‘లోకంలో ఏది నడువాలన్నా.. ముందు భూమిలో రైతు నాగలి నడువాలె. రైతు నాగలి నడిపిస్తేనే మిగతా రంగాలన్నీ ముందుకు నడిచేది.’ మన దేశంలో వ్యవసాయరంగం ప్రధానమైంది. మన సంస్కృతి కూడా భూమి సంస్కృతే. నేటికీ 70 శాతం మంది భారతీయులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
ఈ దేశాన్ని పాలించే ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమానికే అధిక ప్రాధా న్యం ఇవ్వాలి. కానీ, కేంద్రంలోని బీజేపీ సర్కా రు మాత్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ పథకాలతో వ్యవసాయానికి 24 గంటల కరెంటు, సరిపడా సాగునీరును అందిస్తూ రైతు సంక్షేమానికి పాటుపడుతున్నది. ఇందుకుగాను ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు కూడా అందుకున్నది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు. తెలంగాణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే.. హక్కుగా ఇవ్వాల్సిన నిధుల్లోనే కోతలు విధిస్తున్నది. కేంద్ర పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరితే.. పెడచెవిన పెడుతున్నది.
ధాన్యం కొనండి బాబు అంటే.. నూకలు తినమంటూ అవమానిస్తున్నది. రాష్ట్ర సమస్యలను విన్నవించడానికి వెళ్తే.. ‘ఎందుకొచ్చారు? మీకేం పనేమీ లేదా?’ అంటూ సాక్షాత్తూ కేంద్రమంత్రులే ఈసడించుకుంటారు. అవార్డులు, ప్రశంసలతో తెలంగాణను ముంచెత్తినా.. కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా ఇవ్వరు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి, ఉపాధి కల్పనకు చట్టబద్ధంగా అమలుచేయాల్సిన వాటిని పట్టించుకోరు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విన్నవించినా ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా స్వశక్తితో ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానిది ఓర్వలేనితనం. దీంతోనే రాష్ట్ర ప్రయోజనాలకు గండికొడుతున్నది.
రాష్ర్టానికి ఇవ్వవలసిన అభివృద్ధి నిధులు, పథకాలు, ప్రాజెక్టుల మంజూరు సహా అన్ని అంశాల్లోనూ తెలంగాణపై కేంద్రం మొదటినుంచీ అదే వివక్ష చూపుతున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు పెద్దపీట వేస్తూ అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణను విస్మరిస్తుస్తున్నది. ములుగులో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీని ఏపీకి.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని మహారాష్ట్రకు తరలించింది. హైదరాబాద్కు దక్కాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టును గుజరాత్కు తరలించింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వరదలు సంభవించినప్పుడు నిధుల వరద పారించిన కేంద్రం.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలతో అతలాకుతలమైన హైదరాబాద్కు ఒక్క పైసా సాయం చేయలేదు.
హైదరాబాద్లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటుకు పైసా ఇవ్వకపోగా గుజరాత్లో మరో ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటుచేయడం మోదీ సర్కార్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ‘బల్క్ డ్రగ్ పార్క్’ పథకంలో గుజరాత్, హిమాచల్ప్రదేశ్, ఏపీలకు చోటు కల్పించి అన్ని అనుకూలతలున్న హైదరాబాద్కు కేంద్రం మరోసారి వెన్నుపోటు పొడించింది. భారీ లాభాలను గడిస్తున్న సింగరేణికి బొగ్గు గనులను కేటాయించకుండా ఆ సంస్థను ప్రైవేటీకరించేందుకు కుట్రలు పన్నుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి విధానాలు, తాగు, సాగునీరు, పారిశ్రామిక, వ్యవసాయ, ఐటీరంగాల విస్తరణకు రూపొందించిన పాలసీలు యావత్ దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. వీటిపై అనేక రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా తెలంగాణకు వచ్చి అధ్యయనం చేయడంతో పాటు, తమ రాష్ర్టాల్లోనూ అమలుకు పూనుకుంటున్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తదితర పలు పథకాలపై ఢిల్లీ, కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు ఇటీవల ఖమ్మంలో జరిగిన బహిరంగ వేదికపై ప్రశంసించారు.
తమ రాష్ర్టాల్లోనూ ఈ పథకాల అమలుకు శ్రీకారం చుడతామని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంట్లో ప్రస్తావించడంతోపాటు ‘మిషన్ భగీరథ’ లాంటి పథకాలు అద్భుతమంటూ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ కొనియాడారు. కేంద్రమంత్రులు సైతం సందర్భం వచ్చిన ప్రతిసారి తెలంగాణ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించి అనేక అవార్డులను ప్రకటించారు. కానీ, రాష్ర్టాభివృద్ధి కోసం అదనంగా ఒక్క పైసాను విదల్చకపోవడం మోదీ సర్కారు దమననీతికి నిలువెత్తు నిదర్శనం.
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది.
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోనిఅన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది. ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణపై కాగ్, నీతి ఆయోగ్ సహా పలు కేంద్ర సంస్థలు ప్రశంసల వర్షం కురిపించి అదనంగా నిధులు ఇవ్వాలని సిఫారసు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా చట్టబద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లోనూ కోతలు పెడుతున్నది. అక్కడితో ఆగకుండా విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టుల కోసం తెలంగాణకు రుణాలిచ్చిన సంస్థలపై ఒత్తిడి పెంచి రాష్ర్టానికి నిధులు రాకుండా మోకాలడ్డుతున్నది. ఎరువుల కేటాయింపు నుంచి పంటల కొనుగోళ్ల వరకు నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చుతూ తెలంగాణకు అనేక కొర్రీలు పెడుతున్నది.
తెలంగాణ డిమాండ్లను, సమస్యలను ఏ మాత్రం పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వంపైనే అడ్డగోలు విమర్శలకు దిగుతుండటం వారి రెండు నాల్కల ధోరణిని తెలియజేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్పై, రాష్ట్ర మంత్రులపై నిత్యం వ్యక్తిగత విమర్శలకు దిగడం సిగ్గుచేటు. తెలంగాణ హక్కుల గురించి పార్లమెంట్లో గానీ, కేంద్రమంత్రుల వద్ద గానీ ప్రస్తావించిన దాఖలాలే లేవు. రాష్ర్టానికి కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరు చేయించలేకపోవడం వారి చేతగానితనానికి నిదర్శనం. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే వారు ఏ నాటికీ ప్రజల కనీస మద్దతును కూడా పొందలేరనడంలో అతిశయోక్తి లేదు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
పీఎల్ శ్రీనివాస్
73374 01177