దుమ్మెత్తి పోయడం జర్నలిజం కాదు. కానీ ఈనెల 20న ఆంధ్రజ్యోతి దిన పత్రికలో ‘కొత్త పలుకు’ల్లో తెలంగాణ సీఎం కేసీఆర్పై రాధాకృష్ణ చేసిన ఆరోపణలు దుమ్మెత్తి పోసినట్టే ఉన్నాయి. వాటిలోని నిజా నిజాలను విశ్లేషిస్తే ఇది అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఆయన మాటల్లోనే పరిశీలిద్దాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రులను చూస్తే “దొరలు,పాలెగాళ్లు” గుర్తుకొస్తున్నారని ఆంధ్రజ్యోతి, ఏబీయన్ రాధాకృష్ణ అనడం సరైనదేనా? అలాగైతే రాధాకృష్ణను ‘మీడియా మాఫియా డాన్’ అనకూడదా? రాధాకృష్ణకు సరైన భాషలో సమాధానం చెప్పాలంటే నటుడు, రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళే సరైనవారు. గతంలో రాధాకృష్ణ అసత్యాలకు సరైన సమాధానం వీడియో ద్వారా ఆయనే వెల్లడించారు.
ముఖ్యమంత్రి (దొర) అనుమతి లేకుండా ప్రభుత్వ యంత్రాంగం కదలదు, మెదలదట? అయితే, ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ రథసారథి ముఖ్యమంత్రి (ప్రభుత్వం) మాట వినకుంటే రాధాకృష్ణ ఆజ్ఞలు పాటించాలా?
“స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రజ్యోతి సంస్థలకు కనీసం ఆహ్వానం కూడా పంపకూడదని అధికారులను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తన లేకి బుద్ధిని ప్రదర్శించుకున్నారట!”
– పొద్దున లేస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ,ఆయన కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా టార్గెట్గా చేసుకుని మీ పత్రికలో ఎందుకు అవాకులు, చెవాకులు, అవాస్తవాలు రాస్తున్నారు? 2014కు పూర్వం తెలంగాణా ఏలా ఉంది? 2023లో తెలంగాణ ఏలా ఉందో 9 ఏండ్ల ప్రగతి ఈ ‘పచ్చ మీడియా’కు కనపడటం లేదా? అకారణంగా తెలంగాణ ప్రభుత్వంపై అసత్యాలను రాసే మీ మీడియాను ప్రభుత్వ కార్యక్రమాలకు బొట్టు బెట్టి ఆహ్వానించాలా?
అధికారులు కూడా దొర గడీలోని ‘బానిసలు’గా మారిపోయారు. కేసీఆర్ ఆదేశాలను తలదాలుస్తున్నారు” అని రాధాకృష్ణ అనడం కరెక్టా? ఇది ప్రభుత్వ అధికారులను అవమానించడం కాదా? వారికి రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటించటం వారి విధి. ప్రభుత్వ పాలనలో భాగంగా అధికారులు ప్రభుత్వ విధానాలు అమలు చేస్తారు. ప్రజలు ఎన్నుకున్న సీఎం ఆదేశాలు పాటిస్తారు. అది దొరతనం ఎలా అవుతుంది? ఇది బానిసలు కావడం ఎలా అవుతుంది?బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాలు పాటించలేదా?
ఒకప్పుడు విలేకరుల సమావేశానికి ముఖ్యమంత్రి ఆలస్యంగా వస్తే, సదరు సమావేశాలను విలేకరులు బాయ్కాట్ చేసేవారు.అలాంటిది, ఇప్పుడు పాలకులు మీడియాని నిషేధిస్తున్నారట. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నమస్తే విలేకరిని ప్రెస్మీట్ నుంచి బయటకు వెళ్లమనప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా?
– నిజానికి ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్న దెవరు? ఇప్పుడు మీ సొంత మీడియా నిజాలే రాస్తున్నాయా? ‘పెయిడ్ న్యూస్’ రాయటం లేదా? మీ పేపరు, ఛానల్ తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు ‘కరపత్రం’గా మారలేదా? జగన్ను, కేసీఆర్ను దూషించటం, చంద్రబాబు భజన తప్ప ఆంధ్రజ్యోతికి, మీ ఏబీయన్ చర్చలకు మరో పని ఉందా? ఇతర ప్రజా సమస్యలకు ఎంత సమయం కేటాయిస్తున్నారు? మీ పత్రిక చంద్రబాబు అధికార పత్రికగా చెలామణి కావటం లేదా? ఎల్లో మీడియాగా మీ పత్రిక, ఛానల్ పై ముద్ర పడలేదా?
సోషల్ మీడియా విస్తరించిన ఈ రోజుల్లో ఆంధ్రజ్యోతిపై నిషేధం వల్ల పాలకులకు ఏ ప్రయోజనం ఉండదు.”
-నిజమే మీరన్నది. సోషల్ మీడియా వచ్చాక ‘యెల్లో మీడియా’ వార్తలను ప్రజలు ఎవరూ నమ్మడం లేదు. మార్కెట్లో ఆంధ్రజ్యోతి
దిన పత్రిక అమ్మకాలను ఇప్పుడు పరిశీలిస్తే గతంలో కంటే దారుణంగా పడిపోయాయి.
“చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి మీడియాను వార్తల కవరేజీ కోసం రానివ్వకపోతే జగన్ నానా యాగి చేశారట.”
– అయితే చంద్రబాబు మంచి పని చేశాడని మీరు సర్టిఫికెట్ ఇస్తున్నారా? అప్పుడు బాబు చేస్తే తప్పు కానప్పుడు…ఇప్పుడు అదే పని జగన్, కేసీఆర్ చేస్తే తప్పు ఏలా అవుతుంది? బాబు పత్రికా స్వేచ్ఛను అడ్డు కుంటే మీ ఆంధ్రజ్యోతి ఎందుకు నిరసన తెలపలేదు?
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రొఫెసర్ కోదండరామ్కు ఎక్కడా ప్రవేశం లేకుండా చేశారట.”
-కోదండరామ్ను కేసీఆర్ లొంగ దీసుకోగలిగారా? అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆ అవసరం కేసీఆర్కు ఏముంది? ప్రజలు గత రెండు టర్ములలో కేసీఆర్నూ, కోదండరాంను ఎక్కడ ఉంచాలో అక్కడే తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారు. మూడోసారి కూడా ఆ తీర్పు చెప్పే అవకాశం ప్రజలకు ఉంది. ప్రజలు సమర్ధ నాయకుడిని గుర్తించగలరు. వారి విజ్ఞత వారి కుంది. మీ సలహాలు ఓటర్లకు అక్కర్లేదు.
ఐదేండ్లుగా ప్రభుత్వ ప్రకటనలు నిలిపివేసినంత మాత్రాన ’ఆంధ్రజ్యోతి’ సంస్థలను లొంగదీసుకోగలిగారా? మాకు మనుగడ లేకుండా చేయగలిగారా? అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రజ్యోతికి, ఏబీయన్కు, ఇప్పటి ట్రీట్మెంట్ సరిపోలేదేమో? ఈ ఛాలెంజ్లతో ఏం సాధించు కోవాలను కుంటున్నారు? మీ ఆర్థిక శక్తి, వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. నేతలకు తెలియకుండా ఉంటుందా?
ఇటీవల కన్నుమూసిన గద్దర్ విషయంలో కూడా కేసీఆర్ నిరంకుశంగానే వ్యవహరించారట, గద్దర్కు అవమానం జరిగిందట.”
-మరి చంద్రబాబు గద్దర్ను నెత్తి మీద పెట్టుకొని ఊరేగించారా? ‘గ్రే హాండ్స్’ ను తయారు చేసింది ఎవరు? అప్పుడు చంద్రబాబును ఇదే విధంగా ఎందుకు ప్రశ్నించ లేదు? అసలు గద్దర్ దేహంలో బుల్లెట్లు దింపింది ఎవరు? అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడం అవమానించడమా? చంద్రబాబు వామపక్ష ఉద్యమాలకు చేసిన ద్రోహం, నిర్భంధాలు, ఉద్యమకారులపై జరిపిన కాల్పులు మీకు కనపడలేదా? వారి ఆర్తనాదాలు మీకు వినపడలేదా?
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్ మద్దతు కోసం కేసీఆర్ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్ ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ “తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితులో ఉన్నానని, దీక్ష విరమించాలని గద్దర్ వంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని” రాధాకృష్ణను స్వయంగా కోరారట. మరుసటి రోజు రాధాకృష్ణ గద్దర్తో మాట్లాడి నచ్చ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దీక్ష విరమింపజేయాలని కోరడానికి ఆయన అంగీకరించాడట. విలేకరుల సమావేశానికి ఏర్పాట్లు కూడా జరిగాయట. ఇంతలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం నుంచి తెలంగాణకు సానుకూలంగా సంకేతాలు వచ్చాయట. కేసీఆర్ బిగుసుకు పోయారట. కేసీఆర్తో దీక్ష విరమింపజేయాలని కోరడానికి టీఆర్ఎస్ నుంచి గద్దర్ వద్దకు ఎవరూ రాయబారం వెళ్లలేదట. దీంతో ‘చూశావా రాధన్నా.. కేసీఆర్ ఎలాంటోడో !’ అని రాధాకృష్ణతో గద్దర్ వాపోయారట.’
– అసలు ఇలాంటి మాటలు కేసీఆర్ లేదా గద్దర్ మాట్లాడారు అంటే ఎవరైనా నమ్ముతారా? దీక్ష విరమించమని డా.జయశంకర్, తన కుటుంబ సభ్యులు బతిమిలాడినా కేసీఆర్ వారి మాటలు వినలేదు. “తెలంగాణ వచ్చుడో…కేసీఆర్ చచ్చుడో” జరగాలని ఆయన చేసిన ప్రతిజ్ఞను రాధాకృష్ణ వక్రీకరించటం సరైంది కాదు. పైగా గద్దర్ ఇలాంటి మాటలు తాను బతికి ఉండగా ఎప్పుడూ, ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా ప్రకటించ లేదు. ఈ రాధాకృష్ణకు మాత్రమే గద్దర్ చెవిలో రహస్యంగా చెప్పారా? ఆధారాలు ఉన్నాయా?
తెలంగాణ వచ్చాక గద్దర్ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పుడు, ఎక్కడా ఈ మాట చెప్పలేదు. చనిపోయిన వాళ్ల నోట్లో ఏ మాటలైనా దూర్చవచ్చు. సాక్ష్యాలకు వారు రారని మీరు అనుకుంటున్నారా? ఇంత చీప్ పాపులారిటీ కోసం రాధాకృష్ణ పాకులాడటం అవసరమా?
“కేసీఆర్కు, జగన్ రెడ్డికి మధ్యన ఒక తేడా మాత్రం ఉందట. గిట్టని మీడియాను మినహాయిస్తే ప్రతిపక్షాలకు చెందిన వ్యాపారాలు, పరిశ్రమలను కేసీఆర్ టార్గెట్ చేసుకుని వేధించడం లేదట. అలాంటి చర్యల వల్ల తెలంగాణలో పెట్టుబడులపై ప్రభావం పడుతుందని కేసీఆర్కి తెలుసుట.”
– ఈ రాధాకృష్ణ ఇచ్చే కాండక్ట్ సర్టిఫికెట్ కేసీఆర్కు అవసరమా? నిజానికి కేసీఆర్ క్షమా గుణం కలవారు. ఆయనకే ఇలాంటి కక్షపూరిత బుద్ధి ఉంటే, రాధాకృష్ణ వంటి వారిని పాతాళానికి తొక్కగల శక్తివంతుడు. కానీ, తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిన ఘనత కేసీఆర్దే. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎంత ఆవేశంగా ఎన్ని మాట్లాడినా రాష్ట్రం వచ్చాక ఆంధ్రా వారికి కించిత్తు ఆపద కలిగించ లేదు. పైగా వారి ఎదుగుదలకు ప్రోత్సాహకాలు అందించారు. అన్ని కులాలను, మతాలను బడుగు, బలహీన వర్గాలను, మైనారిటీలను సమ భావంతో చూశారు. 9 ఏండ్లలో ఏన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ అమలు చేశారు. నేటి తెలంగాణలో అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ సమర్ధ పాలనే గీటు రాయి. శత్రువులు కూడా నేటి తెలంగాణను చూసి మనసులోనైనా కేసీఆర్ను అభినందిస్తారు.
ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రేవంత్ రెడ్డి మొదలైన వారు ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది వస్తే అది తమ స్థాయికి మించి మాట్లాడినా, వ్యక్తిగత దూషణలు చేసినా, అనవసరంగా కేసీఆర్ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగి అవమానించినా, దూషించినా వారిని పెద్ద మనసుతో కేసీఆర్ క్షమించారు. ఆయన ఏదీ మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన చరిత్రకు కళంకం తెచ్చే ఇలాంటి అసత్యాలు మాట్లాడితే..అది జర్నలిజానికే అవమానం. రాధాకృష్ణ అనే వ్యక్తి జర్నలిజం వృత్తికే కళంకం.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496