స్వాతంత్య్రానంతరం దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్ష, తెలంగాణ ప్రజలు చూపించిన తెగువ, విద్యార్థుల ఆత్మబలిదానాలు వెరిసి ఇవ్వాళ తెలంగాణ ప్రజల కండ్లల్లో ఆనందం విరబూసింది. తెలంగాణ అవతరణ తర్వాత దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రగతిలో ముందుకు దూసుకుపోతున్నది. రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. అలాంటి తెలంగాణలోని ఓరుగల్లుకు వస్తున్న ప్రధాని మోదీ వల్ల తమ గడ్డకు ఒరిగేదేమున్నదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ వెనుకబడిన తెలంగాణను ముందుకు తీసుకుపోతున్న ప్రణాళికలను చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నది. అందుకు కేంద్రం నుంచి తెలంగాణ ఆయా రంగాల్లో పొందిన అవార్డులే నిదర్శనం. అన్నిరంగాల్లో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడి కేవలం తొమ్మిది సంవత్సరాలే అవుతున్నా దేశంలోని అన్ని రాష్ర్టాలతో పోటీపడుతూ అభివృద్ధిలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా తనను తాను పునఃనిర్మించుకుంటున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఆంధ్రా పాలకుల పాలనలో రైతులు నిత్యం కరెంట్ లేక ఎంతో ఇబ్బంది పడేవారు. కానీ మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కోతల్లేని 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ తెలంగాణ అంతటా పల్లె, పట్టణం అనే తేడా లేకుండా లభిస్తున్నది. దీంతో పరిశ్రమలు, వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకున్నది. ఫ్లోరోసిస్తో వికలాంగులుగా మారి బాధపడుతున్న తెలంగాణ పల్లెలకు మిషన్ భగీరథ నీళ్లు అమృతమయ్యా యి. ఇయ్యాల వందశాతం గ్రామీణ ప్రాంతాల్లో నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ప్రతి ఇంటికి వస్తున్నది. మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటగా ప్రవేశపెట్టిన పథకం మిషన్ కాకతీయ. ఈ పథకంతో ప్రతి ఊరు ఒక ఊట చెలిమె అయ్యింది. వలసలు ఆగి ప్రతి ఊరు పచ్చగా కళకళలాడుతున్నది. అలాంటి బృహత్తర పథకానికి కేంద్రం అణా పైసా సహాయం చేయకపోవడమే కాకుండా అందులో అవినీతి జరిగిందని నీతిమాలిన ఆరోపణలు చేస్తున్నది.
కేసీఆర్ కృషితో తెలంగాణ ప్రతి విషయంలోనూ దేశంలోనే నెంబ ర్ వన్గా నిలిచి మొత్తం దేశానికే ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఉన్నది. హరితహారంతో తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకున్నది. తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి శుభ్రతను పాటించడంలో, పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణలోని పట్టణ ప్రాంత మున్సిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు ముందంజలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చూసి తట్టుకోలేని మోదీ తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అవహేళన చేసేవిధంగా మాట్లాడుతున్నాడు.
రైతేరాజు అనే లక్ష్యంతో కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుఖంగా జీవిస్తున్నారు. రైతు సుఖంగా ఉండటం బీజేపీకి, ఆ పార్టీ నాయకులకు ఇష్టం లేదు. అందులో భాగంగానే కొన్ని నల్ల చట్టాలు తీసుకురావడం, మోటర్లకు మీటర్లు పెడుతామంటూ భయపెడుతున్నారు.
విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చడంలో బీజే పీ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నో సంవత్సరాల కల మరెన్నో దశాబ్దాల కోరికైన కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట్ జోన్, కాజీపేట రైల్వే యూనివర్సిటీ డిమాండ్లు డిమాండ్లుగానే మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థలాన్ని కేటాయిస్తే ఆ కోచ్ ఫ్యాక్టరీని గద్దల్లాగా గుజరాత్కు తీసుకుపోయిన మోదీ చెప్పే సమాధానం కోసం వరంగల్ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అదేవిధంగా ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నది. దానికి జాతీయ హోదా కల్పించడంలో జాప్యమేంటో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా తెలంగాణ విభజన చట్టంలో పొందుపరచిన బయ్యా రం ఉక్కు ప్లాంట్ ఊసే ఎత్తటం లేదు. తెలంగాణ రాష్ట్రం జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుంటే కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గత తొమ్మిదేండ్లుగా రాష్ర్టానికి ఒక్కటంటే ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదు. ఇదే వరంగల్ కేంద్రంలో తెలంగాణలో రెండో అతిపెద్ద యూనివర్సిటీ అయిన కాకతీయ యూనివర్సిటీకి రావలసిన యూజీసీ గ్రాంట్స్ కూడా తగ్గిస్తూ యూనివర్సిటీ మీద ఉక్కుపాదం మోపుతున్నది. దేశవ్యాప్తంగా 157 మెడికల్ కళాశాలలు ఏర్పాటుచేసిన కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు. దేశవ్యాప్తంగా 16 ఐఐఎంలు ప్రకటించిన కేంద్రం విభజన చట్టంలో ఇస్తామన్న ఒక్క ఐఐఎం కూడా తెలంగాణకు ఇవ్వలేదు. 12 ఐసీఆర్లు, 87 నవోదయ పాఠశాలను దేశవ్యాప్తంగా తమకనుకూలంగా భజన చేసే రాష్ర్టాలకు కేటాయించింది. అంటే బీజేపీ తెలంగాణపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
వరంగల్ను కరీంనగర్ను కలిపే రహదారిని జాతీయ రహదారిగా చేస్తామన్నారు ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి అభివృద్ధి లేదు. అలాగే గిరిజనుల చిరకాల స్వప్నమైన ములుగు గిరిజన యూనివర్సిటీ నాడు విభజన చట్టంలో పొందుపరిచారు కానీ నేటి వరకు దాని ఊసు లేదు. ఇప్పుడు వరంగల్కు వస్తున్న మోదీ వీటన్నింటికి ఏం సమాధానం చెప్తాడో వేచి చూడాలి.
సంక్షేమ కార్యక్రమాలతో ముం దుకు పోతున్న రాష్ర్టాన్ని కుట్రలతో, అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నది బీజేపీ. ఆ కుటిల పన్నాగాలను తిప్పికొట్టి తెలంగాణ సమాజమంతా కేసీఆర్ వెంట నడవాల్సిన సమయం ఇది.
-జీ రాజేష్ నాయక్
96035 79115