దేశ ప్రధాని మొదలుకొని గ్రామ సర్పంచ్ వరకు తన ముద్ర ఉండాలని కోరుకుంటారు. ఇప్పటివరకు ఈ దేశాన్ని పాలించినవారు, రాష్ర్టాన్ని పాలించినవారు ఎక్కువ మంది దేశంపై, రాష్ట్రంపై తమదైన ముద్ర ఒకటి బలంగా వేశారు. ఆధునిక భారత దేశంపై జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన ముద్ర చెరిగిపోనిది. ఆయన మరణించిన 60 ఏండ్ల తర్వాత, ఇప్పుడు కూడా నెహ్రూ ముద్రను చెరిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఈ దేశంపై నెహ్రూ వేసిన ముద్ర ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
CM Revanth Reddy | బ్రిటిష్ పాలకుల దరిద్రం వదిలిందనుకున్న దేశాన్ని ఆధునిక భారతదేశంగా మార్చడానికి జవహర్లాల్ నెహ్రూ వేసిన బలమైన పునాదులు ఇప్పటి పాలకులను ఇంకా భయపెడుతున్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఒక సభలో మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఒకచోట నెహ్రూ పటం ఉండేది. తాను ప్రధానమంత్రి అయ్యాక ఒకరోజు చూస్తే ఆ పటం లేదు. ఇక్కడ నెహ్రూ పటం ఉండేది, ఏమయ్యిందని అధికారులను అడిగితే, తీసేశామని చెప్పారు. వెంటనే ఆ పటాన్ని అక్కడ మళ్లీ పెట్టండని వాజపేయి ఆదేశించారు. మేరు పర్వతం లాంటి నాయకుల మనస్తత్వం అలా ఉంటుంది. మరుగుజ్జు మనస్తత్వం ఉన్నవారు పేరు చెరిపేయడం ద్వారా తమ ముద్ర వేయాలనుకుంటారు. దేశంలో కాంగ్రెస్ ఓటమిలో, ఢిల్లీలో కాంగ్రెస్కు అడ్రస్ లేకుండా చేయడంలో ఆప్ పార్టీ పాత్ర పెద్దదే. జవహర్లాల్ నెహ్రూ ముందుచూపుతో ఐఐటీలను ఏర్పాటుచేయకపోయి ఉంటే తాను ఎక్కడో పకోడీలు అమ్ముకొంటూ ఉండేవాడినని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే తెలంగాణ ఎలా ఉండాలని పంచాయతీరాజ్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించి అక్కడ తొలిసారిగా మాట్లాడింది నెహ్రూ గురించే. అమెరికాలో పనిచేస్తున్న అధికారిని ఇండియాకు రప్పించి నెహ్రూ పంచాయతీరాజ్ వ్యవస్థను ఎలా బలోపేతం చేశారో వివరించారు. ఈ దేశంలో ప్రజలు, వివిధ పార్టీల నాయకులు నెహ్రూను ఒక పార్టీ నాయకుడిగా చూడరు. ఆధునిక భారత నిర్మాతగా చూస్తారు. హ్రస్వ దృష్టి గలవారు మాత్రమే మేరు పర్వతం లాంటి నాయకత్వాన్ని చూసి సహించలేరు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెహ్రూ ముద్రను చెరిపివేయడానికి దేశ ప్రధాని ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో కేసీఆర్ ముద్రను చెరిపివేస్తానని అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
2014లోనే ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని కంగనా రనౌత్ లాంటి వారు గట్టిగా నమ్మినట్టే గత పాలకుల ముద్రలను చెరిపివేయగలమనుకునే నాయకులు, వారి మాటలు నమ్మేవారుంటారు. కానీ, అది సాధ్యం కాదు. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఐఐటీలు, ప్రభుత్వరంగ సంస్థలు వీటిలో నెహ్రూ ముద్ర ఎప్పుడూ ఉంటుంది. మన రాష్ర్టానికి వస్తే కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ఉద్యమం వల్ల తెలంగాణ సాకారమైంది. తెలంగాణ ఉన్నంత వరకు ఈ ముద్ర ఉంటుంది. మహా టీవీలో ఐ.వెంకట్రావు జరిపిన ఇంటర్వ్యూలో గతంలో స్వయంగా రేవంత్రెడ్డే ఈ విషయం చెప్పారు. వేరే పార్టీ కాబట్టి మేం ఒప్పుకోవద్దు కానీ, కేసీఆర్ మొండి పట్టుదలతోనే తెలంగాణ సాధ్యమైందని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం వల్ల కాదు చంద్రబాబు, తాను జరిపిన ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. చెప్పేవారికి మొహమాటం లేకపోవచ్చు కానీ, నమ్మేవారు ఎవరు?
ఒక రాజకీయ పార్టీ గెలుపోటములకు అనేక కారణాలుంటాయి. కానీ, అధికారంలోకి వచ్చినవారు పాలనలో తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అవుతున్నది. ఇంకా నాలుగున్నరేండ్ల సమయం ఉన్నది. ఆరు నెలలకే అంతా అయిపోయిందని చెప్పడం సరికాదు. అదే సమయంలో కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే తీరు తెలుస్తుందన్నట్టు రేవంత్ రెడ్డి మొదటినుంచీ తిట్లనే తనదైన ముద్రగా చూపుతున్నారు. టీడీపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచే తాను ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిని అవుతానని రేవంత్రెడ్డి చెప్పేవారు. చదువుకునే రోజులనుంచే రేవంత్రెడ్డి ఈ మాట చెప్పేవారని కొందరు చెప్తున్నారు. కానీ, టీడీపీ అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి నేను విన్నాను. సీఎంను అవుతానని చెప్పేవారు కానీ, మీడియాతో మాట్లాడినప్పుడు కానీ, ఇష్టాగోష్టి చర్చల్లో కానీ ఎప్పుడూ తెలంగాణ ఇలా ఉండాలని, నేను సీఎం అయితే ఇలా చేస్తానని కానీ ఎప్పుడూ చెప్పలేదు. తన లక్ష్యం సీఎం కావడం, అది ఎప్పుడూ దాచుకోలేదు పైకే చెప్పారు. కాలం కలిసివచ్చి సీఎం అయ్యారు. ప్రతి సభలో, ప్రతిరోజు తిట్లనే తన ముద్రగా చూపుతున్నారు.
ఇందిరా గాంధీ అంటే ‘గరీబీ హటావో’ అని గుర్తుకువస్తుంది. ఎన్టీఆర్ అంటే రూ.2కే కిలో బియ్యం గుర్తుకువస్తుంది. ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రీ యింబర్స్మెంట్ అంటే వైఎస్సార్ పేరు గుర్తుకువస్తుంది. తెలంగాణ అంటేనే కేసీఆర్ గుర్తుకువస్తారు. ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతుబీమా వంటి ఎన్నో వినూత్న పథకాలపై కేసీఆర్ తన ముద్ర వేశారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ముద్ర అంటూ బలంగా ఏమీ లేదు. అలాంటి ప్రయత్నాలు కూడా కనిపించడం లేదు.
టీఎస్ను టీజీగా మార్చడం, సీఎం నివాసాన్ని డిప్యూటీ సీఎం నివాసంగా మార్చడం అవేమీ ముద్రలనిపించుకోవు. డ్రాయర్లు లాగుతా, చెడ్డీలు లాగుతా, పేగులు మెడలో వేసుకుంటా అనే తిట్ల రూపంలోనే తన ముద్ర గుర్తుండిపోవాలని రేవంత్రెడ్డి కోరుకుంటున్నారా? టీడీపీ నాయకునిగా, పీసీసీ అధ్యక్షునిగా రేవంత్రెడ్డి తిట్ల ద్వారా రాజకీయంగా మంచి ప్రచారం పొంది ఉండవచ్చు, ప్రయోజనం కూడా పొంది ఉండవచ్చు. కానీ, సీఎంగా ఈ తిట్ల వ్యూహం ఎంతవరకు ఆయనకు ఉపయోగపడుతుందనేది కాలమే సమాధానం చెప్తుంది.
రాష్ట్రంపై తనదైన ముద్ర వేయడానికి రేవంత్రెడ్డికి ఒక అవకాశం దొరికింది, తనకు తిట్ల ముద్ర సరిపోతుందనుకుంటున్నారా? పాలనలో ప్రజలకు చిరకాలం గుర్తుండే ముద్ర వేయాలనుకుంటున్నారా అనేది ఆయనే తేల్చుకోవాలి.
-బుద్దా మురళి