Independence Day Special | సుమారు నాలుగు వందల ఏండ్ల క్రితం జరిగిన ఒక సంఘటన. ఆనాడు మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మమహ్మద్ జహంగీర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మొఘల్ దర్బార్లో తులాభారం జరుగుతోంది. బంగారు తాపడం చేసిన తాసులో ఒక పళ్లెంలో మొఘల్ చక్రవర్తి కూర్చుంటే.. మరో పళ్లెంలో వెండి, బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు తూకం వేస్తూ పేదలకు పంచిపెడుతున్నారు. ఇదంతా అక్కడే దర్బార్లో ఓ మూల నిల్చొని బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో గమనిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాణిజ్య ఒప్పందం కోసం అతను జహంగీర్ ముందు మోకరిల్లాడు. మూడేళ్లపాటు మొఘలుల చుట్టూ తిరుగుతూ కాళ్లా వేళ్లా పడితే.. చివరకు జహంగీర్ సంరక్షుడు అహద్ షాజహాన్ను ఒప్పించి సూరత్లో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చాడు. అలాంటిది దాదాపు రెండు వందల ఏండ్లలో మొత్తం తలకిందులైంది. 1803లో ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆధారపడాల్సిన వచ్చింది. దీనికోసం ఆ కంపెనీ క్లర్కు ముందు మోకరిల్లాల్సిన దుస్థితి వచ్చింది. అంటే భారత్ నుంచి ఆంగ్లేయులు ఎంత దోచుకొని ఉండాలి?
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్కు సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత వాణిజ్యం పేరు చెప్పి దేశంలోకి ప్రవేశించిన పోర్చుగీసు వాళ్లు.. భారత వ్యాపారులపై పై చేయి సాధించారు. ఆ తర్వాత భారత్పై పట్టు సాధించారు. పోర్చుగీసు తర్వాత డచ్ వాళ్లు కూడా భారత్లోకి అడుగుపెట్టారు. ఈసారి వీళ్లు ఫిరంగులు, నౌకాదళంలో రావడంతో ఆ రెండు దేశాల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. ఇదంతా ఓపిగ్గా గమనించిన ఇంగ్లండ్ సమయం కోసం వేచి చూసింది. సమయం చిక్కగానే 1600 డిసెంబర్లో భారత్లో ఈస్టిండియా కంపెనీని స్థాపించింది. భారత్లో వాణిజ్యం కోసం బ్రిటీష్ రాయబారి సర్ థామస్ చాలానే కష్టపడ్డారు.ఎందుకంటే మొఘల్ చక్రవర్తి దృష్టిలో ఇంగ్లండ్ పెద్దగా ప్రాధాన్యం లేని ఒక చిన్న దీవి. దానిని ఒక సామ్రాజ్యంతో పోల్చడం మొఘలుల పరువు ప్రతిష్ఠలకే భంగం. అయితే సర్ థామస్ ధైర్యం కోల్పోలేదు. మూడేళ్లు నిర్విరామంగా కష్టపడ్డాడు. దౌత్య ముడుపులు, బహుమతులు ఇచ్చి.. చక్రవర్తి జహంగీర్ అనుచరుడు అహద్ షాజహాన్ మెప్పించాడు. సూపర్తో వ్యాపారానికి అనుమతి పొందాడు. దీంతో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటైంది.
మొఘలుల నుంచి ఆదేశాలు రాగానే ఆంగ్లేయులు భారత్లోని సముద్ర తీరం వెంబడి ఉన్న ఉన్న నగరాల్లో ఒక్కొక్కటిగా తమ వ్యాపార స్థావరాల (ఫ్యాక్టరీలు) ను స్థాపించడం మొదలుపెట్టారు. వీటిల్లో మసాలా దినుసులు, పట్టు, ఇతర వస్తువుల వ్యాపారం ప్రారంభించారు. వీటిలో అద్భుతమైన లాభాలు వచ్చాయి. దీంతో ఇతర యూరప్ దేశాలకు ఇంగ్లండ్కు మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. దీంతో సరుకులను దోచుకోవడానికి ఫ్యాక్టరీలను కాస్త కోటలుగా మార్చేశారు. భారీగా సిపాయిలను నియమించుకుని తమ బలాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత స్థానిక రాజ్యాల మధ్య విభేదాల్లో తలదూర్చి వాటిని యుద్ధాల వరకు తీసుకెళ్లారు. ధనార్జన లక్ష్యంగా ఒకవైపు రాజుకు సిపాయిలను, మరోవైపు రాజులకు ఆయుధాలు, ఫిరంగులు అందించారు. అలా రాజ్యాలను విభజిస్తూ డబ్బు సంపాదించుకున్నారు. ఆంగ్లేయుల పలుకుబడి అంతకంతకూ పెరిగిపోతుంటే.. మొఘలులు తమ అసమర్థత, విదేశీయుల దాడులతో చాలా బలహీనంగా అయిపోయారు. ప్లాసీ యుద్ధం జరిగిన తర్వాత 50 ఏండ్లలోనే ఈస్టిండియా కంపెనీలో సిపాయిల సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. దీంతో బెంగాల్తో పాటు భారత్లోని ఇతర ప్రాంతాలపై కూడా ఆంగ్లేయులు తమ ఆధీక్యం పెంచుకున్నారు.
చక్రవర్తులుగా రాజ్యమేలిన మొఘలుల పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది. 1803లో దిల్లీ సింహాసనంపై ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం.. ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు బ్రిటీష్ రాయబారి సర్ థామస్.. మొఘల్ చక్రవర్తి ముందు వంగి ఒప్పందం చేసుకుంటే.. ఇప్పుడు అదే మొఘల్ పాలకులు ఈస్టిండియా కంపెనీలోని ఒక క్లర్క్ ముందు మోకరిల్లి బెంగాల్ను అప్పగించాల్సిన పరిస్థితికి చేరారు. బెంగాల్ ఆక్రమణ తర్వాత ఒక్కో సంస్థానాన్ని సొంతం చేసుకుంటూ ఈస్టిండియా కంపెనీ ముందుకెళ్లింది. 1818లో మరాఠా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత.. కొన్నేండ్లలోనే సిక్కులను ఓడించి నార్త్ ఇండియా ( పాకిస్థాన్తో సహా )ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఖైబర్ నుంచి బర్మా (మయన్మార్ ), హిమాలయ పర్వతాల వరకు తన సామ్రాజ్యాన్ని స్థాపించింది. కానీ 1857లో సిపాయిల తిరుగుబాటుతో ఈస్టిండియా కంపెనీ పతనం ప్రారంభమైంది.
సిపాయిల తిరుగుబాటుతో యుద్ధంలో భారీగా రక్తపాతం చోటుచేసుకుంది. దేశమంతటా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అప్పుడు ఉన్న వార్త పత్రికల ద్వారా భారత్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఇంగ్లండ్కు తెలిసిపోతూ ఉండేది. దీంతో భారత్లోని ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు ఇంగ్లండ్ పార్లమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది. అలా భారతదేశాన్ని నేరుగా బ్రిటీష్ ప్రభుత్వం కిందకు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈస్టిండియా కంపెనీ కొన్నేండ్లు అక్కడక్కడ పనిచేసింది. 275 ఏండ్ల సుదీర్ఘ పాలన తర్వాత చివరకు 1874 జూన్ 1న ఈస్టిండియా కంపెనీ రద్దయింది. ఆ తర్వాత ఎంతోమంది పోరాటాలు, ప్రాణత్యాగాల తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్రం ప్రకటించి వెళ్లిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయేటప్పుడు ఆంగ్లేయులు తమ పడవల నిండా ఎంతో విలువైన సంపదను దోచుకెళ్లారు.
అయితే భారత్ నుంచి ఆంగ్లేయులు ఎంత దోచుకెళ్లారనేది మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఈ విషయాన్ని కనుగొనేందుకు ఎంతోమంది ఎన్నోరకాల అంచనాలు వేశారు. వీటిలో ఆర్థికవేత్త మెహనాజ్ మర్చంట్ పరిశోధన ప్రకారం.. 1757 నుంచి 1947 వరకు ఆంగ్లేయుల వల్ల భారత్కు 209,422,500,000,000 రూపాయల నష్టం జరిగింది. అయితే ఇరాన్ పాలకుడు నాదిర్ షా మాత్రం ఒక్క ఢిల్లీ నుంచి 173 మిలియన్ డాలర్లను దోపిడీ చేసుకెళ్లాడు.
Independence day special | 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల్లో గాంధీజీ ఎందుకు పాల్గొనలేదు?
1947 నుంచి ప్రతి రోజు ఎగురుతున్న జాతీయ జెండా
Independence day Celebrations | మువ్వన్నెల మురిపాలు
జాతీయ జెండా ఏర్పాటులో అపశృతి.. క్రేన్ ట్రాలీ విరిగి ముగ్గురు మృతి
భర్తకు గుడికట్టి నిత్య పూజలు.. పతిభక్తి చాటుకుంటున్న మహిళ..!