ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ భగవద్గీత పదిహేనవ అధ్యాయం అయిన పురుషోత్తమ ప్రాప్త్రియోగములో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన పైశ్లోకం అర్థం: వేళ్లు పైకి, కొమ్మలు కిందకి ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) నాశం లేనిది.
ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం యో వేద సంప్రతి న స జాతు జనః శ్రద్దధ్యాత్ మృత్యుర్మా మారయదితిః
‘ఈ వేర్లు పైకి, శాఖలు కిందికి ఉన్న వృక్షమును ఎరిగినవారు, మృత్యువు వారిని అంతం చేస్తుందని విశ్వసించరు.’తైత్తిరీయ ఉపనిషత్ చెప్తుంది.
భారత రాష్ట్ర సమితి అశ్వత్థ వృక్షము వంటిది. ఇపుడు పైశ్లోకాలు మరలా ఒకసారి చదవండి.
బీఆర్ఎస్ అనే అశ్వత్థపు వేర్లూ, శాఖలూ తెలంగాణ నేల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నయి. నాందేడ్ తర్వాత మరాఠా గడ్డపై నిన్న జరిగిన కంధార్-లోహ బహిరంగ సభకు హాజరైన భారీ జనం చెప్తున్న నినాదం ఒక్కటే: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్!
కిసాన్ సర్కార్ ఎందుకు రావాలో మరాఠాలకు బాగా తెలుసు. తమ సమస్యల కోసం రక్తాలు కారుతున్నా లెక్కచేయక నాసిక్ నుంచి ముంబై దాకా నడిచి నిరసన తెలిపినవారికి వేరొకరు చెప్పాలా? అర్ధరాత్రి అఘాయిత్యాల ఫడ్నవీస్ లాంటివాళ్లు కేసీఆర్ సభకు రైతాంగాన్ని రాకుండా ఆపగలరా? 512 కిలోల ఉల్లిగడ్డలకు సోలాపూర్ మార్కెట్ కమిటీ ఇచ్చిన 2 రూపాయల చెక్కును చూపిస్తూ కన్నీటి పర్యంతమైన రైతు రాజేంద్ర చవాన్ కష్టం తెలిసినవారు తప్పక సంధించే నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’. అందుకే నిన్నటి సభ ఒక విజయ గర్జన! శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునునికి కలిగిన విశ్వాసం లాంటిదే అశ్వత్థ వృక్షము విషయము నెరిగినవారు తమకు వినాశనం లేదని విశ్వసించగలరు. బీఆర్ఎస్ ఇస్తున్న విశ్వాసం అట్టిదే, మహా గట్టిదే.
మీరు తరచి చూస్తే మరొక్క విషయం కూడా బోధపడుతుంది. ఆకాశమంతానా భూగోళమంతానా అన్నట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నా… అశ్వత్థ వృక్షం మూలం ఒక్కచోట ఉంటుంది. అట్లే బీఆర్ఎస్ మూలం తెలంగాణ. నిన్నటిదాకా తెలంగాణ గురించి పల్లెత్తని వారు కూడా బీఆర్ఎస్ పేరు మార్పుపై ‘తెలంగాణవాదం నుంచి పారిపోయిండు కేసీఆర్’ అనడం పరమ హాస్యాస్పదం.
ప్రముఖ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బాలచందర్, సూపర్ స్టార్ రజనీకాంత్ను చేసిన ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో, చూడండి. ‘ఏరా… నువ్వు శివాజీరావు గైక్వాడ్గా ఉండటానికి ఇష్టపడతావా లేక రజనీకాంత్ లాగానా?’ అని బాలచందర్ అడిగితే రజనీ అంటాడు ‘ఆ శివాజీరావు లేకపోతే ఈ రజనీకాంత్ ఎక్కడ?’ అని. అర్థమయింది కదా? బీఆర్ఎస్ దేశాన్ని ఏలినా తెలంగాణ తల్లి కన్నబిడ్డే. తమ మూలాలు మరవనివారే లోకాలు ఏలగలరు!
అసలు దేనికి విమర్శిస్తున్నామో కూడా తెలియనివారికి ఎప్పుడూ కళ్ళు బైర్లు కమ్ముతాయి. పాపం ‘కంటి వెలుగు’ పరిధిలోకీ రాలేనివారు! అందుకే, ఎక్కడో ఛత్తీస్గఢ్లోని వార్తను తెచ్చి తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకొని పలుచన అయిన్రు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్.
ఇక, కేసీఆర్ ఏమన్నారు నిన్న కంధార్-లోహ సభలో? ‘తెలంగాణలో లాగ రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఇంటింటికీ రక్షిత తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరు ఇస్తవా ఫడ్నవీస్? ఇచ్చి చూపించు, నేను ఇంక రాను మహారాష్ట్రకు’ అంటూ కుండబద్దలు కొట్టిన్రు. ఒక్కసారి గులాబీ జెండా ఎగరగానే గుబులు పుట్టి రైతుకు ఆరువేల రూపాయలు అంటూ బడ్జెట్లో మాట్లాడిన్రు’ అని కూడా అన్నరు. That is BRS effect!
ప్రజలను, ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కొనడం కంటే; ఏక్నాథ్ షిండేలను సృష్టించి, పార్టీలను చీల్చి ప్రభుత్వంలోకి రావడమే తెలిసిన ఫడ్నవీస్కూ, వారి పార్టీకి ఎన్ని చెప్పినా దండగే. మహారాష్ట్ర గడ్డను పావనం చేసిన తాత్వికుడు తుకారాం… బుడగ వంటి బతుకు ఒక చిటికెలోన చితుకు… అది శాశ్వతమని తలచేవురా, నీవెందుకనీ మురిసేవురా’ అంటడు కదా! విశ్వగురువు, అఖండ భారత మాటున విషద్వేషాలే మార్గంగా భారత్ను ఖండఖండాలు చేసే బీజేపీకి జెల్ల తగిలితే గానీ తత్వం బోధపడదు. వారిని ఎన్నికల క్షేత్రంలో చిత్తుచిత్తు చేయడం ఒక్కటే మందు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అవశ్యం!
పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ లాగ భిక్ష ఎత్తుకునే దేశం కాదు. చైనా, సింగపూర్, మలేషియా లాగ సుభిక్ష దేశం కావాలని ఆశించే కేసీఆర్ సంకల్పానికి అడ్డొచ్చే శక్తి ఈ గడ్డపై లేదు. మనం ఏయే అభివృద్ధి సూచీలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో, ఎట్లా మన దేశాన్ని ప్రపంచంలో మేటి శక్తిగా తయారు చేయవచ్చో మీకందరికీ తెలుసు. గణాంకాల సహితంగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పి ఉన్నరు. అవన్నీ ఒక్క క్లిక్తో మీకు దొరుకుతయి కాబట్టి ఆ వివరాల్లోకి పోవడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు.
సూటిగా ఒక్కటే. ఏమి చేద్దాము ఈ దేశాన్ని? ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతలు రోజూ జపించే పాకిస్థాన్ లాగ చేద్దామా? పసి పిల్లలకు గుక్కెడు పాలు దొరకని ఆ దేశం దీనావస్థ తెలుసు కదా మీకు? అభివృద్ధి, సంక్షేమాలను పక్కన పడేసి కేవలం మతం ద్వారా రాజకీయం చేసి, మత రాజ్యంగా మారిన తర్వాత మనమేమిటి, ఏ దేశమైనా పాకిస్థాన్ కావాల్సిందే.
అట్లాఒద్దురా బాబూ… మన దగ్గర అన్నీ ఉన్నయి. సకల వనరులున్నయి, వాటిని ఉపయోగంలో పెట్టే సకలజనమూ ఉన్నరు, ప్రపంచం ఆశ్చర్యపోయే అభివృద్ధి సాధ్యమే, తొమ్మిదేండ్ల తెలంగాణ నిలువెత్తు ఉదాహరణగా ఉన్నది, దేశానికి దివిటీ చూపిస్తున్నది. ‘ప దండి దేశాన్ని బాగుచేసుకుందాం’ అని కేసీఆర్ పిలుపునిచ్చిన్రు. దేశభక్తి మీద భక్తి తప్ప దేశం మీద భక్తి లేని మూకలు సహజంగానే సహించలేని రాజకీయం కేసీఆర్ది. ఆ టాస్క్ మాస్టర్ గొంతు నులమాలని బీజేపీ కంకణం కట్టుకున్నది. అందులో భాగమే బీఆర్ఎస్ నాయకులపై ఈడీ సహా అన్ని వ్యవస్థల ప్రయోగం. ‘ప్రశ్నించాలి ప్రశ్నించాలి’ అంటూ ఉంటరు కొందరు. తప్పు చేసినవారిని శిక్షించవద్దా అంటరు కొందరు. అసలు తప్పుడు ప్రశ్నను కదా వివేచన గలవారు ప్రశ్నించవలసింది?
https://www.indiabudget.gov.in/doc/rec/annex9.pdf ఈ ఫైల్ ఓపెన్ చేయండి విజ్ఞులారా. భారత ప్రభుత్వ ఆర్థికశాఖ వెబ్సైట్లో ఉన్న అధికార అప్పుల చిట్టా అది. ఈ నెలాఖరుకు, అంటే మరొక పది రోజుల్లో మన అప్పు రూ.1,52,61,122కు (అంటే కోటీ యాభై మూడు లక్షల కోట్లు!); వచ్చే సంవత్సరాంతానికి రూ.1,69,46,666కు (అంటే కోటీ డబ్బు లక్షల కోట్లు!)కు చేరుకుంటుంది.
ఈ తెచ్చిన పైసలన్నీ ఏమైనయి? ఎవరికి పెట్టిన్రు? మీకు ఎవరికన్నా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపునకు వాడిండా మోదీ? జేబులో పర్సును చూసి రెండొందలా లేక ఒక వంద చాలేమో అంటూ చింతలో పడుతూ బండిలో పెట్రోల్ పోయించే మిమ్మల్ని ఏమన్నా ఆదుకోవడానికి విదిలిస్తున్నడా ఆ పైసలు? పెన్సిల్, షార్ప్నర్పై జీఎస్టీ వేసి మీ చిన్నారులు చదువును మొద్దుబార్చడం తప్ప వారికేమన్న తాతలా సహాయపడుతున్నడా? ‘యోగక్షేమం వహామ్యహమ్’ అని లోగో పెట్టుకొని జీవనంలోనూ, జీవనం అనంతరమూ భరోసా పడే ఎల్ఐసీని భక్షిస్తూ మీ భద్ర జీవనానికి తూట్లు పొడిచే పాలసీ ఎందుకు తెచ్చిండు? అన్నేసి కోట్ల అప్పులు మనమీద రుద్ది ఇంకా కక్కుర్తి ఎందుకు? మీ అవ్వాతాతలకు రైళ్లలో కన్సెషన్ ఎత్తేసి మిగిల్చిన పైసలు ఏమి చేస్తున్నడు? ఎందుకు అందరికీ తాగు నీరు లేదు. ఎందుకు వ్యవసాయ భూములు ఎండిపోతున్నయి? ఎందుకు కరెంటు లేక చీకట్లో వేలాది గ్రామాలు మగ్గుతున్నయి? ఏమి చేస్తున్నరు ఆ పైసలన్నీ? ఎవరికి దోచిపెడుతున్నరు?
తెలంగాణ సాధించినవాడు, దాన్ని సమున్నతంగా నిలబెట్టినవాడు, మనతో పాటు దేశాన్ని తల ఎత్తేలా చేయాలని సంకల్పం తీసుకున్నవాడు మనందరికీ ఆత్మీయ లేఖ రాసిండు. మీరే నా బలం, బలగం. అప్రమత్తంగా ఉండా లి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రగతికి అడ్డంకులు సృష్టించే ‘బీజేపీ బరితెగింపు దాడులను అడ్డుకోవాలి’ అని పిలుపునిచ్చిన్రు కేసీఆర్. ఇది ఆయన కోసం కాదు. మీ కోసం, మీ చిన్నారుల కోసం, మీ పెద్దవాళ్ల కోసం, మీ సాగు భూముల కోసం, మీ తాగు నీటి కోసం, మీ వెలుగు కరెంటు కోసం, మీ జిలుగు బతుకు కోసం!
నిన్న మరాఠా గడ్డపై చెప్పిన సంకల్పం, సిద్ధించిన హర్షామోదపు సారాంశం ఇదే!
జై భారత్!!
శ్రీశైల్రెడ్డి పంజుగుల
90309 97371