార్టీ అయిన జనసేన తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు.
‘బీజేపీ.. అంటే దేశమంతా భారతీయ జన తా పార్టీ. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణలో మాత్రం బీజేపీ తన పేరు మార్చేసుకుంది. బీ అంటే బాబు.. జే అంటే జగనన్న విడిచిన బాణం… పీ అంటే పవన్ కల్యాణ్లా మారిపోయింది. మొత్తంగా ఓటు దొంగలనంతా ఒకే చోటకు చేరుస్తున్నది.
మోతుబరా.. మొనగాడా ?
ఓ ఊర్లో పేరుమోసిన మోతుబరి ఉన్నాడు. చాలా ఏండ్లుగా ఆయనే అక్కడ సర్పంచ్. ఊరినంతా గుప్పిట్లో పెట్టుకొని లెక్కకు మించి ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఎంత సంపాదించినా అతనికి ఏదో వెలితిగా అనిపించేది. తనకెంతో ఇష్టమైన మామిడి పండ్లను కొనుక్కొనే తినాల్సి వస్తోందే అని బాధపడిపోయాడు. వెంటనే ఊరవతల ఓ మామిడి మొక్క నాటాడు. అది పెద్దదయ్యాక దాని నుంచి వచ్చే పండ్లను తాను, తన కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఎంచక్కా తినేయొచ్చని ఆనందపడ్డాడు. కానీ.. ఇంతలోనే ఆ ఊర్లోని యువకుడు ఉద్యమ స్ఫూర్తితో ముందుకువచ్చాడు. ఒక్క మొక్క నాటితే కేవలం సర్పంచ్కే పండ్లు దక్కుతాయి. అదే ఎక్కువగా నాటితే ఊరంతా తినొచ్చు కదా అని అందరికీ వివరించాడు. వారందరిలో చైతన్యం రగిలించి ఆ మొక్క చుట్టూ చాలా మామిడి మొక్కలు నాటించాడు. ఇది నచ్చని సదరు మోతుబరి సర్పంచ్ అడ్డుకోబోతే.. జనమంతా ఒక్కటై అతన్ని ఊరి నుంచి వెలివేశారు. తమకు బంగారు భవిష్యత్తు చూపించిన ఆ యువకుడిని సర్పంచ్ను చేశారు. ఆ తర్వాత వాళ్లు నాటిన మొక్కలు వృక్షాలై మామిడి పండ్లు విరగకాశాయి. ఆ ఊరికే కాదు.. చుట్టుపక్కల ఊర్ల వాళ్లకూ ఆ ఫలాలు అందాయి.
సీన్ కట్ చేస్తే.. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఆ ఊరికొచ్చాడు మోతుబరి సర్పంచ్. ఇక్కడ మొదట మొక్క నాటింది నేనే. నావల్లే ఇప్పుడు ఇన్ని పండ్లు వస్తున్నాయి. ఊరంతా పెద్ద తోట పెరిగింది. కాబట్టి ఈ పండ్ల వల్ల వచ్చే డబ్బంతా నాకే కావాలి, మళ్లీ నేనే సర్పంచ్ అవ్వాలనడం మొదలుపెట్టాడు. మరి ఆ మోతుబరి మాటల్ని ఇప్పుడు ఆ ఊరి ప్రజలు నమ్ముతారా? మళ్లీ అతన్ని సర్పంచ్ను చేస్తారా?
ఇప్పుడీ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇక్కడ మోతుబరి సర్పంచ్ ఎవరో కాదు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన నాటానని చెబుతున్న మొక్క హైటెక్ సిటీ.ఇక ఉద్యమ స్ఫూర్తి రగిలించిన యువకుడు కల్వకుంట్ల
చంద్రశేఖర్రావు.
ఫ్లె ఓవర్లు, అండర్ పాస్లు, అందమైన రోడ్లు, ఐటీ కంపెనీలు, విదేశీ పెట్టుబడులతో హైదరాబాద్ నగరాన్ని స్వర్గధామంలా మార్చి న కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రి. అభివృద్ధి ఫలాలను రాష్ట్ర ప్రజలందరికీ అందిస్తున్న జననేత. కానీ.. ఇప్పుడు మళ్లీ తెలంగాణలోకి వచ్చిన చంద్రబాబు.. నేను కట్టిన హైటెక్ సిటీ వల్లే ఇంత అభివృద్ధి జరిగిందని.. అందుకే తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పుకొస్తున్నారు. ఒకేఒక్క మొక్క నాటి కనీసం దానికి నీళ్లు కూడా పోయకుండా వెళ్లిపోయిన మోతుబరి సర్పంచ్ చేసింది అభివృద్ధా ? లేక ఒక మొక్కను వందల మొక్కలు చేసి ఆ ఫలాలను ప్రజలందరికీ అందిస్తున్న కేసీఆర్ చేసింది అభివృద్ధా?
జగనన్న బాణం.. అదే కారణం!
ఒకప్పుడు తండ్రి సీఎం. అన్న పెద్ద బిజినెస్మ్యాన్. లక్షల కోట్లు సంపాదించారు. తండ్రి చనిపోయిన తర్వాత అన్న సీఎం అయ్యాడు. డబ్బులకు కొదవ లేదు. ఏ పదవి కావాలన్నా దొరుకుతుంది. పదేండ్లు పార్టీ కన్వీనర్గా ఉన్న షర్మిల.. అన్న కోసం పాదయాత్రలు చేసి మరీ గెలిపించింది. అనూహ్యంగా ఆమెకు అన్నతో వచ్చిన విభేదాలేంటి? ఆమె తెలంగాణకు ఎం దుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ వైసీపీ ప్రభా వం లేదని.. గెలవలేమని తెలిసినా ఎందుకు పాదయాత్రలు చేస్తున్నది? ఈ యాత్రల వెనుక మర్మమేంటి? అంటే.. అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయిన జగన్.. ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశమున్నది. దాన్ని అడ్డుపెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. జగన్ను తన కనుసన్నల్లో నడిపిస్తున్నది. అన్నను కాపాడాలంటే చెల్లెలు తెలంగాణకు వెళ్లాలి. అక్కడ ఓట్లు చీల్చాలి అదే బీజేపీ స్ట్రాటజీ. ఇంకేముంది జగనన్న బాణం దూసుకుపోతున్నది. ఆడమగా తేడా లేకుండా దొరికినవాళ్లనల్లా బూతులు తిడుతూ యాత్రలు చేస్తున్నది. పచ్చని తెలంగాణలో చిచ్చు పెడుతున్నది.
తెలుగు ‘తమ్ముడు’.. పవన్ ‘బాబు’
సినీ ఛరిష్మాతో రాజకీయం చేద్దామని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ను జనం మాత్రం మెచ్చలేదు. 2014 నుంచే ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2019లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కూటమితో కలిసి పోటీ చేశా రు. ఈ ఎన్నికల్లో పైకి కూటమితో ఉన్నా.. లోపాయికారిగా బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చారన్నది బహిరంగమే. ఫలితంగానే ఏపీ మొత్తం కలిపి కేవలం ఒకే ఒక్క సీటు దక్కించుకున్నారు. ఆయనా విజయం సాధించలేదు.
సినిమా.. యాక్షన్.. కట్!
మొత్తంగా బీజేపీ బీ టీమ్తో ప్రారంభించిన సినిమాకు ప్రొడ్యూసర్ మోదీ అయితే.. డైరెక్టర్ షా. తెలంగాణలో కుట్ర రాజకీయాల సినిమాను ప్రారంభించిన వారు.. తొలుత షర్మిల యాత్రలకు క్లాప్ కొడితే.. ఇప్పుడు టీడీపీతో యాక్షన్ ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్రం లో ఈసారి ఎన్నికలు ‘ఉమ్మడి తంత్రం వర్సెస్ అభివృద్ధి మంత్రం’గా కొనసాగనున్నాయి. కానీ.. బీఆర్ఎస్ను ప్రజలు ఎప్పుడూ నెత్తిన పెట్టుకునే చూసుకుంటారు. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్కు విజయం కట్టబెట్టి రథసారథి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసిన ఆ ప్రజలే.. ఈసారీ బీజేపీ సినిమాకు కట్ చెప్పనున్నారు. మరోమారు ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టనున్నారు.
అన్న కేసుల కోసం చెల్లెలి పోరాటం..
ఉమ్మడి రాజకీయానికి తమ్ముడి ఆరాటం..
కొడుక్కి కావాలి బాబు కిరీటం
ఒక చెల్లెలు, ఒక తమ్ముడు, ఒక కొడుకు,
ఒక బాబు.. ఇదీ కథ.
స్టోరీ, స్క్రీన్ప్లే, డైరెక్షన్: అమిత్ షా
ప్రొడ్యూసర్: నరేంద్ర మోదీ..
-గాజుల నాగార్జున
91827 77880