కనీ వినీ ఎరుగని రీతిలో ప్రజా సంక్షేమ పథకాలతో పరుగులు పెడుతున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు తెలంగాణ వైపు దృష్టి సారిస్తున్నారు.‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే లక్ష్యంతో ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అహరహం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనలేని అభివృద్ధికి బాటలు వేశారు. కేసీఆర్ సమర్థవంతమైన పాలనను దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు. తెలంగాణలో అమలులోకి తెచ్చిన 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతుబీమా, దళితబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు దేశమంతా అమలైతే దేశం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందన్న విశ్వాసం దేశ ప్రజల్లో నెలకొన్నది.
తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపుగా పట్టుకొని ఉద్యమానికి పునాదిరాళ్లుగా మలుచుకున్నారు. ఎవరెన్ని రకాలుగా విమర్శించినా తెలంగాణ సాధనే తన ప్రధాన కర్తవ్యమంటూ మొక్కవోని దీక్షతో పోరుబాట పట్టారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లే ఆయన బయటకు వచ్చి ఉద్యమం పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని కేసీఆర్కు పదవీలాలసను అంటగట్టారు. అయినా చలించలేదు. భౌగోళిక, చారిత్రక,సామాజిక, ఆర్థిక, రాజకీయ తెలంగాణను సంపూర్ణంగా అధ్యయనం చేశారు.
జయశంకర్సార్, కేశవరావ్ జాదవ్, విద్యాసాగర్ వంటి తెలంగాణ మేధావులు, వివిధ రంగాలకు చెందిన ఉద్ధండులు, నిష్ణాతులతో గంటల తరబడి చర్చలు, సమాలోచనలు చేశారు. తొలినుంచి తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన మోసాన్ని కేసీఆర్ కూలంకుషంగా అధ్యయనం చేశారు. రెండు ప్రాంతాల మధ్య నెలకొన్న వైషమ్యాలను, తెలంగాణ రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ , ఎస్టీ, మేధావులు కులవృత్తులకు సామాజికంగా జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడానికి కేవలం పోరాటం ఒక్కటే మార్గం కాదని దానికి రాజకీయ పరిష్కారం అవసరమని కేసీఆర్ గుర్తించారు. ఆ దిశగా చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీని స్థాపించి ఎన్నికలను తన రాజకీయ ఎజెండాగా మార్చుకొన్నారు. ప్రతి విమర్శను ఉద్యమ నినాదంగా మార్చుకొని తెలంగాణ ఉద్యమ బాట పట్టారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రతి పౌరుడి చెవిలో ఇల్లు కట్టుకుని మరీ వినిపించారు. రాజకీయంగా కేసీఆర్ను దెబ్బతీయాలని చూసినా ఆయన వెన్ను చూపలేదు. తెలంగాణ వ్యాప్తంగా వందలాది సమావేశాలు, బహిరంగ సభలు, వంటవార్పు, నిరాహారదీక్షలు, రైల్రోకోలు, బందులు ఇలా ఎన్ని పోరాట రూపాలుంటే అన్నిరకాల ప్రయత్నాలు చేసి తెలంగాణ న్యాయమైన డిమాండ్ను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేశారు. చివరికి నిరాహారదీక్షతో చావునోట్లో తలపెట్టి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఉద్యమ సమయంలో ఆయన స్వయంగా చూసిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ,కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, కంటి వెలుగు ఇలా.. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాదరణకు పాత్రుడయ్యారు కేసీఆర్. ప్రాజెక్టుల నిర్మాణం.. బడుగుబలహీన వర్గాలకు కొలువులు.. స్వయంసమృద్ధి పథకాలు.. పారిశ్రామికాభివృద్ధికి తగు ప్రణాళికలు, ఐటీ ఇలా అన్నింటిని అంచెలంచెలుగా సాధిస్తూ సామాజిక తెలంగాణ కలను సాకారం చేస్తున్నారు.
గడచిన ఎనిమిదేండ్ల కాలంలో ఇటు జీవన ప్రమాణాల్లో కానీ, మౌలికసదుపాయాల కల్పనలో కానీ, తలసరి ఆదాయ పెంపులో కానీ తెలంగాణను దేశానికే తలమానికంగా నిలబెట్టారు కేసీఆర్. ఇప్పటివరకు దేశానికి గుజరాత్ రోల్ మాడల్ అంటూ ఊదరగొట్టిన నాయకులకు అసలైన రోల్ మాడల్ ఎలా ఉండాలో తెలంగాణలో చేసి చూపించారు. దేశమంతా తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్ర ప్రగతి చిత్రాన్ని గీసుకునేలా మన రాష్ర్టాన్ని తీర్చిదిద్దారు. రైతుబంధు నుంచి.. రైతులకు మద్దతు ధర దాకా.. ఇప్పుడు చాలా రాష్ర్టాలు తెలంగాణను రోల్ మాడల్గా తీసుకుంటున్నాయి.
ఇలాంటి పాలనే దేశానికీ కావాలని కోరుకుంటున్న దేశ ప్రజల సంఖ్య పెరిగింది. దీనివల్ల కేంద్ర సర్కారు ప్రభ సహజంగానే తగ్గడం మొదలైంది. బీజేపీ సర్కారు మీద విశ్వాసం సన్నగిల్లుతున్నది. అదీకాక కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని విభిన్న రాజకీయ పక్షాలు ఒక్క తాటి మీదకు రావడం, బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టటంతో మోదీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. దీంతో ఈడీ, ఐటీ, సీబీఐ పేర్లతో తప్పుడు కేసులు పెడుతూ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రాజకీయానికి తెరలేపింది. అయినా ఏమాత్రం జంకని కేసీఆర్ దేశ ప్రగతికోసం ముందుకు సాగుతున్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సమర శంఖం పూరించారు కేసీఆర్. ఆయన సమర్థ నాయకత్వానికి దేశమంతా మద్దతు లభిస్తున్నది. రేపటి నవీన భారతాన్ని నిర్మించేందుకు ముందుకు సాగుతున్నారు కేసీఆర్.
( వ్యాసకర్త : మాజీ రాష్ట్రప్రధాన సమాచార కమిషనర్)
-డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
92465 26899