Thoutam Niharika | ప్రతి నెలా సమస్యే. డేట్ వచ్చిందంటే చాలు ఆందోళన. ఎవరికీ చెప్పుకోరు. ఎక్కడా చర్చించరు. నొప్పిని భరిస్తూ ఇంట్లోనే ఉండిపోతారు. ఆ రోజుల్లో కూడా నాసిరకం గుడ్డపేగులనే ప్యాడ్స్గా చాలామంది వాడుతుంటారు. రుతుక్రమం ఇలా చీకటి గదిలో దాచిపెట్టే విషయం కాదు. బడిలో పాఠంగా బోధించాలి అంటున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తౌటం నిహారిక! ఉపాధ్యాయురాలిగానే కాకుండా మహిళగా సాటి ఆడపిల్లలకు రుతుక్రమం ( Periods ) గురించి ఆమె ఎన్నో విషయాలు చెబుతున్నారు.
నెలసరి సమయంలో నొప్పిని నివారించేందుకు రకరకాల మందులు చాలామంది వాడుతుంటారు. దీనివల్ల భవిష్యత్లో మూత్రపిండాలు, కాలేయం, గుండె సంబంధ సమస్యలు తలెత్తవచ్చు అని అమెరికన్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో తేలింది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం సర్కారుబడి ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నది. ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నిహారిక ఆధ్వర్యంలో సామాజిక దురాచారాలను తిప్పికొట్టి ఆడపిల్లలకు భరోసాగా నిలుస్తున్నది.
నెల రోజుల క్రితం వరకు నిహారిక వరంగల్ అర్బన్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట ఉన్నత పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఈ మధ్యే కామారెడ్డిగూడెం బడికి బదిలీ అయ్యారు. గొర్రెకుంటలో పనిచేస్తున్న తొలిరోజుల్లో నిహారికకు అమ్మాయిల పరిస్థితి అర్థంకాకపోయేది. ఉన్నట్టుండి పాఠశాలకు రాకపోవడం, వచ్చినా ఏదో కోల్పోయినట్టు ఉండటం గమనించారు. వారిలో ఆత్మన్యూనతా భావం కనిపించేది. కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆమె. అందరు ఆడపిల్లల్లా వారిదీ రుతుక్రమ సమస్యే. నెలసరి సమయాల్లో అమ్మాయిల హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయేది. ఇటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, అటు బడిలో సంజాయిషీ ఇవ్వలేక నలిగిపోయేవాళ్లు. రుతుక్రమం సామాజిక రుగ్మత కాదనే అవగాహన కల్పించడానికి నడుంబిగించారు నిహారిక. పాఠశాలకు హాజరుకాని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు.
కామారెడ్డిగూడేనికి వచ్చిన తర్వాత కూడా రుతుక్రమ సమస్యపై స్పందిస్తున్నారు నిహారిక. ఉపాధ్యాయురాలిగానే కాకుండా ఒక మహిళగా పిల్లల సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలతో పరస్పరం చర్చించే అవకాశం కల్పించారు. చాలామంది నాప్కిన్స్ వాడటం లేదని గుర్తించారు. ‘పీరియడ్స్ పేదరికాన్ని’ తగ్గించడానికి తొలి ప్రయత్నంగా తన పదో తరగతి స్నేహితుల సహకారంతో ‘శానిటరీ నాప్కిన్స్’ ఇప్పించే ఏర్పాటు చేశారు. ఐదేండ్లపాటు సహకారం అందించేలా ప్రణాళిక రూపొందించారు. ‘పీరియడ్స్’ను అంటుముట్టుగా భావిస్తూ మానసిక సంఘర్షణకు గురవుతున్న బాలికలకు ఆత్మస్థయిర్యాన్ని కల్పించేందుకు ‘మెన్స్ట్రోపీడియా గ్రూప్’ ఏర్పాటుచేసి నెలలో రెండుసార్లు నెలసరి సమస్యలు, లైంగిక వేధింపులు, బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలు వంటి అంశాలపట్ల ఉపాధ్యాయులు, నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు.
‘మెన్స్ట్రోపీడియా’ గ్రూప్ను ప్రారంభించినప్పుడు గొర్రెకుంట పాఠశాల తరఫున ‘మెన్స్ట్రువల్ అవేర్నెస్ ర్యాలీ’ని నిర్వహించారు. వరంగల్ జిల్లాలోనే మొదటిసారిగా నిర్వహించిన కార్యక్రమం అది. దీన్ని చాలామంది తప్పుపట్టారు. ‘రుతుక్రమం అనేది సున్నితమైన అంశం’ అన్నారు. ‘లోపటింట్లో జరిగే తంతు.. రోడ్డుపై రచ్చ చేస్తున్నారేంది?’ అని విమర్శించారు. ‘రుతుక్రమం సున్నితమైన సమస్య అయితే, దానిని భరిస్తూ, నొప్పిని అనుభవిస్తూ, మానసిక సంఘర్షణకు గురవుతున్న బాలికలది, మహిళలది ఎలాంటి పరిస్థితి?’ అని ప్రశ్నించారు నిహారిక. గొర్రెకుంట పాఠశాలలో కావచ్చు, ఇప్పుడు కామారెడ్డిగూడెం బడిలో కావచ్చు చదువుతోపాటు పీరియడ్స్ గురించి విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ‘Say yes to tension-free periods No pads no safety Secured women secured society’ వంటి నినాదాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా నెలసరి సమయంలోనూ విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. శ్రద్ధగా పాఠాలు వింటున్నారు, సంతోషంగా ఆడుకుంటున్నారు.
రుతుక్రమ పాఠాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, గణితంలో మెలకువలు, విద్యా ప్రణాళికలో విద్యార్థులను మేటిగా తీర్చిదిద్దుతున్నారు నిహారిక. ఉదాహరణ ‘గూగుల్ హోం’. ఇది అలెక్సా మాదిరిగా పనిచేస్తుంది. విద్యార్థులు సందేహాలను గూగుల్ హోంకు వివరిస్తారు. లెక్కల ఉపాధ్యాయురాలే అయినా ఆంగ్లం, సాంకేతిక విషయాల్లోనూ ప్రేరణగా నిలుస్తున్నారామె. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కృత్రిమ మేధ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ‘గోల్ ఓరియెంటెడ్’ పద్ధతితో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
నిహారిక ఎయిర్ఫోర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. 21 ఏండ్లకే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని కేసముద్రం ఏకోపాధ్యాయ పాఠశాల నుంచి ప్రస్థానం ప్రారంభించారు. ఇంటర్నేషనల్ లీడర్షిప్ అండ్ ఎడ్యుకేషన్లో ఫెలోషిప్ పొంది 2018లో అమెరికా వెళ్లారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, బ్రిటిష్ కౌన్సిల్ వంటి ఎన్నో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని విదేశీ విద్యా విధానం, బోధనా పద్ధతులను అధ్యయనం చేశారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ. మనదగ్గరేమో భయం ఎక్కువ. అందుకే రుతుక్రమంపై అవగాహన కల్పిస్తున్నాను’ అంటారు నిహారిక.
నేను పనిచేసిన పాఠశాలలను ఆదర్శంగా నిలపడంలో ‘రుతుక్రమంపై అవగాహన’ ప్రధానంగా పనిచేసింది. ఇవే కాదు నేటి పిల్లల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా వారికంటూ ఓ లక్ష్యం ఉండటం లేదు. ఏదో నామమాత్రంగా చదివేస్తున్నారు. ఏది చేసినా శ్రద్ధతో చేయాలి. చదువుతో కలల్ని సాకారం చేసుకోవచ్చు. ఒకవేళ చదువుపై ఆసక్తి లేకపోతే వ్యవసాయం వైపు మళ్లాలి. అంతేగానీ ఇటు చదువుకోకుండా, అటు వ్యవసాయమూ చేయక జీవితాలు కాలక్షేపం చేయొద్దు.
– తౌటం నిహారిక
– దాయి శ్రీశైలం,
ఫొటోలు: స్వర్గం చంద్రశేఖర్
“Shark Tank India | అక్కడ ఒక్క ఐడియా చెప్తే చాలు.. మీ జీవితమే మారిపోతుంది !!”
“Gitanjali Rao | 15 ఏళ్ల అమ్మాయే కదా అని తక్కువ అంచనా వేయకండి”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
“Kriti Trust | నలుగురి కోసం ఆ ఇద్దరు.. లక్షల జీతాలు వదిలి మరి..”