2014లో భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ప్రత్యేకించి ఇంధన ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూ వచ్చాయి. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో మాత్రం తన రాజకీయ అవసరాల కోసం ఇంధన ధరలను పెంచుకుంటూ, తగ్గించుకుంటూ చమురు ధరలను ఫక్తు రాజకీయ ప్రక్రియగా మార్చింది.
ఇంధన ధరలు పెంచడం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, రవాణా, ప్యాకేజింగ్ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. ఈ ఏడాది జూలై నెలలో నిత్యావసరాల ధరలు 15 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. వీటికి ప్రధాన కారణం ఇంధన ధరలు నిరంతరం పెంచుకుంటూ పోవటమే. దేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సరాసరి తీసుకుంటే దేశంలో 75 శాతం ప్రజలు ఎల్పీజీ ఉపయోగిస్తున్నారు. దేశంలో ఎల్పీజీ ఉపయోగించాలని ఒకపక్క ప్రోత్సహిస్తూ, మరోపక్క ఉజ్వల లాంటి పథకాలు తీసుకువస్తూ దాని ధరను మాత్రం రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నది. మన దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధర ప్రపంచంలోనే అత్యధికం. ద్రవ్యోల్బణం పెరుగకుండా, ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా ఉండాలంటే చమురు ధరలు తగ్గించాలని ఆర్బీఐ సూచించినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు.
ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్స్లో కొలుస్తారు. ఒక బ్యారెల్ అంటే సుమారు 159 లీటర్లు. మన దేశం దాదాపు 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో అత్యధికంగా ముడిచమురు దిగుమతి చేసుకునే దేశాలలో మనది 3వ స్థానం. ముడి చమురుతో మన రిఫైనరీస్లో పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. కనుక ఇంధన ధరలు డాలర్ ధర ఆధారంగా పెరగటం కానీ, తగ్గడం కానీ జరగాలి. 2013 వరకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే ధరల పెరుగుదల ఉండేది. కానీ 2014 తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి దేశంలో పెట్రోల్ ధర రూ.77, డీజిల్ ధర రూ.68. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 105 డాలర్లు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పెట్రోల్ ధర రూ.110, డీజిల్ ధర రూ.110. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే ఇప్పుడు బ్యారెల్ ధర 80 డాలర్లు మాత్రమే. ఇదే కాకుండా గ్యాస్ సిలిండర్ ధర రూ.400 నుంచి రూ.1000 కి చేరింది.
ప్రపంచ మార్కెట్లో ఒక పక్క బ్యారెల్ ధర రోజురోజుకు తగ్గుతున్నా, కేంద్రం చమురు ధరలు మాత్రం పెంచుకుంటూ పోతున్నది. 2016లో ఒక దశలో 26 డాలర్లకు పడిపోయినా బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలపై కనికరం కలగలేదు. పెట్రోల్, డీజిల్ ధరలు ఏ
మాత్రం తగ్గంచలేదు. చాలాకాలం పాటు బ్యారల్ ధర 40, 50 డాలర్ల మధ్య కొనసాగింది. కానీ ఆ కాలంలో కూడా డీజిల్, ఇంధన ధరలలో తగ్గుదల కనిపించలేదు. మన దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా పెట్రోల్, డీజిల్ కొంటున్న నేపాల్లో కూడా మన కంటే తక్కువ ధర ఉన్నది.
2013 కంటే ముందు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల నియంత్రణ కొనసాగేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల జీవితాల్లో అత్యంత ముఖ్యమైన ఇంధన ధరలను కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే పెంచుకుంటూ, తగ్గించుకుంటూ దీన్ని ఫక్తు రాజకీయ ప్రక్రియగా మార్చింది. కరోనా కారణంగా ఉద్యోగాలు పోయి జీవితాలు ఛిద్రమై కొన్ని కోట్ల మంది రోడ్డున పడ్డా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలను తగ్గించలేదు. పైగా ఉచిత వ్యాక్సిన్, గ్రామీణ ఉపాధి కోసం నిధులు కావాలని చెప్పింది. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర అతి తక్కువగా ఉన్నది. అయినప్పటికీ ఈ దేశ ప్రజలు ఆ ప్రయోజనాన్ని పొందలేకపోయారు.
కానీ హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత 2022లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు ఛీ కొడతారని భయపడి ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ముందు పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 తగ్గించింది. తర్వాత 137 రోజులు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు ఒక్క పైసా పెంచలేదు. ఇందులో ఓట్ల కోసం కాకపోతే దేశ ప్రజలపై ప్రేమ, దేశభక్తి ఎక్కడ కనిపిస్తుందో బీజేపీ నాయకత్వం చెప్పాలి. మోదీ ప్రధాని అయిన తర్వాత 10 రక్షాబంధన్లు వచ్చాయి. ఏ రక్షాబంధన్కు దేశ మహిళలకు కానుక ఇవ్వలేదు. కానీ కర్ణాటక ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న తర్వాత రానున్న 5 రాష్ట్రాల్లో (తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, మిజోరాం) అధికారం దక్కడం అసాధ్యమని తెలిసి దేశ ప్రజలకు రక్షాబంధన్ కానుకగా మోదీ సిలిండర్పై రూ. 200 తగ్గించాడు. ఇదే సందర్భంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచిన రూ.800 గురించి దేశ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం మోదీపై ఉన్నది.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిరకాల ఇంధనాలపై 300 శాతానికి పైగా ట్యాక్స్లు పెంచడం జరిగింది. రాష్ట్రాలు పెద్దగా ట్యాక్స్లు పెంచలేదు. ఉదాహరణకు తెలంగాణ రాష్ర్టం గడిచిన పదేండ్లలో పెట్రోల్, డీజిల్పై ఒక రూపాయి కూడా ట్యాక్స్ పెంచలేదు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి కనీస జ్ఞానం లేకుండా ఇక్కడి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్రానికి అనేక ఆదాయ వనరులుంటాయి. అంటే జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ర్ట ప్రభుత్వాలకు తమంతట తాము ఆదాయ వనరులు సేకరించే అవకాశం లేకుండా పోయింది. పెట్రోల్, డీజిల్పై వచ్చే ట్యాక్స్ మాత్రమే ప్రధానమైనది. దీన్ని కేంద్రం ఆలోచించాలి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎక్సైజ్ ట్యాక్స్ పెంచితే రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్ల రూపంలో పెంచుకుంటూ రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరు ద్ధం. కేంద్రం చమురు విషయంలో రాష్ర్టాలతో ఏ విధమైన చర్చలు జరుపకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్తో సంబంధం లేకుండా ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయాల్లో ఎందుకు ధరలు తగ్గుతాయో ఆలోచించి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలి.
-రాగి శ్రీనివాస్రెడ్డి
99850 98432