చింతకాని, జూన్ 29: వర్షాల నేపథ్యంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకూడదనే ఉద్దేశంతో రైతు ఆశీర్వాద సభను వాయిదా వేసినట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా పంపిణీ పూర్తయిన అనంతరం రైతు ఆశీర్వాద సభ పేరుతో ముగింపు వేడుకలను మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్రోడ్డు వద్ద ఈ నెల 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్దత్తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి సోమవారం పరిశీలించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. హైదరాబాద్లోని శిల్పకళా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా పథకం నిధులను మంగళవారం విడుదల చేస్తారని వెల్లడించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.