నేడు ఖమ్మంలో జరుగనున్న భారత్ రాష్ట్ర సమితి సభ మన దేశానికి ఉషోదయం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా మార్చడం ఒక సాహసోపేతమైన చర్య. ఇంతటి సాహసం చేయడానికి దార్శనికుడు, మహా మేధావి, నిరుపమాన రాజనీతి ప్రజ్ఞ కలిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే చెల్లింది.
దేశంలో కొనసాగుతున్న అవకాశవాద రాజకీయాలకు తెరదించుతూ, రాజకీయ యవనికపై కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం నేడు దేశమంతా మార్మోగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది. అయినా ప్రజలు ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఎందుకున్నారని కేసీఆర్ సంధించిన ప్రశ్నకు ఏ ఒక్క రాజకీయ పార్టీ సమాధానం చెప్పలేకపోయింది. బీఆర్ఎస్ పార్టీ ముందు బిక్కమొహం వేశాయి.
స్వాతంత్య్రోద్యమ కాలంలోని చైతన్యం అన్ని రాజకీయపార్టీల్లో కొరవడింది. దేశ ప్రజలు కూడా ఈ పార్టీల తీరును చూసి ఈసడించుకుంటున్నారు. భారత పరిస్థితిని చూసి, ఉద్యమగడ్డపై పుట్టిన కేసీఆర్ రక్తం మరిగిపోయింది. తెలంగాణ రాష్ర్టాన్ని రికార్డు సమయంలో అభివృద్ధి చేసి, దేశంలో అగ్రగామి రాష్ర్టాల్లోనే ముందు వరసలో నిలిపిన ఘనత కేసీఆర్ది. భారతదేశాన్ని కూడా ప్రపంచదేశాల్లో అగ్రస్థానంలో నిలపాలన్నది ఆయన సంకల్పం. ఆ సంకల్ప సాకారానికి ఎత్తిన జెండానే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్).
బీఆర్ఎస్ అతిత్వరలోనే యావత్ దేశంలో విస్తరించి విజయ దుందుభి మోగించడం ఖాయం. రానున్న ఎన్నికల నాటికి దేశంలో ప్రబలశక్తిగా మారటం పక్కా. కుల, మత, ప్రాంతాలకతీతంగా యావత్ భారత జాతి జనులను అభివృద్ధి పథాన బీఆర్ఎస్ నడిపించే సమయం ఆసన్నమైంది. తన బిడ్డ కేసీఆర్ను చూసి భరతమాత మురిసిపోతున్నది. దేశంలోని అన్ని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలను అందించడానికి నేటి ఖమ్మం సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పథక రచన చేయనున్నారు. మన రాష్ర్టానికే కాదు, మన దేశంలోనే ఖమ్మం సభతో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయి. (వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)
-కోలేటి దామోదర్
98491 44406