Independence Day special| వజ్రం అంటే ఠక్కున గుర్తొచ్చేది కోహినూర్ ( Kohinoor Diamond ) దీన్ని వజ్రాల్లో రారాజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం ఇది. కొన్ని వేల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ కోహినూర్ వజ్రం మనది. మన తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో రాజవంశాల చేతులు మారిన ఈ కోహినూర్ వజ్రం.. మన భారతదేశం దాటి చివరకు బ్రిటన్ చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. అసలు ఈ కోహినూర్ వజ్రం భారత్లో ఎక్కడ దొరికింది? ఇది బ్రిటన్ ఎలా చేరింది? వారి వారసత్వ కానుకగా ఎలా మారింది? వంటి వివరాలు ఒకసారి చూద్దాం..
తెలుగువారి అమూల్య సంపదకు నిలువెత్తు నిదర్శనం కోహినూర్ వజ్రం. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా ఖ్యాతిగడించిన ఈ వజ్రం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలోని కొల్లూరు గనుల్లో దొరికింది. 105 క్యారెట్లు గల ఈ వజ్రం మొదటి యజమాని మాల్వా రాజు మహలక్ దేవ్ అని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన చేతిలో క్రీ.శ. 1300వ సంవత్సరంలో ఈ వజ్రం ఉండేదని.. అయితే మాల్యా పాలక వంశాన్ని తుదకు అల్లా ఉద్దీన్ ఓడించి.. అక్కడి ధనరాశులతో పాటు కోహినూర్ వజ్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు.
మరో కథనం ప్రకారం.. కోల్లూరులో లభ్యమైన ఈ కోహినూర్ వజ్రం.. కాకతీయుల కాలంలో గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాను పంపిన మాలిక్ కాఫుర్తో సంధి చేసుకుని అపారమైన సంపదతో పాటు, కోహినూర్ వజ్రాన్ని సమర్పించుకున్నాడు. అలా ఢిల్లీ చేరిన కోహినూర్ వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోఢీ చేతికి వచ్చింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్ రాజవంశ స్థాపకుడైన బాబర్ చేతిలో ఇబ్రహీం లోఢీ ఓటమి పాలై మరణించాడు. లోఢీ మరణానంతరం సుల్తానుల ఖజానాతో పాటు కోహినూర్ వజ్రం బాబర్ వశమైంది. ఆ సమయంలో దీనికి బాబర్ వజ్రంగా కూడా పేరు పొందింది. బాబర్ తర్వాత ఈ వజ్రాన్ని హుమాయూన్కి ఇచ్చాడు. అతను ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ వజ్రాన్ని ప్రాణపదంగా కాపాడుకున్నాడు.
మొఘల్ రాజవంశం పతనావస్థకు చేరిన సమయంలో ఇరాన్ బాద్షా నాదిర్షా దండయాత్రకు వచ్చాడు. మహమ్మద్ షాను ఓడించి.. సామ్రాజ్యం మొత్తాన్ని ఆక్రమించాడు. శతాబ్దాల నుంచి సేకరించిన మొఘల్ సంపదను మొత్తం ఊడ్చేశాడు. పట్టణంలోని సంపన్నులు, ప్రముఖుల అందరి సొత్తును కాజేశాడు. ఆ తర్వాత రెండున్నర నెలలకు భారత పగ్గాలను తిరిగి మహమ్మద్ షాకు అప్పగించి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. చివరకు 1739 మే 12న పగ్గాలు అప్పగించాడు. ఆ సమయంలో ఢిల్లీ అంత సంబురంగా ఉంది. ఆ సమయంలోనే ఢిల్లీలోని ఒక పరిచారిక నాదిర్షాకు విలువైన సమాచారాన్ని అందించింది. మీరు సేకరించిన మొత్తం సంపద కంటే విలువైన వస్తువు ఒకటి ఉందని.. దాన్ని మహమ్మద్ షా తన తలపాగాలాఓ దాచాడని ఉప్పందించింది. దీంతో ఎలాగైనా ఆ వజ్రాన్ని కొట్టేయాలని నాదిర్ షా ఒక ఉపాయం పన్నాడు.
నాదిర్ షా ఇరాన్ బయల్దేరే ముందు.. మహమ్మద్ షాతో ఇరాన్లో ఒక సంప్రదాయం ఉందని చెప్పాడు. సంతోషంగా ఉన్న సమయంలో సోదరులు తమ తలపాగాలు మార్చుకుంటారని అన్నాడు. ఈ రోజు నుంచి మనం సోదరులం.. నా సంతోషం కోసం మనం కూడా తలపాగాలు మార్చుకుందామా అని మహమ్మద్ షాను అడిగాడు. అప్పుడు నాదిర్ షా ముందు తలవంచడం తప్ప ఏమీ అనలేని పరిస్థితిలో పడిపోయాడు మహమ్మద్ షా. నాదిర్ షా తన తలపాగాను మహమ్మద్ షా తలపై పెట్టి.. ఆయన తలపాగాను తీసి తన తలపై పెట్టుకున్నాడు. తొలిసారి నాదిర్ షా ఆ వజ్రాన్ని చూడగానే.. కోహ్-ఇ-నూర్ అని అభివర్ణించాడు. అప్పటినుంచి ఆ వజ్రానికి కోహినూర్ అనే పేరు స్థిరపడింది. మొత్తానికి ఆ సంఘటనతో ఒకచరిత్రకు తెరపడింది. తొలిసారి కోహినూర్ వజ్రం భారతదేశం దాటి ఇరాన్ వెళ్లింది. నాదిర్ షా తర్వాత కోహినూర్ వజ్రం అఫ్ఘనిస్థాన్ ఎమిర్ అహ్మద్ షా అబ్దాలీ చేతుల్లోకి వెళ్లింది.
క్రీ.శ.1913వ సంవత్సరంలో తన వద్ద శరణు కోరి వచ్చిన పర్షియన్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని లాహోర్ కేంద్రంగా పంజాబ్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న మహారాజా రంజిత్ సింగ్ సొంతం చేసుకున్నాడు. చివరకు చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన దులీప్ సింగ్ ద్వారా బ్రిటిష్ గవర్నర్ లార్డ్ డల్హౌసీ దీన్ని విక్టోరియా రాణికి బహుమతిగా ఇప్పించాడు. అయితే వజ్రం మరింత మెరవాలని క్వీన్ విక్టోరియా ఆ వజ్రానికి సాన పెట్టించింది. కానీ ఆ వజ్రం నాణ్యత 186 క్యారెట్ల నుంచి 108 క్యారెట్లకు తగ్గింది. దీంతో ఆ వజ్రాన్ని కిరీటంలోకి తాపడం చేయించింది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ ధరించారు.
ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజకుటుంబంలో వారసత్వ కానుకగా మారింది. ఈ వజ్రాన్ని తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేస్తున్నారు.
Independence day special | 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
75th independence day | 71 ఏండ్ల పాటు అక్కడ స్వాతంత్య్ర దినోత్సవమే జరుపుకోలేదు !
Independence Day Special |భారత్ నుంచి బ్రిటీషోళ్లు ఎంత సంపద దోచుకెళ్లారు
1947 నుంచి ప్రతి రోజు ఎగురుతున్న జాతీయ జెండా