Kriti Trust | సాధారణంగా ఇద్దరు కార్పొరేట్ ఉద్యోగులు కలుసుకుంటే కంపెనీల గురించో, జీతాల గురించో మాట్లాడుకుంటారు. కానీ ఆ ఇద్దరు మాత్రం సమాజ సమస్యలు చర్చించుకున్నారు. మురికివాడల బతుకుల్లోకి తొంగిచూశారు. కొలువులను వదిలేసి కృతి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు హైదరాబాదీ దోస్తులు.. హిమానీ గుప్త, శ్రీలత.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్.. హైదరాబాద్లో సంపన్నుల ప్రాంతాలని మనకు తెలుసు. వెలుతురు వెనకాలే చీకటిలా.. ఆ ఖరీదైన కాలనీల పక్కనే బిక్కుబిక్కుమంటూ పేదల బస్తీలూ ఉన్నాయి. అక్కడ ఎంతోమంది పిల్లలు బడి మొహం చూడలేకపోతున్నారు. సరైన ఉపాధిలేని ఒంటరి మహిళల సంఖ్యా తక్కువేం కాదు. హిమానీ, శ్రీలత.. ఆ కష్టాలు చూశారు. కథలు విన్నారు. మరుక్షణం నుంచే వారికి కార్పొరేట్ భవంతి అద్దాల జైలులా అనిపించింది. నలుగురికీ ఉపయోగపడని జీవితం ఎందుకన్న ఆవేశం పొంగుకొచ్చింది. లక్షల జీతాల ఉద్యోగాలను వదిలేశారు. పేదల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ‘కృతి’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. జనంలోకి వెళ్లారు. మొదట్లో పేద మహిళలకు ఈ ఇద్దరి మీదా నమ్మకం కలగలేదు. క్రమంగా బంధం పెరిగింది. విశ్వాసం బలపడింది. తమ బాధలు చెప్పుకోవడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు హిమానీ, శ్రీలత.. ఇద్దరూ విదేశాల్లోనే ఉండేవారు. ఒకరు అమెరికాలో, మరొకరు యూకేలో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఏదో కార్యక్రమంలో కలుసుకున్నారు. పరిచయస్థులు కాస్తా స్నేహితులుగా, స్నేహితులు కాస్తా ఎన్జీవో సహ-వ్యవస్థాపకులుగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ బంధం, భావ సారూప్యమే ఇద్దరినీ బస్తీల వెంట తిప్పింది. స్వయంగా వెళ్లి పేద కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సర్వేలు చేశారు. పట్టణ ప్రాంత పేదల జీవితాలను మార్చడానికి ఓ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అదే.. కృతిని ముందుండి నడిపిస్తున్నది. భుజం తట్టి భరోసా ఇస్తున్నది.
ఉపాధ్యాయులకు ఆధునిక బోధనలో శిక్షణ ఇస్తున్నది కృతి. ముఖ్యంగా కరోనా విపత్తు కారణంగా బడులకు దూరమైన పిల్లల కోసం ఫౌండేషన్ కోర్సు ప్రారంభించింది. షేక్పేట్ పరిసరాల్లోని ప్రైవేట్ బళ్ల యాజమాన్యాలతో మాట్లాడి బడి వేళల తర్వాత, సాయంత్రాలు తరగతులు నిర్వహిస్తున్నది. దాదాపు 20 మంది యువతీ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అధికారుల అనుమతితో ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ టీచర్లుగా ఉపాధి కల్పించింది. వీరికి కృతి ద్వారానే జీతాలు ఇస్తారు. విద్యార్థుల కోసం తరచూ సైన్స్ వర్క్షాప్లు కూడా ఏర్పాటు చేసున్నది కృతి.
“నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇంజినీరింగ్ తర్వాత ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చాక హిమానీతో పరిచయమైంది. తనకు కూడా నాలాగే సమాజ సేవపై ఆసక్తి ఎక్కువని అర్థమైంది. అలా కృతితో మా ప్రయాణం మొదలైంది. మొదట ఫిల్మ్నగర్ బస్తీలను ఎంచుకున్నాం. దాంతోపాటు సైదాబాద్ దగ్గర సింగరేణి కాలనీ, రసూల్పురా, మల్లేపల్లి పరిసరాలకు మా కార్యక్రమాలను విస్తరించాం. గత ఆరు నెలలుగా పాతబస్తీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. 2014 నుంచీ మా ప్రయాణం సాఫీగా సాగుతున్నది. నాలుగేండ్ల తర్వాత ఫండింగ్ పెరిగింది. దాంతో మా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయసహకారాలు అందిస్తున్నది” అని వివరిస్తారు శ్రీలత.
“మా సంస్థ ద్వారా ఇప్పటివరకూ ఐదువేల మందిని ఆదుకున్నాం. నాలుగు వందలమంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నాం. చాలామంది పేదపిల్లలు ప్రైవేట్ బళ్లలోనూ చదువుకుంటున్నారు. అమ్మానాన్నలకు బిడ్డలను గొప్పగా చదివించాలన్న ఆశ ఉన్నా, ఆ ఖర్చులను భరించే స్తోమత ఉండదు. అలాంటివాళ్లకు మా వంతు సాయం చేస్తున్నాం. ఒంటరి మహిళలకు కుట్టుపని, ఎంబ్రాయిడరీ, దినపత్రికలతో సంచుల తయారీ మొదలైన పనుల్లో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తర్వాత షేక్పేట్ దగ్గర్లోని మా ఉత్పత్తి కేంద్రంలో ఉపాధి కల్పిస్తున్నాం. యంత్రాలు, ముడిసరుకు మేమే సమకూరుస్తాం. గౌరవ వేతనం అందిస్తాం. మా దగ్గర శిక్షణ తీసుకున్న వాళ్లు సొంతంగా షాపులు పెట్టుకున్నారు. ఇంకొంతమంది ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ స్వయం ఉపాధి పొందుతున్నారు. దీని ద్వారా వచ్చే లాభాలను తిరిగి సంస్థకే ఉపయోగిస్తాం” అంటూ కృతి కార్య
క్రమాలను వివరిస్తారు హిమానీ గుప్త.
…? నిఖిత నెల్లుట్ల
Read More :
“అప్పుడు నెత్తిమీద గంపపెట్టుకుని తిరిగాడు.. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు”
“ఏపీకి చెందిన ఈ అంధుడి బయోపిక్ తీయాలని బాలీవుడ్ ఎందుకు ఆరాటపడుతున్నది?”
రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా