సమాచార హక్కుకు చట్టబద్ధత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా పౌర సమాజం స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో 18 ఏండ్ల క్రితం నాటి ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పిస్తూ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ప్రజలకు వెల్లడించవచ్చునని తెలిపింది. సెక్షన్ 8(1)నిబంధన ప్రకారం 10 విభాగాలుగా వర్గీకరించిన వివరాలను మాత్రం నిరాకరించవచ్చునని ఈ చట్టం స్పష్టంగా పేర్కొన్నది.
‘అధికార రహస్యాల చట్టం లేదా మరే చట్టాలైనా నిబంధనల పేరుతో పౌరులకు సమాచారం ఇవ్వకుండా నిరాకరించరాదు’ అని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. కానీ జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చట్టరూపం దాల్చిన ‘డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు-2022’ ప్రస్తుతం అమల్లో ఉన్న సమాచార హక్కు చట్టం ఆధార్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టాల్ని సవరించాలని పేర్కొన్నది. ఇప్పటికే పలు సవరణలతో స.హ చట్టానికి తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 8(1) ను సవరిస్తే సమాచార హక్కు చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది. ప్రజల చేతిలో పాశుపతాస్త్రంగా మారిన ఈ చట్టం రెక్కలు తెగిన జటాయువుగా మారుతుంది.
దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు-2022 ముసాయిదాను తయారు చేశారు. తాజాగా 81 సవరణలు 12 భారీ సూచనలతో కూడిన బిల్లు ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చట్ట రూపం దాల్చింది. ఈ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం ప్రకారం వ్యక్తిగత సమాచారాన్ని సమాచార గోప్యత కింద పరిగణించాలి. అలాగే ఇతరత్రా కారణాలతో వ్యక్తిగత సమాచారాన్ని బదిలీ చేయడం, విక్రయించడం నేరం.
మత రాజకీయ విశ్వాసాలు, ఆర్థిక, ఆరోగ్య గణాంకా లు, కులం లేదా మతం, బయోమెట్రిక్ సమాచారం వంటి అత్యంత సున్నితమైన వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాలంటే స్పష్టమైన అనుమతులు ఉండాలి. జాతీయ భద్రత నేర దర్యాప్తు న్యాయ విచారణల్లోనూ గోప్యత ఉంటుంది. ఎవరైనా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచినట్టు ప్రభుత్వం నిర్ధారిస్తే వారిపై గరిష్టంగా రు.500 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు వ్యక్తుల సమాచారాన్ని వారికి ఇబ్బంది కలగకుండా చట్టబద్ధంగా పారదర్శకంగా ఉపయోగించాలి. ఈ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు జరిగేలా చూసేందుకు భారత సమాచార పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేస్తామని ఈ బిల్లులో పేర్కొన్నారు.
సమాచార హక్కు చట్టం సెక్షన్ 22 ప్రకారం అధికార రహస్యాల చట్టం-1923, అమల్లో ఉన్న మరేదైనా చట్టమైనా అమల్లో ఉన్న పత్రంలో ఈ చ ట్టంతో పొసగని అంశాలు ఉన్నప్పటికీ ఈ చట్టంలోని నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంటున్నది. ఇతరేతరమైన ఏ చట్టాలు, అధికారాలు చూపి గాని సమాచార హక్కు చట్టం పరిధుల్ని అతిక్రమించడానికి వీలులేదనీ ఈ సెక్షన్ స్పష్టంగా చెబుతున్నది. కానీ ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశంలో చట్ట రూపం దాల్చిన డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు ముసాయిదాలోని సెక్షన్ 30(2) సమాచార హక్కు చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించింది.
సహ చట్టంలోని సెక్షన్ 8(1)జే ను పూర్తిగా సవరించాలని ఈ చట్టం పేర్కొన్నది. ఇదే జరిగితే అధికార యంత్రాంగాలు రకరకాల సాకులు చెప్పి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా తిరస్కరించే అవకాశాలే ఎక్కువు న్నాయి. అలాగే అవినీతిపరులైన అధికారులు ప్రజల నిఘా పరిశీలన నుంచి తప్పించుకోవచ్చు. ప్రభుత్వ రికార్డులను పొందాలంటే ఆర్ట్టీఐ చట్టం ఎందుకు కొరగాకుండా పోతుంది. సమాచారాన్ని బయటకు ఇచ్చే విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల గోప్యత హక్కులు ప్రజాప్రయోజనాలు అనే వాటిని సెక్షన్ 8 లో పగడ్బందీగా సమతుల్యం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల గోప్యత హక్కులకు ఈ చట్టంలో రక్షణలున్నాయి. చట్టాన్ని సవరిస్తే ఆ సమన్వయం దెబ్బతింటుంది. ఈ ఒక్క కారణం చూపి రకరకాల సాకులతో సమాచారాన్ని తిరస్కరించవచ్చు. అంతిమంగా సమాచార హక్కు చట్టం స్ఫూర్తి దెబ్బతింటుంది.
ప్రజాస్వామ్య విలువలకు జవాబుదారీ గా ఉండే ఇలాంటి చట్టాన్ని బలోపేతం చే యాల్సిందిపోయి బలహీనపరిచేందుకు జరుగుతున్న కుట్రల్ని పౌర సమాజం ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రతిఘటించాలి. తప్పుడు భాష్యాలు చెప్పి సమాచారం తిరస్కరించే ఇలాంటి చట్ట సవరణలను అడ్డుకోవాలి.
-అంకం నరేష్
63016 50324