భద్రలోక్ మేధావులు ఇప్పటికీ గ్రహించని విషయం ఒకటున్నది. దేశానికి కావలసింది కేవలం అధికార మార్పిడులు కాదు. దేశం దిశను మార్చగల అజెండా మార్పిడులు అవసరం. కేవలం అధికార మార్పిడులు గతంలో పలుమార్లు జరిగాయి. కాని దేశం మారలేదు. ఇది ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా, సామాన్యులకు సైతం అర్థమైనా, వీరు బీజేపీ నుంచి అధికార మార్పిడి జరిగితే చాలుననే భ్రమల్లో చిక్కుకోవటం ఆశ్చర్యకరం. పోనీ కేసీఆర్ ప్రతిపాదించే మార్గం కాదనుకుంటే తామైనా సమగ్రమైన ప్రత్యామ్నాయ అజెండాతో ప్రజల ముందుకురావాలి.
భద్రలోక్ మేధావుల్లో వేర్వేరు విధాలైన వారున్నారు. ఆదర్శవాదులు, ఉదారవాదులు, ప్రజాస్వామికవాదులు, పౌరహక్కులవాదులు, రకరకాల మాజీ ఉద్యమకారులు, ఇప్పటికీ ఉద్యమకారులమనుకునేవారు, వామపక్ష ఛాయలు ఎంతో కొంత ఉన్నవారు, వేర్వేరు సిద్ధాంతాల వారు, నిజ జీవితంలో ఎట్లున్నా పైకి నటనలు చేసేవారు, నలుగురికీ బోధనలు చేస్తూ తమ గౌరవాన్ని కాపాడుకునేవారు, సెమినార్లకూ వర్క్షాప్లకు మించనివారు, మీడియాలో పేరు చూసుకొని ఆనందించేవారు, రోజూ ఎవరో ఒకరిపై రాళ్లు విసరటమే తమ నిబద్ధతలకు గీటురాయి అనుకునేవారు- ఇట్లా ఇంకా అనేక విధాలైన వారున్నారు. ఇందులో దేనినీ, ఎవరినీ అభ్యంతరపెట్టడం లేదు. ఒక వ్యవస్థలో, అందులోనూ చైతన్యశీలమైన తెలంగాణ వంటి సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఇదంతా సహజం. ఈ మథనం, కార్యకలాపాలన్నీ ఆ సమాజం సజీవంగా ఉన్నదనేందుకు సంకేతం. పైగా ఈ భద్రలోక్ మేధావుల వైపు చూసే సామాన్య జీవులను పక్కన ఉంచితే, యథాతథంగా ఈ మేధావులంతా ఆర్థికపరమైన నిత్య జీవిత సమస్యలు ఏమీ లేక, కడుపులో చల్ల కదలకుండా భద్రంగా జీవించేవారే. అటువంటి వారి వ్యవహరణ ఈ విధంగానే ఉంటుంది.
అట్లాగని భద్రలోక్ మేధావి తరగతికి సమాజం పట్ల, సామాన్యుల పట్ల ప్రేమ, వారి సమస్యల పట్ల ఆందోళన ఉండవని ఎంతమాత్రం కాదు. కాకపోతే ఆ సామాన్యుల ఆలోచనలతో, వారి జీవిత వాస్తవాలతో సంబంధం లేకుండా కృత్రిమంగా వ్యవహరిస్తుంటారు. అన్ని విషయాలను తమ ఆలోచనల కొలబద్దలతోనే లెక్కిస్తారు. సామాన్యులు కూడా తమ వలెనే ఆలోచిస్తారని నమ్ముతారు. వారి ఆలోచనలు తమకన్నా భిన్నంగా ఉన్నట్లు ఎపుడైనా కాస్త దృష్టికి వచ్చినా లెక్కచేయక తోసివేస్తారు. ఇది ఏదీ నిజానికి మేధావుల లక్షణం కాకూడదు. అది భద్రలోక్ మేధావుల లక్షణం. ఎందుకంటే వారు తాము గజదంత గోపురాల్లో (ఐవరీ టవర్స్) సామాన్యులతో సంబంధం లేని ఒంటరిలోకంలో జీవిస్తుంటారు.
సమస్య ఎక్కడ వస్తున్నది? సాధారణంగా పట్టణ వాసులైన ఈ భద్రలోక్ మేధావులు గ్రామాలకు వెళ్లరు. అక్కడి వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడరు. ఓపెన్ మైండ్తో అంతకన్నా ఉండరు. గ్రామాలకు వెళ్లలేకపోతే కనీసం పట్టణాల్లో తమ చుట్టూ కనిపించే సామాన్యులతోనైనా విషయాలు మాట్లాడరు. ఆ ప్రజల్లో స్వతహాగా పట్టణవాసులైన వారితోపాటు తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి రకరకాల పనులు చేసుకునే వారుంటారు. వారికి తమ తమ గ్రామాల్లోని తమ కుటుంబాలతో, బంధుమిత్రులతో సెల్ఫోన్ల ద్వారా నిత్య సంబంధాలుంటాయి. వీరు అటు, వారు ఇటు తరచూ వచ్చిపోతుంటారు. కనుక ఈ భద్రలోక్ మేధావులు ఓపెన్ మైండ్తో గ్రామాలకు వెళ్తుండినా లేక పట్టణాలలోని సామాన్యులతో మాట్లాడుతుండినా, ఇంకా వీలైతే రెండు పనులూ చేస్తుండినా వాస్తవాలు ఏమిటో తెలుస్తాయి. అవి కొన్ని విషయాలలో తాము ఆలోచిస్తున్నట్లే ఉండవచ్చు. కొన్ని విషయాలలో అంతకు భిన్నంగా ఉండవచ్చు. అట్లాగే సమస్యలకు కారణాలపై గాని, వాటికి పరిష్కారాలపై గాని తమ గజదంత గోపుర ఆలోచనలు, సామాన్యుల క్షేత్రస్థాయి ఆలోచనలు వేర్వేరు కావచ్చు. అదేవిధంగా గత తొమ్మిదేండ్ల పాలనలో మంచి కూడా ఏమైనా జరుగుతున్నదా లేక భద్రలోక్ మేధావులు ప్రతిదానికీ రాళ్లు విసురుతూ వాదిస్తున్నట్లు అంతా చెడేనా అనే ప్రశ్నపైనా అవి వేర్వేరు కావచ్చు.
ఇటువంటిదేమీ చేయటం లేదు గనుకనే వీరిని భద్రలోక్ మేధావులని, గజదంత గోపురవాసులని అనవలసి వస్తున్నది. రాష్ట్రంలో వామపక్ష భావజాలం, వివిధ ఉద్యమాలు బలంగా ఉన్నంతకాలం ఇటువంటి వారి సంఖ్య స్వల్పంగా ఉండేది. ఆ ఉద్యమాలు బలహీన పడినా కొద్దీ వీరికి ఒక ప్రత్యామ్నాయం లేక, స్వయంగా తాము కూడా ఏదీ ప్రతిపాదించలేక, అయినప్పటికీ తమ మేధో పాతివత్య్రాన్ని అభ్యుదయశీలతను కాపాడుకోవాలి గనుక, వారిలో భద్రలోక్ ఆలోచనా ధోరణులు పెరుగుతూ వస్తున్నాయి. కాస్త కటువుగా చెప్పాలంటే ఇదొక దివాళా ధోరణి. అయినా క్షేత్రస్థాయిలోని చెడును గుర్తిస్తూ మంచి పట్ల మాత్రం కళ్లు మూసుకునేవారు మేధావులు ఎట్లా అవుతారసలు? సినిక్స్ అవుతారు.
బీజేపీ పరిపాలన స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేనంత భయంకరంగా మారుతున్నదనేది నిజం. ఆ పరిపాలన పోవాలనేది నిర్వివాదం. అదే సమయంలో విచారకరమైన స్థితి ఏమంటే, అందుకు తగిన ప్రత్యామ్నాయం ఏమిటో భద్రలోక్ మేధావులు చెప్పటం లేదు. గతంలో పలుమార్లు ఏర్పడి, ప్రతిసారీ విఫలమై, అదే బీజేపీకి మళ్లీ మళ్లీ అవకాశమిచ్చిన సోకాల్డ్ ప్రత్యామ్నాయాల గురించే వారు మరొకసారి కలలు కంటున్నారు. గతంలో అన్నీ అధికార ప్రత్యామ్నాయాలే తప్ప అజెండా ప్రత్యామ్నాయాలు కాలేదన్నది వారికి తెలియదా? వారు కనీసం ప్రస్తుత విపత్కర స్థితిలో ఇది, దీర్ఘకాలికంగా అది అనే పద్ధతిలో సమాంతరపు ప్రత్యామ్నాయాల గురించి అయినా ఆలోచించటం లేదు.గమనించవలసిన విశేషం ఏమంటే, ఈ మేధావులతో అగాధం ఏర్పడిన సామాన్యుల్లో భిన్నమైన రీతిలో, కేవలం అధికార ప్రత్యామ్నాయాల కోసం గాక, అజెండా ప్రత్యామ్నాయాల కోసం ఆలోచించటం మొదలైనట్లు కనిపిస్తున్నది. అందుకు ఇదింకా ఆరంభ దశ మాత్రమే కావచ్చు. కాని అది ఆలోచనాపరులు ఆహ్వానించవలసిన కొత్త దశ. భద్రలోక్ మేధావులకు ఒక సూచన.
-టంకశాల అశోక్