Podu Lands | తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అణగారినవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. ఈ నెల 30న పోడు భూములను సాగుచేస్తున్న గిరిజనులకు భూ పట్టాలు పంపిణీ చేయనున్నారు. దీంతో రాష్ట్రం మరో మైలురాయి అందుకోనున్నది. సీఎం కేసీఆర్ 26 జిల్లాల్లోని 1,51,146 మంది బంజారా, ఆదివాసీ గిరిజనులకు 4,06,369 ఎకరాల పోడు భూములకు పట్టాలిచ్చి ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేయనుండటం అభినందనీయం.
అటవీ నివాసితుల చట్టం 2006లో పార్లమెంట్ ద్వారా చేయబడింది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం.. 2005 డిసెంబర్ నాటికి అటవీ భూమిలో నివాసం ఉండి సాగుచేస్తూ ఆ భూమిపై జీవనాధారం సాగించే గిరిజనులు మాత్రమే అర్హులు. ఈ చట్టంలోని సెక్షన్ 4 (6) ప్రకారం.. 4 హెక్టార్లు, 10 ఎకరాలకు మించకుండా భూమి ఉండాలి. గిరిజనేతరులైతే 2005 కంటే ముందు 3 తరాల వారు అంటే, 75 ఏండ్లకు పూర్వం అటవీ భూముల్లో నివాసం ఉండి సాగుచేస్తూ, వాటిపై మాత్రమే జీవనాధారం కలిగి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ 3,08,614 ఎకరాలకు 96,676 మందికి పట్టాలు ఇచ్చారు. కానీ భూమి చూపించకపోవడమే బాధాకరం. తద్వారా గిరిజనులకు పోడు భూములు అందని ద్రాక్షే అయ్యాయి.
అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చబోతున్నారు. ఇది దేశచరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. అటవీ హక్కుల నిబంధనలు సెక్షన్ 13(1) ప్రకారం.. ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఇంటిపన్ను రశీదులు, నివాస ధ్రువీకరణ పత్రాలు, సంప్రదాయబద్ధంగా అడవుల్లో ప్రజా వినియోగాలైన బావులు, బోర్లు, శ్మశానాలు, పవిత్ర స్థలాలను సాక్ష్యాలుగా పరిగణించి పోడు భూములకు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీంతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గొప్ప చరిత్ర లిఖించబోతున్నారనడంలో సందేహం లేదు. అంతేకాదు, భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా రక్షించుకొనే బాధ్యతను కూడా గిరిజనులకే అప్పగించడం ముదావహం.
గిరిజనులకు ఉపాధి, విద్యారంగాల్లో కేంద్రం ఆమోదించకపోయినా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు 6 నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. గిరిజన ఆరాధ్య దైవమైన సంత్శ్రీ సేవాలాల్, కుమ్రం భీమ్, ఎరుకల నాంచారమ్మల జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది.
ఉన్నతవర్గాల వారు నివసించే బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారా భవన్, ఆదివాసీ కుమ్రం భీమ్ భవనాలను నిర్మించి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షకుడిగా నిలిచారు. 3,146 బంజారా తండాలను, ఆదివాసీ గూడేలను, చెంచు పేటలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేసిన కేసీఆర్ గిరిజనుల ఆత్మబంధువు అని అడవి
బిడ్డలు కీర్తిస్తున్నారు.
-ఎల్ రూప్సింగ్ 90005 00760