క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సహచర శాసనసభ్యున్ని, ఒక లక్ష్యం కోసమే తన పదవులను గడ్డిపోచలాగా త్యజించి, గమ్యాన్ని ముద్దాడేదాకా పద్నాలుగేండ్లు ఏ ప్రలోభాలకు లొంగకుండా శాంతియుత పంథాలో సకల జనులతో ఉద్యమాన్ని నడిపించి, తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడానికి సిద్ధపడిన ఒక ఉద్యమ నేతపై అవమానకర భాష ఉపయోగించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగునో కాదో వారిని ఎన్నుకున్న ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం.
Krishna Water | తెలంగాణ రైతాంగం, ఉద్యమకారులు మరో జల సాధన ఉద్యమానికి సిద్ధం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా 2002 నాటి జలసాధన ఉద్యమ నేపథ్యాన్ని నేటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉన్నది. రెండు దశాబ్దాల కిందట 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు సుమారు ఆరు వారాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కృష్ణా, గోదావరి జలాల్లో మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజా ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి నేటి తరానికి తెలియకపోవచ్చు గానీ, తెలంగాణ ఉద్యమకారులు, ఆనాటి ఉద్యమంలో భాగమైన వివిధ వర్గాల ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఆనాటి ఉద్యమ ముగింపు సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగగా.. తెలంగాణ నలుమూలల నుంచి సుమారు పది లక్షల మంది రైతులు హాజరయ్యారు. మహబూబాముఫ్తీ, రామ్విలాస్ పాశ్వాన్, మేధాపాట్కర్, శిబూసోరెన్, ఎస్.రామదాస్ వంటి ఎందరో జాతీయ నాయకులు ఆ సభలో ప్రసంగించారు.
టీఆర్ఎస్ ఆవిర్భవించి అప్పటికింకా రెండేండ్లు కూడా కాలేదు, అన్ని జిల్లాల్లో సంస్థాగత నిర్మాణమూ జరగలేదు. రాష్ట్రంలో ఏనాడూ, ఏ సభకూ రానంత జనం ఆనాటి పరేడ్ గ్రౌండ్ సభకు కదిలి వచ్చారు. ఆంధ్రా పాలకులు సాగునీటి రంగంలో చూపిన దారుణమైన వివక్ష, పర్యవసానంగా తెలంగాణ జిల్లాల్లో వేలకొద్దీ రైతుల ఆత్మహత్యలు, లక్షలాదిగా వలసపోయిన జనం, నిస్సహాయులైన వృద్ధుల ఆకలిచావులు, నెర్రెలుబారిన పంటపొలాలు, శిథిలమైన సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, అడుగంటిన భూగర్భ జలాలు అందుకు ప్రధాన కారణం. ఈ దుస్థితే టీఆర్ఎస్ ఆవిర్భావానికి ప్రేరణనిచ్చింది.
మలిదశ తెలంగాణ ఉద్యమం రాజుకోవడానికి ఏ పరిస్థితులైతే కారణమో మరోసారి అలాంటి పరిస్థితులే మన రాష్ట్రంలో దాపురిస్తున్నాయి. పరిపక్వత, విషయ పరిజ్ఞానమే లేని పాలకులను, స్వలాభమే తప్ప తెలంగాణ పట్ల ప్రేమ, ప్రజలపై మమకారం మచ్చుకైనా కనిపించని పాలకులను, దురదృష్టవశాత్తూ వారి అబద్ధపు ప్రచారాలను నమ్మి తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు వారిని ఎన్నుకోవడమే దీనికి కారణం. సోషల్మీడియా కేంద్రంగా రేవంత్-సునీల్ కనుగోలు టీం ప్రచారం చేసిన అసత్యాలను తెలంగాణ గ్రామీణ ప్రజలు నమ్మారు కనుక& సాగునీటి రంగానికి సంబంధించిన అంశాలపై అబద్ధాలు చెప్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధపడ్డారు సీఎం రేవంత్రెడ్డి. తెలంగాణ సాగునీటి పాపాల భైరవులెవరో నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. చర్విత చరణమైనా అబద్ధాలను కడిగి పారేయాలంటే ప్రజల కనుసన్నల్లోకి ఇంజెక్ట్ అవుతున్న అసత్యాలను తుడిచేయాలంటే ఎన్నిసార్లు నిజాలను, సత్యాలను రాసినా అది అసందర్భం అనిపించుకోదు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొమ్మిదిన్నరేండ్లు ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా సేవలందించి, అడగకుండానే ప్రజల గోసను తీర్చి, లక్షలాది మంది వలసలను రివర్స్ చేసి, రైతాంగ ఆత్మహత్యలను నివారించి, ఆకలిచావులకు తావులేని తెలంగాణగా తీర్చిదిద్ది, బీళ్లుగా మారిన నేలపై సుజలధారను పరుగులెత్తించి, ఎటుచూసినా పచ్చని పైర్లతో కనువిందు చేసే సస్యశ్యామల తెలంగాణను సృష్టించిన ఒక మహానేతను ఉద్దేశించి ‘రండ’, ‘కేడీ’ వంటి అభ్యంతరకరమైన బూతు పదాలతో సంభోదిస్తూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం ఏవిధంగా సరైనదో తెలంగాణ మేధావులు, సంఘాలు, ప్రజలు చెప్పాలి. ఈ విషయంపై యావత్ తెలంగాణ స్పందించాలి. క్యాబినెట్ ర్యాంక్ ఉన్న సహచర శాసనసభ్యున్ని, ఒక లక్ష్యం కోసమే తన పదవులను గడ్డిపోచలాగా త్యజించి, గమ్యాన్ని ముద్దాడేదాకా పద్నాలుగేండ్లు ఏ ప్రలోభాలకు లొంగకుండా శాంతియుత పంథాలో సకల జనులతో ఉద్యమాన్ని నడిపించి, తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి సిద్ధపడిన ఒక ఉద్యమ నేతపై అవమానకర భాష ఉపయోగించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగునో కాదో వారిని ఎన్నుకున్న ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం.
‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే’ అన్న చందంగా తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర ఈ ‘ముఖ్యమంత్రి’ది. మానుకోటలో తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన నాయకుని కోసం ఉద్యమకారులపై బుల్లెట్ల వర్షం కురిపించిన నేతను నేడు మంత్రిగా ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినా ‘మంద బలం-అధికార బలం’తో పులిచింతల, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటి అక్రమ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ జలాలను ఆంధ్రకు తరలిస్తుంటే అదే క్యాబినెట్లో ఉండి కూడా ఏనాడూ జలదోపిడీని ప్రశ్నించని మరో మంత్రి, ముఖ్యమంత్రికి మరో పక్కన కూర్చోని తాము భాగస్వాములైన ‘నీటి పాపాల’ను కేసీఆర్కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ముఖ్యమంత్రి క్యాబినెట్లోనే మంత్రిగా ఉన్న మరో నేత పోతిరెడ్డిపాడు ద్వారా ‘సీమ’కు తరలించే ప్రాజెక్టులో కెనాల్-లైనింగ్ పనులు చేస్తూ జల దోపిడీకి మార్గం సుగమం చేస్తున్నారు. వీళ్లా తెలంగాణ జలాలపై మన హక్కులను కాపాడేది? ఉద్యమకాలం నాటి ‘ద్రోహులు’ పాలకులైనప్పుడు ఇంతకన్నా భిన్నంగా వారి నుంచి ఏం ఆశించగలం? తుమ్మ విత్తనాలను నాటితే పెరిగిన మొక్కలకు మల్లెపూలు పూస్తాయా? బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఓడించేందుకు వీలుగా తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన ఆంధ్రా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపలేదనే సంగతి తెలిసిందే. మరికొంత వెనక్కివెళితే నేటి ముఖ్యమంత్రి ఎవరి ఆశీస్సులతో తెలుగుదేశం నుంచి బయటికి వచ్చి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారో మనం మరిచిపోరాదు. తెలంగాణ రాష్ట్ర సాధనను వ్యతిరేకించిన, ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని వారే నేటి క్యాబినెట్లో ఎక్కువమంది ఉన్నారు. ఈ పరిస్థితి వల్లే రాష్ట్ర ప్రజలు, తెలంగాణ సాధన కోసం పలు త్యాగాలు చేసిన ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
ఆంధ్రా పాలకుల పన్నాగాలు
మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని కరువు ప్రాంతాల గుండా ప్రవహించే కృష్ణా, భీమా, తుంగభద్రా నదుల జలాల కోసం ఆయా రాష్ర్టాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఆయా రాష్ర్టాల అవసరాలకు తగినంత నీటి లభ్యత కృష్ణా బేసిన్ నదుల్లో లేదు. పశ్చిమ కనుమల్లో కురిసే భారీ వర్షాలపై ఆధారపడి కృష్ణా నది, దాని ఉపనదులైన భీమా, తుంగభద్రా నదుల్లో నీరు లభ్యమవుతున్నది. ఈ నదులు, వాటిలో కలిసే మలప్రభ, ఘటప్రభ, అగ్రణి, మూలముట్టా, దిండి, హాలియా, మూసీ, ఆకేరు వంటి పలు ఉపనదులు, వందలాది వాగులు వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే మొదలై ప్రవహిస్తున్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతంలో 18, 19, 20వ శతాబ్దాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు, కరువుకాటకాలు సంభవించి వేలాది మంది ప్రజలు మరణించారు. వేల సంఖ్యలో పాడిపశువులు మృత్యువాతపడ్డాయి.
తెలంగాణలోని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలతో సహా కృష్ణా బేసిన్ పరీవాహక ప్రాంతంలోని పలు జిల్లాలు దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతాలని 1903లో బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ తన నివేదికలో చెప్పింది. ఆయా ప్రభుత్వాలు తమ ప్రావిన్సులలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి, జల వనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.
ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు, కమిషన్ సిఫారసుల తీవ్రతను సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సంస్థాన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి, అప్పటికే శిథిలమైన చెరువుల పునర్నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆయన మరణానంతరం సంస్థాన బాధ్యతలు చేపట్టిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ కృషిని కొనసాగించారు. అప్పటి చీఫ్ ఇంజినీర్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా ఉన్న నవాబ్ అలీ నవాజ్ జంగ్ చొరవతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంత ప్రావిన్సులైన మద్రాసు (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్), మైసూరు, బొంబాయి ప్రభుత్వాధికారులతో 1928-1944 మధ్యకాలంలో ఎడతెగని చర్చలు జరిపారు. తుంగభద్రా ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని పలు ప్రాజెక్టుల నివేదికలను ఆయన రూపొందించారు.
1949లో ఆయన మరణించేనాటికి, భారతదేశంలో హైదరాబాద్ విలీనమయ్యే నాటికే తుంగభద్రా డ్యాం, రాజోలిబండ వంటి పలు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం మొదలైంది. అలీనవాజ్ జంగ్ రూపొందించి, పరీవాహక రాష్ర్టాల ఆమోదం పొందిన అప్పర్ కృష్ణా (54 టీఎంసీలు), భీమా (100.5 టీఎంసీలు), ఏళేశ్వరం (నందికొండ తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్టు) ప్రాజెక్టులకు 1951 జూలై 27, 28వ తేదీల్లో ప్రణాళికా సంఘం అవసరమైన నీటి కేటాయింపులు చేసింది. హైదరాబాద్ రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు పౌర ప్రభుత్వం (కాంగ్రెస్) నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం వల్ల ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి (రాయలసీమ) వివక్ష కారణంగా మహబూబ్నగర్ జిల్లాలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసే పై మూడు ప్రాజెక్టులు రద్దయ్యాయి. ఏళేశ్వరం వద్ద నిర్మించాల్సిన డ్యాం ఆంధ్ర ఇంజినీర్ కేఎల్ రావు (అప్పటి ప్రణాళికా సంఘం సభ్యుడు) కుట్రలతో దిశ మార్చుకొని నాగార్జునసాగర్గా మారింది. డ్యాం నిర్మాణ స్థలం దిగువకు మారడంతో తెలంగాణకు నష్టం, ఆంధ్రకు లాభం జరిగింది.
పునఃపంపిణీపై కుట్రలు
చరిత్రలో జరిగిన ఈ కుట్రలు దశాబ్దాలుగా పాలమూరు, నల్గొండ జిల్లాల్లో వలసలకు, ఆకలిచావులకు, రైతుల బలవన్మరణాలకు, పేదరికానికి కారణమయ్యాయి. ఈ నీళ్ల పాపాలెవరివో నీటిపారుదల శాఖ మంత్రివర్యులు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అగ్రనేత ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పాలి!
కృష్ణా నది మహాబళేశ్వరంలో ప్రారంభమై కృష్ణా జిల్లాలోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలిసే వరకు దీని పొడవు 1,401 కిలోమీటర్లు. (మహారాష్ట్రలో 306 కి.మీ, కర్ణాటకలో 483 కి.మీ, తెలంగాణలో 416 కి.మీ, ఆంధ్రప్రదేశ్లో 196 కి.మీ.) కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 2,58,948 చదరపు కిలోమీటర్లు. (మహారాష్ట్రలో 69,425 చ.కి.మీ, కర్ణాటకలో 1,13,271 చ.కి.మీ, తెలంగాణలో 50,155 చ.కి.మీ, ఆంధ్రప్రదేశ్లో 26,097 చ.కి.మీ.) పరీవాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం.. నాలుగు రాష్ర్టాల నడుమ కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని, కేసీఆర్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యనే పునఃపంపిణీకి అంగీకరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ సమస్యను జటిలం చేసే కాలయాపనకు కారణమయ్యేలా సీఎం మాటలున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పడి ఇరవై ఏండ్లు దాటింది. మన ముఖ్యమంత్రి ప్రతిపాదనను ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక వ్యతిరేకించాయి. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రతిపాదనను కేంద్ర జల్శక్తి శాఖ, ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. గత్యంతరం లేక, మరింత కాలయాపన జరగడం ఇష్టం లేక నాలుగు రాష్ర్టాలకు బదులు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీకి అనుమతించారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ల నుంచి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా సీఎం రేవంత్రెడ్డి కృష్ణా నీటిని నాలుగు రాష్ర్టాల మధ్య పునఃపంపిణీ చేయాలంటున్నారంటే ఇది కుట్రా, లేక అపరిపక్వతనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.
తెలంగాణకు అన్యాయం చేసిందెవరు?
1969లో కృష్ణా జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 1973లో తొలి నివేదిక 1976లో మలి నివేదిక(స్కీ.బి)ను ట్రిబ్యునల్ కేంద్రానికిచ్చింది. మలి దశ నివేదికలో సూచించిన పంపిణీ పద్ధతి ఆంధ్రా ప్రాంతానికి లాభం చేకూర్చదని భావించి ఉమ్మడి ఏపీ పాలకులు దీన్ని నిరాకరించడంతో 1973లో బచావత్ ఇచ్చిన తీర్పు అమలైంది.
బచావత్ విచారణ సందర్భంగా అప్పటి కృష్ణా బేసిన్లోని 3 రాష్ర్టాలు తమ తమ డిమాండ్లను ట్రిబ్యునల్ ముందుపెట్టగా వారి కోర్కెలు తీర్చేంత నీరు కృష్ణాలో లేదని, 1960 నాటికి సాగవుతున్న భూములకు అవసరమైన నీటి ప్రాతిపదికన (రైపేరియన్ రైట్స్ థియరీ-ఆధారంగా) కృష్ణా జలాల పంపిణీ జరిగింది. 75 శాతం ఆధారపడిన జలాలు కృష్ణా నదీ బేసిన్లో 2060 టీఎంసీలు ఉన్నట్టు లెక్కించారు. రిటర్న్ ఫ్లోస్ (పడువాటి నీరు) 70 టీఎంసీలు కాగా, మొత్తం 2130 టీఎంసీలు. ఈ నీటిని 800+11 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు, 700+34 టీఎంసీలు కర్ణాటకకు, 560+15 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటిలో అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ పాలకుల దుర్మార్గపు కుట్రల వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ 68 శాతం తెలంగాణలోనే ఉన్నా 38.86 శాతం నీరు తెలంగాణకు, 62.14 శాతం నీరు 32 శాతం పరీవాహక ప్రాంతం గల ఆంధ్రాకు దక్కాయి. దీనికి కారణం ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే వాదనలు వినిపించాలనే నిబంధన. తెలంగాణ ప్రాంతం నుంచి ఈ ప్రాంత హక్కుల కోసం, సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతానికి కృష్ణా జలాల్లో జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించే అవకాశం లేకపోయింది.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన అడ్వకేట్ రామచంద్రారెడ్డి ట్రిబ్యునల్ ముందు హాజరయ్యారు. ఫలితంగా తెలంగాణకు ట్రిబ్యునల్ తీర్పులో అన్యాయం జరిగింది. ‘ఆంధ్రా రాష్ట్రంతో కలపడం వల్ల తెలంగాణ కృష్ణా జలాల పంపిణీలో నష్టపోయింది. అందువల్ల తమ చేతిలో మిగిలిన 17.84 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు ఇస్తున్నాం’ అని తీర్పులో పేర్కొన్నది. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా జరిగిన అన్యాయం ఎవరి కుట్ర? ఆనాటి పాలకులెవరో సీఎం చెప్పాలి.
ఇప్పటి తాజా కుట్ర- కేఆర్ఎంబీ&
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం-2014 ఎవరు రూపొందించారో తెలియనంత అమాయకులు కారు తెలంగాణ ప్రజలు. ఈ చట్టం రూపొందించిన అప్పటి కాంగ్రెస్ (యూపీఏ-2) పాలకులు ఆంధ్రా కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. తమ పార్టీ అగ్ర నేతలు చేసిన అన్యాయం గురించి ప్రశ్నించకుండా, పశ్చాత్తాపం ప్రకటించకుండా కేసీఆర్ ఎందుకు సవరణకు పట్టుబట్టలేదని సీఎం రేవంత్రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో అనడం ఆశ్చర్యకరం.
ఫిబ్రవరి 1న జరిగిన కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఔట్లెట్స్ను బోర్డుకు అప్పగిస్తున్నట్టు, కేవలం జల విద్యుత్తు అంశానికి సంబంధించి మాత్రమే ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత అప్పగించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్- ఇన్ చీఫ్ మీడియాకు వెల్లడించారు. వెంటనే మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో ప్రభుత్వం మాట మార్చింది. ప్రాజెక్టుల ఔట్లెట్స్ను అప్పగించలేదని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. మొన్నటి మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ‘సమైక్య రాష్ట్రంలో అరవై ఏండ్లలో తెలంగాణకు జరగనంత నష్టం గత పదేండ్లలో కేసీఆర్ వల్ల జరిగింది. తెలంగాణ సర్వనాశనమైంది’ అని ఆరోపించారు. అబద్ధాలు, అసత్యాలతో, సభ్య సమాజం ఆమోదించని బూతులతో ఈ మీడియా సమావేశం నిర్వహించారు.
సీఎం, మంత్రుల టార్గెట్ ఆంధ్రా నేతలు కాదు, కేసీఆర్ మాత్రమే. కేఆర్ఎంబీ కోరుతున్నట్టు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కల్వకుర్తి, శ్రీశైలం ఎడమ కాల్వ ఇతర ఇన్లెట్, ఔట్లెట్లను అప్పగిస్తే జరిగే నష్టాన్ని నివారించడానికి ప్రతిపక్షాల సహకారాన్ని తీసుకోవడానికి బదులు బట్టకాల్చి మీద వేసిన చందంగా కేసీఆర్ను తిట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించడం వెనుక గల కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలి.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, జల వనరుల అభివృద్ధి సంస్థ)(ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే కలిగే నష్టాలపై రేపటి సంచికలో….)
-వి.ప్రకాశ్
90009 50400