సృష్టికి మూలం అమ్మ. ఆమెకు ఎన్ని కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా బిడ్డల కోసం పరితపించి పోయే గొప్ప వ్యక్తిత్వం ఆ తల్లిది. మనకు అలాంటి తల్లి మన బతుకమ్మ. గౌరమ్మగా మనం పిలుచుకునే తెలంగాణ ఇలవేల్పు బతుకమ్మ. అందుకే ప్రతి ఏటాసంబురంగా పండుగ చేసుకుంటాం. భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. తీరొక్కపూలతో గౌరమ్మ ప్రతిరూపాన్ని తయారు చేసి పూజిస్తాం. బతుకమ్మ పండుగొస్తే తెలంగాణలోని ప్రతీ పల్లె నుంచి పట్నం దాకా సంబురాలే కనిపిస్తాయి.
సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత దేశం లో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయంతో పండుగలు జరుపుకుంటారు. మన రాష్ట్రంలో కూడా చాలా పండుగలు జరుపుకుంటాం. అయితే.. బతుకమ్మ పండుగకు మాత్రం ఓ విశిష్టత ఉన్నది. బతుకమ్మతో మనకు, మన పల్లెలకు, పట్టణాలకు విడదీయని అనుబంధం ఉంటు ంది. తెలంగాణ అంటేనే బతుకమ్మ. బతుకమ్మ అంటేనే తెలంగాణ. ప్రకృతిని ఆరాధించడం హిందూ సంప్రదాయం. సూర్యుడిని, చంద్రుడిని.. మనకు నీడనిచ్చే, తియ్య ని పండ్లనిచ్చే ప్రతీ చెట్టుని పూజిస్తాం. కా నీ.. పువ్వులను పూజించే పండుగ మాత్రం చాలా ప్రత్యేకమైనది. తీరొక్క రంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. గౌరమ్మను పెట్టి.. భక్తిశ్రద్ధలతో, భక్తి పారవశ్యంతో ఆడిపాడతాం. ఆడబిడ్డలను ఇంటికి పిలుచుకొని సంబురంగా గడుపుతాం. ప్రకృతితో, మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే పండుగ ఇది. మట్టి, చెట్టు, పూలు, నీరు ప్రకృతి సంబంధాలను ప్రకటిస్తే.. ఊరు, కుటుంబం, అన్న, చెల్లె, వది న, అమ్మగారిల్లు, అత్తగారిల్లు మానవ సంబంధాలను అద్భుతంగా పెనవేసుకొని ప్రదర్శించే కళారూపంగా బతుకమ్మను కీర్తిస్తుంటారు.
బతుకమ్మలో పల్లె వాసుల జీవనశైలి, శ్రామికులు, రైతుల బతుకుచిత్రం ఇమిడి ఉంటాయి. దుక్కి దున్నినప్పుడు నేలను పూజించినట్టు, ఏరు పారినప్పుడు గంగను మొక్కినట్టు, పంట ఇంటికి చేరినప్పుడు మైసమ్మను తలచినట్టు పూలను బతుకమ్మగా పేర్చి పెద్ద పండుగ చేస్తారు. పుడమి పులకింత, ప్రకృతి పరవశం దీనిలో లీనమై ఉంటాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక సామాజిక ఉత్సవం. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. బతుకమ్మను ఇంటి నుంచి తీసుకొని వెళ్లేవాళ్లు, బతుకమ్మ ఆడేందుకు వెళ్లేవాళ్లు చెప్పులు కూడా వేసుకోకుండా.. అమ్మవారిమీద భ యం, భక్తితో ఉంటారు. నిష్ఠగా పూజిస్తారు.
మన సంస్కృతిపై కుట్రలు..?
కానీ మన సంబురాలు చూసి కొందరికి కన్నుకుడుతున్నది. ఒకడు మందు సీసాలతో బతుకమ్మ బొమ్మ గీస్తాడు. మరొకడు మందు సీసాల చుట్టూ బతుకమ్మ ఆడుతున్నట్టు కార్టూన్ పేరుతో వెకిలి చేష్టలు చేస్తాడు. మరొకడు బతుకమ్మల ముందు డిస్కో డ్యాన్సులు చేసినట్టుగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతాడు. ఇదంతా చేస్తున్నది ఇతర ప్రాంతాల వాళ్లు.. మన బతుకమ్మ పవిత్రత తెలియని వాళ్లు కాదు. ఇక్కడ ఈ నేలపై పుట్టిన వాళ్లే. బతుకమ్మ గొప్పదనం తెలిసిన వాళ్లే దిగజారి ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల కోసం ఎంత టి నీచానికైనా వెనకాడటం లేదు. కొన్ని రాజకీయ పార్టీలు. కన్ను మిన్ను కానకుం డా బరితెగించి ప్రవర్తిస్తున్నాయి. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి వాళ్లు పెట్టిన పేరు విమర్శ. కానీ ఇది ఏ కోశానా విమర్శ అనిపించుకోదు.
ఇది మన సంస్కృతి, సంప్రదాయాలపైనే కాదు.. మొత్తంగా మన తెలంగాణ అస్తిత్వంపైనే జరుగుతున్న దాడిగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. తెలంగాణ బిడ్డలుగా ఈ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. కానీ అలా చేయకుండా అవమానకర చర్యలకు పాల్పడుతున్నారు. సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన బతుకమ్మ పండుగ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. మద్యం సీసాలు, డిస్కో వీడియోలు చేసి బతుకమ్మ పండుగ సంస్కృతిని అపవిత్రం చేస్తున్నారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దుతున్నారు. తెలంగాణ తల్లిని కన్నీరు పెట్టిస్తున్నారు.
చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి కుట్రలు అనేకం కనిపిస్తాయి. ఒక ప్రాంతంపై పట్టు సాధించాలంటే మొదట అక్కడి సంస్కృతిని దెబ్బతీయాలి. ఎందుకంటే సంస్కృతి, సంప్రదాయాలు అనేవి ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయి. సంస్కృతిని దెబ్బతీసినప్పుడు ఆ ఐకమత్యం దెబ్బతిని ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారుతుంది. అప్పుడు ఆ ప్రాంతంపై పట్టు సాధించవచ్చు. దాన్ని ఆక్రమించవచ్చు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నది కూడా అదే. మన బతుకు పండుగ అయిన బతుకమ్మను అవమానకరంగా చిత్రీకరించి.. తద్వారా కల్లోల పరిస్థితులను సృష్టించి రాష్ట్రంపై రాజకీయంగా పట్టుసాధించాలని కుట్రలు చేస్తున్నాయి. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణకు క్యూలో వేచి ఉంటున్నాయి. ఇది చాలా పార్టీలకు, ఆయా పార్టీల నేతలకు సహించడం లేదు. అందుకే రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారు. పవిత్రమైన మన సంస్కృతినే కాదు.. మన అభివృద్ధిని తొక్కేయాలని కుతంత్రాలు చేస్తున్నారు. అలాంటి విచ్ఛిన్నశక్తులకు తగిన బుద్ధి చెప్పాలి. మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.
(వ్యాసకర్త: వై.సతీశ్ రెడ్డి, టీఎస్ రెడ్కో చైర్మన్, 96414 66666)