ఇటీవల పార్లమెంట్లో తెలంగాణకు నిధులివ్వని, యువత ఉపాధికి భరోసానివ్వని కేంద్ర బడ్జెట్ను చూశాం. బీజేపీ పాలిత రాష్ర్టాలకు మేలు చేసే బడ్జెట్ను రూపొందించి పార్లమెంటులో ఆమోదించుకొన్న విషయం అందరూ చూశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిన మోసం గురించి మరోసారి అందరికీ తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఉండడంతో హర్షం వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఏటా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ గ్రామం, పట్టణానికి ఏ మేరకు నిధులు వస్తాయ ని చర్చించుకొంటున్నారు. ఈసారి కూడా తెలంగాణ సమాజమంతా ఫిబ్రవరి 6 ఉదయం 10.30 నిమిషాలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూశారు. వారు ఎదురు చూసిన విధంగానే సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలలు గన్న బంగారు తెలంగాణకు అనుకూలంగా, పేదల కండ్లల్లో కన్నీ టిని తుడవడమే ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్కు రూపకల్పన చేశారు.
వినియోగదారుడి కొనుగోలు శక్తి పెరిగేలా, పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా బడ్జెట్ను రూపొందించారు. అంతేకాదు, రైతులు రాసులకొద్ది ధాన్యం పండించేలా, ఆడబిడ్డ పెండ్లి కోసం తల్లితండ్రులు గాభరా పడకుండా నింపాదిగా ఉండేలా, రాష్ట్ర మంతటా గుంతలు లేని రోడ్లు ఉండేలా, తరత రాల వివక్షకు గురైన దళితులు వ్యాపారస్థులుగా ఎదిగేలా ప్రజా బడ్జెట్ను రూపొందించారు.
రాష్ట్రంలో తయారీ రంగం కొత్త పుంతలు తొక్కేలా పరిశ్రమలకు అండగా నిలిచింది బడ్జెట్. మహిళాభ్యున్నతికి పెద్ద పీట వేసింది. శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది. పాడి పంటలతో పచ్చని తెలంగాణను ప్రపంచం మెచ్చే విధంగా చేయాలన్న సంకల్పం రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో కనిపించింది.
సకల జనుల వికాసమే సంక్షేమ ధర్మంగా అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయడం శుభపరిణామం. ప్రతి బడ్జెట్లో కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణకు, కేంద్ర సంస్థలను ప్రైవేటు వారికి అప్పగించడం వంటి పనులకు పాల్పడితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి బడ్జెట్లో రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కళ్యాణలక్ష్మి లాంటి స్కీంలకు ఘనంగా నిధులు కేటాయిస్తున్నది. దీనివల్లే రాష్ట్ర బడ్జెట్ కోసం సమాజం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. దాని కి తగినట్లుగానే ఈసారి కూడా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు జరిపింది. ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా 2 లక్షల 56 వేల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. తద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది పేద ప్రజల కు సొంతింటి కల నిజం కానున్నది. దీనికోసం బడ్జెట్లో రూ.7890 కోట్లు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గత తొమ్మిదేండ్ల కాలం లో కేవలం రెండున్నర రెట్లు పెరిగితే తెలంగాణ బడ్జెట్ నాలుగున్నర రెట్లు పెరిగి రూ.2,90,396 కోట్లకు చేరింది. ఇది గుజరాత్ గత బడ్జెట్తో పోలిస్తే రూ.10,000 కోట్లు ఎక్కువ. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అభివృద్ధి టాప్ గేర్లో దూసుకుపోతున్నది. సీఎన్ఆర్ఐఓఎల్ డాట్కామ్ సోషల్ ఆర్గ్గనైజర్ లెక్కల ప్రకారం దేశంలో 100 పెద్ద పట్టణాలలో మహారాష్ట్రలో 17, ఉత్తరప్రదేశ్లో 10, కర్ణాటక, గుజరాత్లో 5 చొప్పున ఉంటే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ పెద్ద పట్టణాలుగా ఉన్నాయి. అయినప్పటికీ, తలసరి ఆదాయం బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ కంటే తెలంగాణలో నాలుగు రెట్లు ఎక్కువే ఉన్నది. 2019-20 సంవత్సరంలో జీఎస్డీపీ తలసరి ఆదాయంలో దేశంలోని 29 రాష్ర్టాలలో తెలంగాణ 9వ స్థానంలో ఉన్నది. కానీ 2022-23కు వచ్చేసరికి కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలని వెనక్కి నెట్టి 6వ స్థానానికి చేరుకుంది.
తెలంగాణ రాక ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం ఆసరా పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలన్నింటికి కలిపి దాదాపు రూ.14,122 కోట్లు మాత్రమే కేటాయిస్తే తెలంగాణ ఏర్పాటు అనం తరం ప్రభుత్వం మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, ఆసరా పింఛన్లు, మహిళా సంక్షేమం వంటి కార్యక్రమాలకు 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.22,229 వ్యయం చేసింది. ఇప్పుడు ఇది రెండున్నర రెట్లు పెరిగి ఈ తొమ్మిదేండ్లలో రూ.77,153 కోట్లు అంటే 25 శాతం బడ్జెట్ నాన్ ప్లానింగ్ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నది. ఒక్క కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ల మీద ఖర్చు గడిచిన తొమ్మిదేండ్లలో 10 రెట్లు పెరిగి రూ. 3,000 కోట్లకు చేరింది.
ఇక వైద్యవిద్యకు కేటాయింపులు 2014-15 నాటితో పోలిస్తే 600 శాతం పెరిగాయి. ప్రధానమంత్రి మోదీ ఎంతో అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న దాదాపు 7 కోట్ల జనాభా ఉన్న గుజరాత్లో కూడా గత ఏడాది అంతే కేటాయింపు లుండటం గమనార్హం. యూనివర్సిటీలలో మౌలి క వసతుల కల్పనకుగాను రూ.500 కోట్లు కేటాయించడం ద్వారా విద్యార్థుల అభ్యున్నతికి మేలు చేసినట్లయింది. గ్రామ ఆవాసాలను కలిపే రోడ్ల ను అద్భుతంగా తీర్చిదిద్దటం కోసం ఈ బడ్జెట్లో కొత్తగా రూ.22,260 కోట్లు కేటాయించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత రోడ్ల దశ తిరగడంతో పాటు రాష్ట్రమంతటా రవాణా వ్యవస్థ మెరుగు పడు తుంది. కేంద్రప్రభుత్వం సహకారం లేకపోయినా స్వయంశక్తితో అభివృద్ధిలో అద్భుతంగా రాణిస్తు న్నది తెలంగాణ. దేశంలోని అన్ని రాష్ర్టాలకు అభివృద్ధిలో దిక్సూచిగా తెలంగాణ నిలబడింది.
(వ్యాసకర్త: సహాయ ఆచార్యులు, కాకతీయ విశ్వవిద్యాలయం)
-డా॥ బైరి నిరంజన్ 9390115644