హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : వైద్యులు, నర్సులు సమన్వయంతో పని చేస్తేనే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ట్రెయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(టీఎన్ఏఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సరూర్నగర్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సెంటర్తో నర్సింగ్ విద్యార్థులకు అత్యాధునిక సిమ్యులేషన్ ఆధారిత ప్రాక్టికల్ శిక్షణ అందించి, వారి క్లినికల్ నైపుణ్యాలను మెరుగుపర్చవచ్చని తెలిపారు. వైద్య రంగంలో నిరంతర అభ్యసనం అవసరమని సూచించారు. నర్సింగ్ విద్యాభివృద్ధికి పరిశోధనలు, అధ్యాపక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థిక సహకారం అందిస్తున్న టీఎన్ఏఐను ఆయన అభినందించారు.