Irrigation | రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు ఎంతమేరకు నెరవేరాయని మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకాలం నాటి మూడు అనుభవాల నేపథ్యంలోంచి ఈ విశ్లేషణ చేయాలని భావిస్తున్నాను.
ఈ కాలువల్లో గోదావరి నీటిని చూస్తామా అన్న అనుమానం వ్యక్తం చేసిన రైతులు ఇవ్వాళ ఊరూరా గోదావరి మాతకు స్వాగతం పలుకుతున్నారు. వారి ఊరి చెరువులు గోదావరి జలాలతో నిండుతుంటే వారి సంతోషానికి అవధుల్లేవు. మేము ఆయకట్టులో చిట్టచివరన పెన్పహాడ్ మండలంలో ఉన్న రాగి చెరువు కూడా నిండిపోవడం చూసి సంబురపడ్డాం.
ఒకటి…
2002, జూన్లో కొంతమంది రచయితలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి మహబూబ్నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో బీకే లక్ష్మాపూర్, జీలుగుపల్లి గ్రామాల పరిశీలనకు వెళ్లినప్పుడు అవి వల్లకాడుల్లాగా కనిపించాయి. గ్రామాల్లో ఇండ్లన్ని తాళాలు వేసి ఉన్నాయి. మనుషులున్న కొన్ని ఇండ్లల్లో వృద్ధులు, వికలాంగులు, పసిపిల్లలే కనిపించారు. మిగతావారు పనికోసం ఎక్కడికో తెలియని దూరతీరాలకు వలసపోయారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. వేల ఎకరాల సాగు భూములు పడావు పడి ఉన్నాయి. ‘పల్లే పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా- మన తెలంగాణలోనా’ అన్న మిత్రా పాటకు ప్రతిరూపాలుగా కనిపించాయి ఈ గ్రామాలు. లక్ష్మాపూర్లో కొంతమంది గ్రామస్థులతో మీకేం కావాలని ప్రశ్నించినప్పుడు వారు మా గ్రామంలో రాజుల చెరువును బాగుచేయిస్తే 100 ఎకరాల్లో పంట పండుతుంది. మాకు ఇక్కడే పనులు దొరుకుతాయన్నారు. అదే ప్రశ్న జీలుగుపల్లి గ్రామస్థులనడిగితే కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తిచేస్తే మాకు జిల్లా వదిలి దూర ప్రాంతాలకు వలసపోయే బాధ తప్పుతుందన్నారు.
రెండవది…
‘వాగు ఎండిపాయెరా- పెదవాగు తడి ఎండిపాయెరా..’ గోరటి వెంకన్న వలపోత పాట తెలంగాణలో ప్రతి ఒక్కరి వలపోతగా అనుభవంలోకి వచ్చింది. వెంకన్న తన ఊరి పక్కనుంచి పారే దుందుభి నదిని తలుచుకుంటూ ఆ పాట ద్వారా తన వలపోతను ఆర్ద్రంగా వ్యక్తీకరించుకున్నాడు. నాకు ఆ పాటలో మా బొంతల పెద్దవాగు కనిపించింది. 1980 దశకం ప్రారంభం వరకు ఎండకాలంలో కూడా నడుం లోతున పారే పెద్దవాగు ఎండిపోయింది.
మూడవది…
2012లో తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ యూనిట్ వారు శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు నీరందించాలని డిమాండ్ చేస్తూ ఒక సదస్సును సూర్యాపేట జిల్లా డీ కొత్తపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటుచేశారు. ఈ సదస్సు శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టుకు నీరందించే ఒక ప్రధానమైన డిస్ట్రిబ్యూటరీ డీబీఎం-71 కాలువలో టెంట్లు వేసి ఏర్పాటు చేశారు. జనరేటర్ ద్వారా కరెంటు సరఫరా చేసి మైకులు ఏర్పాటుచేశారు. కాలువ ఉన్నట్టే కానీ తుమ్మలతో నిండిపోయి ఒక అడవిని తలపిస్తున్నది. అప్పటికే ఆ కాలువ తవ్వి పదిహేనేండ్లు గడిచాయి. ఈ పదిహేనేండ్లలో ఒక్క చుక్కనీరు ఆ కాలువలో పారింది లేదని ఆ సదస్సులో ప్రసంగించిన రైతులన్నారు. ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరు ఈ కాలువల్లోకి చేరుతుందన్న ఆశ మాకు లేదు. గోదావరి మీద కాంతనపల్లి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి శ్రీరాంసాగర్ కాలువల్లో నీరు వదలాలని డిమాండ్ చేశారు. ఆ సదస్సులో ఆర్ విద్యాసాగర్రావు, శ్యాంప్రసాద్రెడ్డి, నేను వక్తలుగా పాల్గొన్నాం.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలోనే ఎంత మార్పు… 2019లో కల్వకుర్తి ప్రాజెక్టు ప్రధాన కాలువ వెంబడి ఒక రోజంతా ప్రయాణించాను. అంతకుముందు చాలాసార్లు సాగునీటి మంత్రి హరీశ్రావుతో జిల్లాలో అనేకసార్లు పర్యటించాను. ఎటుచూసినా పచ్చదనం. వరి పొలాలు, వేరుశనగ పంట చేలతో పచ్చగా ఉన్న భూములే కనిపించాయి తప్ప ఒక్క ఇంచు కూడా పడావు భూమి కనిపించలేదు. కల్వకుర్తి ప్రధాన కాలువ నిండుగా పారుతున్నది. కాలువకు రెండువైపులా కరెంటు లైన్లు కనిపించాయి. కాలువ వెంబడి రెండువైపులా వందలాది కరెంటు మోటర్లు కనిపించాయి. కాలువ నీళ్లను పైపుల ద్వారా 5 కిలోమీటర్ల దూరం దాక కూడా తరలించుకపోతున్నారని నాతో కాలువ వెంబడి ప్రయాణించిన ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేశ్ జాదవ్ చెప్పారు.
కల్వకుర్తి కాలువల్లో నీరు రావడంతోనే ఆయకట్టు ప్రాంతం లో స్ప్రింక్లర్ అమ్మకాలు పెరిగాయట. వందలాది స్ప్రింక్లర్ సెట్లు ఆయకట్టు ప్రాంతంలో కనిపించాయి. ఎగుడు దిగుడు ప్రాంతంలో, గుట్టల వాలు ప్రాంతంలో ఈ స్ప్రింక్లర్ల ద్వారా వేరుశనగ పంట సాగు చేయడం చూసి ఆశ్చర్యపోయాను. 2002లో చూసిన మహబూబ్నగర్కు 2018లో మహబూబ్నగర్కు పోలిక లేనే లేదు. వలసలు బందయినాయని, వలస పోయినవారు గ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయంలో మునిగిపోయారని మా ఇంజనీర్లు చెప్పారు. అదే విషయాన్ని టంకశాల అశోక్ రెండు నెలల కిందట కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను సందర్శించి ధ్రువీకరించారు. అంతేకాదు, మహబూబ్నగర్ జిల్లాకే ఉపాధి కోసం పొరుగు రాష్ర్టాల నుంచి కూలీలు వస్తున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ‘మిషన్ కాకతీయ’ కింద చెరువులను పునరుద్ధరించింది. తెలంగాణలో అత్యధిక చెరువులున్న జిల్లా మహబూబ్నగర్. లక్ష్మాపూర్ తండావాసులు కోరుకున్నట్టు రాజుల చెరువు కూడా మిషన్ కాకతీయలో పునరుద్ధరణ జరిగిందని మా శాఖ ఇంజినీర్లు ధ్రువీకరించారు. వైఎస్సార్ ప్రభుత్వం జలయజ్ఞంలో ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు తెలంగాణ ఏర్పడేనాటికి పెండిగ్ ప్రాజెక్టులుగా మారిపోయాయి. జీలుగుపల్లి గ్రామస్థులు కోరుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది.
వీటి ద్వారా 8 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానించింది. వీటి ఆయకట్టు పరిధిలో ఉన్న వాగులపై చెక్డ్యాంలను నిర్మించింది. వీటన్నింటి కారణంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చెరువుల్లో, కాలువల్లో, చెక్డ్యాంల్లో నీటి లభ్యత పెరిగింది. భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇవన్నీ మహబూబ్నగర్ జిల్లాలో మునుపటి పరిస్థితులను పూర్తిగా మార్చివేశాయి. ఎండిపోయిన వాగులు పునర్జీవనం పొందాయి. మహబూబ్నగర్లో దుందుభి, ఇంకా తెలంగాణలో స్వర్ణ, హల్దీ వాగు, కూడవెల్లి వాగు, మానేరు, మంజీరా, ఆకేరు, మున్నేరు తదితర వాగులన్నీ చెక్డ్యాంల నిర్మాణంతో పునర్జీవనం పొందాయి. వాగుల పునరుజ్జీవన పథకంలో భాగంగా ముఖ్యమంత్రి బోథ్ పెద్దవాగుపై ప్రత్యేకంగా శాంక్షన్ చేసిన నాలుగు చెక్డ్యాంల వల్ల పెద్దవాగు పునరుజ్జీవనం పొందింది. బోథ్ పర్యావరణం పునరుద్ధరణ జరుగుతున్నది. భూగర్భ జలాలు పైకి లేచాయి.
వన సంపద పెరుగుతున్నది. పశు పక్ష్యాదులకు, వన్య ప్రాణులకు నీటి తావులు ఏర్పడినాయి. మేము చిన్నప్పుడు చూసిన పెద్దవాగు మళ్లీ దర్శనం ఇస్తున్నది. కరత్వాడ చెరువు నుంచి వచ్చే సీవేజ్ వాటర్, 4,700 ఎకరాల ఆయకట్టు నుంచి వచ్చే పడవాటి నీరు (Regenerated water) ఇప్పుడీ చెక్డ్యాంలలో నిల్వ ఉంటున్నాయి. బోథ్ పెద్దవాగు ఇక ఎప్పుడూ ఎండిపోయే పరిస్థితి రాదు. భూమికి నీటి తడి అందితే అది బంగారాన్ని పండిస్తుంది. లేనట్టయితే కరువును ప్రసవిస్తుంది. పాలమూరు భూముల్లో ఇప్పుడు పల్లేర్లు కాదు, బంగారు పంటలు పండుతున్నాయి.
ఇక నా మూడవ అనుభవం ముచ్చట చూద్దాం. 2019 అక్టోబర్లో సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ ప్రాంతాల్లో శ్రీరాంసాగర్ రెండవ దశ కాలువల్లో గోదావరి జలాల నీటి నిర్వహణ ఎట్లా జరుగుతున్నదో పర్యవేక్షించడానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్రావు, సూపరింటెండింగ్ ఇంజినీర్ సుధీర్లతో కలిసి వెళ్లాను. 2012లో తెలంగాణ విద్యావంతుల వేదిక నల్లగొండ యూనిట్ వారు జలసాధన సదస్సు కోసం టెంట్లు వేసిన డీ కొత్తపల్లి వద్ద ఆగి కాలువను చూశాను. పదిహేనేండ్లుగా ప్రవహించని గోదావరి జలాలు ఇప్పుడు కాలువలో నిండుగా ప్రవహిస్తున్నవి. ఎంత మార్పు! హృదయం ఉప్పొంగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీరు లోయర్ మానేర్ డ్యాంను దాటుకొని 200 కిలోమీటర్లు కాకతీయ కాలువలో ప్రవహించి మొదటి దశ ఆయకట్టు అవసరాలు తీరుస్తూ తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో వివిధ డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆయకట్టును తడిపాయి. వందలాది చెరువులను నింపాయి. ఈ కాలువల్లో గోదావరి నీటిని చూస్తామా అన్న అనుమానం వ్యక్తం చేసిన రైతులు ఇవ్వాళ ఊరూరా గోదావరి మాతకు స్వాగతం పలుకుతున్నారు. వారి ఊరి చెరువులు గోదావరి జలాలతో నిండుతుంటే వారి సంతోషానికి అవధుల్లేవు. మేము ఆయకట్టులో చిట్టచివరన పెన్పహాడ్ మండలంలో ఉన్న రాగి చెరువు కూడా నిండిపోవడం చూసి సంబురపడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందుకే గోదావరి నీరు తమ చెంతకు చేరుతున్నదని ఆయకట్టు రైతులకు తెలుసు.
ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణలో సాగునీటి కల్పన కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమించింది. చరిత్రలో ఎన్నడూ ఎరగనంత పెద్ద మొత్తంలో సాగునీటి రంగంలో ప్రభుత్వం ఖర్చుచేసింది. 2004-14 మధ్య కాలంలో సాగునీటిరంగంలో చేసిన ఖర్చు రూ.54 వేల కోట్లయితే 2014 నుంచి 2022 వరకు పెట్టిన ఖర్చు 1 లక్షా 70 వేల కోట్ల రూపాయలు. ఈ పెట్టుబడుల కారణంగా తెలంగాణలో సాగునీటి సౌకర్యం వేగంగా పురోగమించింది. మూడున్నరేండ్లలోనే ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంను పూర్తిచేసింది. మహబూబ్నగర్ ప్రాజెక్టులు, ఇతర జిల్లాల్లో చాలా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. చెరువులు, చెక్డ్యాంలు పూర్తయ్యాయి.
గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేసిన పనులు ప్రజల అనుభవంలోకి వస్తున్నాయి. రాబోయే రెండు, మూడేండ్లలో ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను పూర్తిచేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇప్పుడు తెలంగాణలో రైతుల ఆత్మహత్యల్లేవు. మహిళలకు తాగునీటి గోస లేదు. బోరు బావుల కింద వ్యవసాయం చేసే రైతులకు కరెంటు కష్టాలు లేవు. కరువులు లేవు, బతుకుదెరువు కోసం వలసల్లేవు, వలసపోయిన వారు గ్రామాల్లోకి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయం దండుగన్న స్థితి తెలంగాణలో వ్యవసాయం ఒక పండుగలా మారింది.
ఇప్పటికే ప్రాజెక్టుల కింద, బోరుబావుల కింద ఒక కోటి 35 లక్షల ఎకరాలు సాగులో ఉన్నాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో అన్ని మార్గాల ద్వారా కనీసం ఒక లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామన్న వాగ్దానం నెరవేరింది. మా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్న ఉద్యమ నినాదం తొమ్మిదేండ్లలోనే నిజమైంది. ఈ సందర్భంలో 2011లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) తన 11వ నివేదికలో కొత్త రాష్ర్టాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు మాతృ రాష్ర్టాలతో పోల్చినప్పుడు వాటి జీఎస్డీపీ పెరుగుదలపై ఈ విధంగా వ్యాఖ్యానించింది. అభివృద్ధి చెందడానికి కావలసిన వనరులు, శక్తి సామర్థ్యాలున్నప్పటికీ అవి అణగిపోయి ఉండటం వల్ల ఈ ప్రాంతాలు వెనుకబడిపోయాయి. ఈ ప్రాంతాలు, రాష్ర్టాలుగా ఏర్పడగానే వీటిలో సహజంగా నిబిడీకృతమై ఉన్న సమస్త సృజనాత్మక శక్తులు వికాసం చెంది ప్రజలను కార్యోన్ముఖులను కావించాయి. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన పరిపాలన కూడా బయటి పెట్టుబడులని రాష్ట్రంలోకి ఆకర్షించి ఆర్థిక ప్రగతికి దోహదం చేసి ఉంటుంది. వనరుల వినియోగం కూడా అందుకు ఊతమిచ్చింది. ఈ వ్యాఖ్యానం తెలంగాణకూ అక్షరాలా వర్తిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం తన శక్తిసామర్థ్యాలను, ప్రకృతి వనరులను, మానవ నిర్మిత వనరులను అత్యంత సృజనాత్మకంగా వినియోగించుకుంటున్నది. సాగునీటిరంగం అపూర్వంగా వికాసం చెంది రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తున్నది. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, సంకల్ప బలం తోడయ్యాయి.
పదిహేనేండ్లుగా ప్రవహించని గోదావరి జలాలు ఇప్పుడు కాలువలో నిండుగా ప్రవహిస్తున్నవి. ఎంత మార్పు! హృదయం ఉప్పొంగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీరు లోయర్ మానేర్ డ్యాంను దాటుకొని 200 కిలోమీటర్లు కాకతీయ కాలువలో ప్రవహించి మొదటి దశ ఆయకట్టు అవసరాలు తీరుస్తూ తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో వివిధ డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆయకట్టును తడిపాయి.
శ్రీధర్రావు దేశ్పాండే
94910 60585