2004 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు 2009లో ఎట్లానైనా గెలిచి తీరాలని ఓటర్లకు ఉచితాల హామీలు ఎడాపెడా గుప్పించడం మొదలుపెట్టారు. దానిపై రాజశేఖరరెడ్డి తన బహిరంగ సభల్లో ‘ఆల్ ఫ్రీ బాబు అన్నీ ఫ్రీగా ఇస్తాడట..నమ్ముతారా’ అని ప్రజలకు సూటి ప్రశ్న వేసేవారు. ‘నమ్మం’ అంటూ ప్రజలు కేకలు వేసేవారు. ఆ రెండవసారి రాజశేఖర రెడ్డి కొత్త హామీలేవీ ఇవ్వలేదు. అయినా ఆల్ ఫ్రీ బాబు ఓడిపోయారు. ప్రశ్న- ఒకవైపు వంచనా పూరితమైన హామీలది కాగా, మరొకవైపు విశ్వసనీయతది. గత ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సభలో ఓటర్లకు ఇచ్చిన హామీలు ఆల్ ఫ్రీ బాబును గుర్తు చేస్తున్నాయి.
కాంగ్రెస్ హామీలు వినేందుకు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆర్థికంగా చూసినపుడు ఆచరణలో అంత అసాధ్యమని, కొద్దిగానైనా ఆలోచించగలవారికి ఆదివారం రాత్రికే అర్థమైంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సాధారణ ప్రజలు కూడా వాస్తవ స్థితిని గ్రహించి, “ఇవన్నీ ఓట్ల కోసం చెప్పే దొంగ మాటలే తప్ప అయ్యేది కాదు పొయ్యేది కాదు” అనటం మొదలుపెట్టారు. ఈ సందర్భంలో మరొక రెండు ఉదాహరణలు గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామంటే కాంగ్రెస్ రెండు లక్షలన్నది. కానీ గెలవలేదు. ఇంకొంత వెనుకకు పోతే, ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం అనగా విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం రూ1.90 కిలో అని ప్రకటించింది. అయినా ఓడిపోయింది.
ఈ మూడింటి నుంచి తేలేది ఏమిటి? ప్రజలు ఆకర్షణీయమైన హామీలను గంతలుగా మార్చి తమ కళ్లకు కట్టుకుని గుడ్డిగా ఓటు వేయరు. అదే జరిగితే విజయభాస్కరరెడ్డి, చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ‘గ్యారంటీ’గా గెలిచి ఉండేవారు.
కాంగ్రెస్ నాయకులు తెలివి కలవారు, అనుభవజ్ఞులే. తమ హామీలు అమలుకు సాధ్యం కానివని వారికి తెలిసే ఉండాలి. అయినా ఎందుకిచ్చారంటే 2014, 2018లో వరుసగా రెండుసార్లు చిత్తుగా ఓడిన తాము ఈ సారైనా గెలవకపోతే ప్రాణాలు నిలవని పరిస్థితి ఏర్పడింది.
ఈ ఉపోద్ఘాతాన్ని వదలి కొద్దిగా వివరాల్లోకి వెళదాము. మొదట రైతు భరోసాను చూస్తే, రైతులకు కేసీఆర్ ఇస్తున్న ఎకరానికి ఏడాదికి రూ.10 వేలను రూ.15 వేలకు పెంచుతామని, కొత్తగా కౌలు రైతులకు కూడా ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2020-21లో ప్రభుత్వం రైతుబంధు కింద రూ. 14,656 కోట్లు ఖర్చు చేసింది. ఆ మొత్తాన్ని కాంగ్రెస్ 50 శాతం మేర పెంచితే రూ. 21,984 కోట్లు అవుతుంది. ఇదిగాక కౌలు రైతులకు కూడా ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ ఈ ఏడాది మార్చిలో మొత్తం కౌలు రైతులు 15 లక్షలని అన్నారు. ఆ ప్రకారం చూసినా ఈ వర్గానికి ఇవ్వాల్సింది రూ.1800 కోట్లు అవుతుంది. ఇదికాక వ్యవసాయ కూలీలకు రూ.12 వేలన్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు 59.15 లక్షలు. రైతుల సంఖ్య 58.33 లక్షలు. ఈ లెక్క ప్రకారం వారికి ఇవ్వవలసింది రూ.7098 కోట్లు. ఆ విధంగా ఈ మొత్తం పద్దు ప్రస్తుతపు రూ.14,656 కోట్ల నుంచి ఒకేసారి రూ.29,262 కోట్లకు పెరుగుతుంది.
ఇందులోనూ కొన్ని చిక్కు ప్రశ్నలున్నాయి. ఒకటి, రాముడు అనే రైతునుంచి కృష్ణుడు అనే కౌలు రైతు ఒక ఎకరం కౌలుకు తీసుకుంటే ఇద్దరికి కలిపి రూ.30 వేలు ఇవ్వాలి. అనగా, ప్రస్తుతపు రూ.10 వేల నుంచి ఖర్చు ఒకేసారి మూడు రెట్లు పెరుగుతుంది. ఇందుకు డబ్బు ఉంటుందా? రెండు, ఈ పద్ధతి అమలుకు వస్తే ప్రస్తుతం స్వయంగా సాగు చేసుకుంటున్న రైతులు బినామీ కౌలుదార్లను సృష్టించి, ఆ అదనపు డబ్బును ఇద్దరూ పంచుకోగలరు. భూమి సీలింగ్ చట్టాలు అమలుకు వచ్చినప్పుడు బినామీ పట్టాదార్లు పుట్టుకు వచ్చినట్లన్న మాట. మూడు, రైతులు కొంత భూమి తాము సాగు చేస్తూ కొంత కౌలుకు ఇచ్చే సందర్భాల్లో అసలు మొత్తం భూమిని కౌలుకు ఇచ్చివేసే కొత్త పద్ధతి ఒక మేరకైనా రావచ్చు. ఇక మౌలికంగా అసలు కౌలు రైతులను గుర్తించి రిజిస్టర్ చేయటం తేలిక కాదు.
పైగా వారి సంఖ్య, గుర్తింపులు పంట పంటకూ కొంత మారుతుంటాయి. ఇన్ని మెలికలున్న వ్యవహారంలో అవినీతికి ఉండే ఆస్కారం గురించి ఎవరైనా ఊహించవచ్చు. వ్యవసాయ కూలీల విషయానికి వస్తే, ప్రభుత్వ సర్వే ప్రకారం కూలీల ప్రస్తుత సంఖ్య ఎంతో పైన చూశాము. ఒకవేళ రూ.12 వేల పథకం అమలుకు వస్తే, గత కొంత కాలంగా ఈ పనులు వదిలి ఇతర పనులకు మళ్లినవారు, ఒక ఇంట్లో వివిధ కారణాల వల్ల కూలి పని మానివేసినవారు లేదా చేయనివారు ఇపుడు కొత్తగా కూలీలమని పేర్లు రిజిస్టర్ చేసుకోగలరు. చాలా అవినీతి జరుగుతుంది. ఈ విధంగా తడిసి మోపెడయ్యే ఈ లెక్కల పద్దును రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భరించగలదా? ఇదిగాక క్వింటాలు వరికి రూ.500 చొప్పున మూడు కోట్ల టన్నులకు బోనస్ హామీ ఉన్నది. కాంగ్రెస్ వారు ఎట్లాగైనా అధికారం సంపాదించాలని ఇట్లా చేయ తగునా?
మహిళలకు ప్రతి నెల రూ. 2500 నగదు అందజేస్తామన్నారు. తెలంగాణలో సుమారు రెండు కోట్ల మంది మహిళలున్నారు. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.30 వేలు అవుతాయి. రెండు కోట్ల మందికి కలిపి రూ.60 వేల కోట్లవుతాయి. సిలిండర్ల ఖర్చు ఉండనే ఉంది. ఉచిత బస్ ప్రయాణమూ ఉంది. ఇదంతా ఊహించేందుకే తల తిరుగుతుంది. మరొకటి ఇల్లు లేని తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం. తెలంగాణ జనాభా 4 కోట్లలో ఏదో ఒక రూపంలో ఉద్యమం చేసినవారు ఎందరో ఎవరైనా లెక్క తేల్చగలరా? ఒక్క హైదరాబాద్లో ఉద్యమకారులు అధమ పక్షం లక్ష మంది అనుకున్నా వారికి 250 గజాల చొప్పున ఇవ్యాలంటే 5,165 ఎకరాలు అవసరమవుతుంది. ఇదే విధంగా ఆసరా పెన్షన్ల మొత్తం ప్రస్తుతపు రూ.44 వేల కోట్ల నుంచి రూ.90 వేల కోట్లకు చేరుతుంది.
ఇంగ్లీషులో చెప్పాలంటే ఇదంతా షీర్ మ్యాడ్నెస్. ఇవే కాదు ఇంతకు ముందు ప్రకటించిన దళిత డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ వగైరాలు, వాటి సాధ్యాసాధ్యాలు, రాష్ట్ర బడ్జెట్, ఆదాయ వ్యయాలు, ఇతరత్రా చేయవలసిన అభివృద్ధి పనులు, సిబ్బంది జీతభత్యాల ఖర్చు, ఇప్పటికే అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు వగైరాలన్నీ ప్రజల మధ్య చర్చకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో ఏమి చేశాయి, తాము ప్రస్తుతం అధికారంలో గల చోట్ల ఏమి చేస్తామని హామీ ఇచ్చి చేస్తున్నదేమిటి, చేయనిదేమిటి వంటివన్నీ కూడా చర్చలలో నిగ్గు తేలుతాయి. సంతోషించదగినదేమంటే ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ప్రజలు విషయాలను అర్థం చేసుకునేందుకు ఇది చాలు.
తెలంగాణ ప్రజలను చరిత్ర, స్వానుభవాలు ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. కనుక, కాంగ్రెస్ పార్టీ తమ హామీలన్నింటికీ కలిపి అయ్యే ఖర్చెంత, ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు కలిపి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తాయనే లెక్కలు వివరంగా ప్రకటించడం అవసరం. లేనట్లయితే వారిని ప్రజలు నమ్మలేరు.
ఇందుకు భిన్నంగా, కేసీఆర్ది చేతల ప్రభుత్వమని రుజువవుతూనే ఉన్నది. ఈ నెల 15న ఒకేసారి 9 మెడికల్ కాలేజీల ప్రారంభం, 16 నాడు 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని, 1226 గ్రామాలకు మంచి నీటిని ఇచ్చే పాలమూరు-రంగారెడ్డి పథకం ప్రారంభం. మరో విడతగా 21న 11,700 డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరగనుండటం, వచ్చే దసరా నుంచి ఒకటి నుంచి పదో తరగతి వరకు 23 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహార పథకం ప్రకటన కనిపిస్తూనే ఉన్నాయి.
-టంకశాల అశోక్