Jats for Modi | 2014 ఎన్నికల ముంగిట తాము అధికారంలోకి వస్తే రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల క్యాష్ జమ చేస్తామన్నారు.. యువతకు ఏటా రెండు కోట్ల కొలువులిస్తామన్నారు. చూస్తుండగానే ఏడేండ్లు గడిచిపోయాయి..మధ్యలో సరిగ్గా ఐదేండ్ల క్రితం 2016లో అర్ధంతరంగా పెద్దనోట్ల రద్దు.. గతేడాది కరోనాను కంట్రోల్ చేసేందుకు దేశమంతా గంటల్లో లాక్డౌన్ అమల్లోకి తెచ్చారు. దాంతో ప్రజలు.. ప్రత్యేకించి వలస కార్మికుల బాధలు.. కష్టాలు వర్ణనాతీతం.
దేశమంతా కరోనా కల్లోలంతో అల్లాడిపోతుంటే పంటల సాగు రూపురేఖలే మార్చేయాలనుకున్నారు మోదీ. పంటల సేద్యాన్ని కార్పొరేటీకరించ తలపెట్టారు.. అందుకోసం గతేడాది సెప్టెంబర్లో కొత్తగా మూడు సాగు చట్టాలు తెచ్చారు.. కానీ అన్నదాతలు అలర్టయ్యారు. పంజాబ్.. హర్యానా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కర్షకులు కదం తొక్కారు. ఏడాది కాలంగా దేశ రాజధాని హస్తిన సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉధృత ఆందోళన చేశారు. కర్షకుల ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నసంకేతాల మధ్య సాగు చట్టాల్ వాపస్ అన్నారు మోదీ..
పోలీసుల నిర్బంధం.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి మధ్య గజగజా వణికే చలిలోనూ ఎండాకాలం కరోనా రెండో వేవ్ టెన్షన్ మధ్య ఏడాది పొడవునా సాగిన కర్షకుల ఆందోళనకు నాయకత్వం వహించిన వారిలో తికాయిత్లు ఉన్నారు. నరేశ్ తికాయిత్.. రాకేశ్ తికాయిత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ వాసులు.. అంతకు మించి జాట్లు..పశ్చిమ యూపీ జనాభాలో 18 శాతం జాట్లే.. యూపీ అంతటా 1.68 శాతం.. పంజాబ్లో సుమారు 25 శాతం జాట్లు..దాదాపు జాట్లంతా వ్యవసాయమే చేస్తుంటారు.. యూపీ జాట్లు చాలాకాలం మాజీ ప్రధాని చరణ్సింగ్కు.. తర్వాత ఆయన తనయుడు అజిత్సింగ్కు పట్టం కట్టారు.
అయితే, రామజన్మభూమి ఉద్యమం మొదలయ్యాక జాట్లలో ఒక సెక్షన్లో హిందుత్వ గుర్తింపు అదనపు ఆకర్షణగా మారింది..ఫలితంగా బీజేపీ పక్షం వైపు మళ్లారు జాట్లు.2013 ముజఫర్ నగర్ అల్లర్ల తర్వాత 2014 ఎన్నికల్లో జాట్ల నుంచి మోదీకి పూర్తిగా దన్ను లభించింది. ఫలితంగా జాట్ పాలిటిక్స్కు అజిత్ సింగ్ దూరం అయ్యారు.
2019లో రెండోసారి గెలుపొందాక తాజాగా సాగు చట్టాలు తేవడంతో మోదీపై జాట్లలో అసమ్మతి మొదలైంది.. వారిలో మెజారిటీ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనకు అజిత్ సింగ్ తనయుడు జయంత్ చౌదరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) సపోర్ట్ చేసింది. ఆ పార్టీ మద్దతుదారులైన కర్షకులూ పాల్గొన్నారు.ఈ పరిస్థితుల్లో జాట్లు తిరిగి ఆర్ఎల్డీ వైపు మళ్లుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయంత్ చౌదరి కూడా జాట్ రైతుల మనస్సు దోచేందుకు సీరియస్గానే ట్రై చేస్తున్నారు.
సాగు చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం.. బీజేపీకి వ్యతిరేకంగా కదం తొక్కిన జాట్లకు యూపీలో 19 శాతంగా ఉన్న ముస్లింలు తోడవుతారా.. అసదుద్దీన్ ఒవైసీ సారధ్యంలోని మజ్లిస్ పార్టీ వైపు మొగ్గుతారా.. జాట్లతోపాటు ముస్లింలు.. యాదవ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేశ్ యాదవ్తో చేతులు కలుపుతారా.. 11 శాతం జనాభా ఉన్న యాదవ్లు సీఎం అయితే, 19 శాతంగా ఉన్న ముస్లింలు అధికారంలోకి రావద్దా? అని అసదుద్దీన్ ఒవైసీ సెంటిమెంట్ రగులుస్తున్నారు.. అయితే, 1989 తర్వాత ముస్లింలు యూపీ పహిల్వాన్ ములాయం. తాజాగా అఖిలేశ్ యాదవ్కు మద్దతుగా ఉన్నారు.జాట్లు.. ఎస్పీ సారధ్యంలోని యాదవ్ ప్లస్ ముస్లిం కాంబినేషన్తో చేతులు కలుపుతారా.. అన్నది మున్ముందు తేలనుంది.
యాదవ్ ప్లస్ ముస్లిం కాంబినేషన్కు చెక్ పెట్టడానికి తొలి నుంచి యాదవేతర ఓబీసీలకు ప్రియారిటీ ఇస్తోంది బీజేపీ. సాగు చట్టాలతో కాకమీదున్న జాట్లను చల్లబరిచేందుకు మోదీ సారధ్యంలోని బీజేపీ సీరియస్గానే ప్రయత్నిస్తోంది. త్రిసూత్ర పథకం అమలు చేస్తోంది. జాట్ ప్రముఖుల గొప్పతనాన్ని
గ్లోరిఫై చేస్తోంది. అలీగఢ్లో ఓ యూనివర్సిటీకి రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు పెట్టారు.
జాట్ రైతుల మనస్సు చూరగొనేందుకు చెరుకు కొనుగోలు ధర పెంచుతూ యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా ప్రస్తుత జాట్ లీడర్లకు చేరువ కావడానికి బీజేపీ నేతలు పలు చర్యలు తీసుకుంటున్నారు.
హర్యానాలో ఇప్పటికైతే అసెంబ్లీ ఎన్నికల్లేవు గానీ.. పంజాబ్లో పూర్తిగా అర్బన్.. సబర్బన్ ప్రాంతాలకు పరిమితం బీజేపీ గతంలో మిత్రపక్షం అకాలీదళ్.. ఇదే సాగు చట్టాల వల్ల గతేడాది ఎన్డీఏకు దూరమైంది. ఇప్పటికైతే పెద్దగా బీజేపీకి అంచనాల్లేవు కానీ.. ఇటీవలే కాంగ్రెస్ వీడి.. దేశభక్తి.. జాతీయవాదం వినిపిస్తున్న పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ చరిస్మాపై కమలనాథులు.. ప్రత్యేకించి ప్రధాని మోదీ.. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటికే కెప్టెన్ ఇప్పటికే పంజాబ్ లోక్ కాంగ్రెస్ స్థాపించారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో పంజాబ్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వేళ పోలీసుల డిటెన్షన్లు.. ఆందోళన వేళ అనునిత్యం టెన్షన్లతో కాక మీదున్న పంజాబీ జాట్ రైతాంగం.. కెప్టెన్కు బాసటగా నిలుస్తారా వేచి చూడాల్సిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!